రైతు సంక్షేమమే వైయస్‌ఆర్ కాంగ్రెస్ లక్ష్యం

పెద్దవడుగూరు:

రైతుల సంక్షేమమే వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అనంతపురం, రాయదుర్గం ఎమ్మెల్యేలు  గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, నాకంటీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ స్పష్టంచేశారు. అనంతపురం జిల్లా చిట్టూరు వంకలో సోలార్ పవర్ ప్లాంట్ వారు నిర్మించిన బావి వద్ద పార్టీ తరిమెల నాయకుడు శరత్‌ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని  విస్మరించిందన్నారు. హెచ్‌ఎల్సీ 10 టీఎంసీల సాగు నీరు అందించక పోవడం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమన్నారు. చిట్టూరు సమీపంలోని పెన్నానదిలో అక్రమంగా బోరువేసి గంజిగుంటపల్లి వద్ద నిర్మిస్తున్న  సోలార్ పవర్ ప్లాంటుకు నీటిని తరలిస్తే, కొన్ని వందల ఎకరాలు బీళ్లుగా మారే అవకాశం ఉందన్నారు.  రైతులకు సమస్యలు సృష్టించే పరిశ్రమలు అవసరం లేదని, రైతులకు అన్యాయం జరిగితే సహించమని ఎమ్మెల్యే గురునాథరెడ్డి అన్నారు. ప్రజలను చంపి పరిశ్రమలకు నీరు అందజేస్తే ఊరుకోమని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. బోరుబావిని పూడ్చివేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్లాంటు సమీపంలో తీసిన గుంతలను పరిశీలించారు.

Back to Top