రాజకీయ లబ్ధి కోసమే రాయల తెలంగాణ

హైదరాబాద్ :

కేవలం రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే రాయల తెలంగాణ ఏర్పాటు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తాజాగా తెర మీదకు తెచ్చిందని వైయస్ఆర్ కాంగ్రె‌స్ శాసనసభా పక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి ‌ఆరోపించారు. ఈ ప్రతిపాదన ప్రజలకు ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు.

రాయల తెలంగాణ కావాలని ఎవరడిగారు?:
ఎంతో చరిత్ర , ఒక ప్రత్యేకత ఉన్న రాయలసీమను విభజించే హక్కు కేంద్రానికి ఎవరిచ్చారని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు? రాజకీయ లబ్ధి కోసం రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను విభజించాలని ఆ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేశ్ వంటి కొందరు కోరితే అడ్డంగా చీల్చేస్తారా? అని నిప్పులు చెరిగారు. రాయలసీమ అంటే లెక్కలేకుండా పోయిందా! అని ధ్వజమెత్తారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా రాష్ట్రాన్ని విభజిస్తున్నారని, తమ పార్టీ ఈ చర్యను ఖండిస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేసి గెలిపించిన పాపానికి వారి జీవితాలతో చెలగాటం ఆడుతోందని, అన్నీ చూస్తూ ఏమీ చేయలేక జనం నిస్సహాయులుగా మిగిలిపోయారని అన్నారు.

సమైక్య ఉద్యమానికి ద్రోహం చేసే కుట్రలో భాగమే :
సమైక్యవాద ఉద్యమానికి ద్రోహం చేసే కుట్రలో భాగంగానే తాజాగా రాయల తెలంగాణ ప్రతిపాదన చేస్తున్నారని శోభా నాగిరెడ్డి దుయ్యబట్టారు. అసలు రాయలసీమను తమతో కలపవద్దని తెలంగాణలోని అన్ని రాజకీయ పక్షాలు, టీజేఏసీలు చెబుతుంటే ఆ ప్రాంత నేతలు మాత్రం తమను కలుపుకోమని ఎందుకు దేబిరిస్తున్నట్లు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణలోని అన్ని రాజకీయ పక్షాలు ముక్తకంఠంతో కోరుతుంటే కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతంలోని నేతలు మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క నినాదం చేస్తున్నారని ఆమె తప్పు పట్టారు.

'చిరంజీవి హైదరాబాద్‌ను యూటీ చేయాలంటారు, పురందేశ్వరి విశాఖపట్టణాన్ని రాజధాని చేయమంటారు, కొందరు కేంద్ర మంత్రులేమో ప్యాకేజీలు ఇస్తే చాలంటారు, ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రాన్ని విభజించుకోండి అంటూ బ్లాంక్ చె‌క్‌లాగా లేఖను ఇచ్చేస్తారు'.. అని శోభా నాగిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వీరంతా ఒకేమాట చెబితే నేడు ఈ పరిస్థితి వచ్చేదా? అని ఆమె ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రులు.. తాము సమైక్యవాదులమని బయటికి చెబుతూ లోపలికి పోయి అధిష్టానంతో ఏమి చెప్పి వస్తున్నారో కానీ కేంద్రం విభజనకు సిద్ధం అవుతోందన్నారు. సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు తమ పార్టీ నేత గట్టు రామచంద్రరావు చేసిన విమర్శలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరికాదని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Back to Top