పాదయాత్ర.. ప్రత్యర్థుల గుండెల్లో యుద్ధభేరి

ఇచ్ఛాపురం 04 ఆగస్టు 2013:

జగనన్న బాణం శ్రీమతి షర్మిల పాదయాత్ర ఓ చారిత్రక సందర్భమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సభలో ఆయన ప్రసంగించారు. భూమాత, చరిత్ర ఆమె పాదయాత్రకు చలిస్తున్నాయన్నారు. అడుగుల యుద్ధమే ఈ పాదయాత్రని పేర్కొన్నారు. శ్రీమతి షర్మిది పాదయాత్ర కాదనీ  పాదభేరనీ,  ప్రత్యర్థుల గుండెల్లో యుద్ధభేరిని మోగిస్తోందనీ ఆయన అభివర్ణించారు. జగన్మోహన్ రెడ్డిగారికి వ్యతిరేకంగా కాంగ్రెస్, టీడీపీలు ఎన్ని కుయుక్తులు, కుట్రలు పన్నాయో  మనందరికీ తెలుసన్నారు. తన పాదయాత్ర ద్వారా శ్రీమతి షర్మిల ప్రతి గుండె తలుపును తట్టారని చెప్పారు.  ప్రజల కష్టాలు తీర్చగల ఏకైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిగారు మాత్రమేనని ప్రజలకు తెలుసన్నారు. తప్పుడు కేసులతో జగనన్నను జైలులో వేసి 14 నెలలైందనీ, ఆయన జైల్లో కాదు జనం గుండెల్లో బందీ అయి ఉన్నారనీ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విభజించడానికి చంద్రబాబు కేంద్రానికి చాకులా ఉపయోగపడ్డాడని విమర్శించారు. రెండు ప్రాంతాలకూ న్యాయం చేసేలా పెద్దన్న పాత్ర పోషించాలని మన పార్టీ ప్లీనరీలో కోరిన విషయాన్ని భూమన గుర్తుచేశారు.

మాజీ మంత్రి మారెప్ప మాట్లాడుతూ.. శ్రీమతి షర్మిలను మల్లె పూవు పరిమళంగా అభివర్ణించారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయ్యి రాష్ట్రాన్ని విభజించాయని ఆరోపించారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర రికార్డులు సృష్టించడం కోసం కాదని స్పష్టంచేశారు.

శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మ ప్రియ మాట్లాడుతూ పాదయాత్ర చేపట్టిన శ్రీమతి షర్మిలకు కృతజ్ఞతలు తెలిపారు. 230  రోజుల పాటు 3113 కి.మీ నడిచి ఆమె పడిన కష్టం అంతా ఇంతా కాదనీ, ఆమె ఉక్కు మహిళని నిరూపించుకున్నారనీ పేర్కొన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తమలాంటివారికి మీ పాదయాత్ర ఆదర్శనీయమన్నారు.
జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ.. చరిత్ర పుటల్లో పాదయాత్ర నిలుస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డిగారు... రాజకీయాల్ని ఓ కుదుపు కుదిపారు. జగన్మోహన్ రెడ్డి గారికి లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించి తప్పు చేసిందని చెప్పారు.  ప్రజా శ్రేయస్సు, ప్రజల అవసరాలు తెలుసుకోవడానికి ఓ మహిళ శ్రీమతి షర్మిల రాష్ట్రం నలుమూలలా పాదయాత్ర చేశారన్నారు. ప్రతి మోములోనూ చిరునవ్వు చూడడమే మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుటుంబ లక్ష్యమని పేర్కొన్నారు. మహోద్యమానికి ఇచ్చాపురం నుంచే శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు పాదయాత్ర పాతాళ యాత్రగా మారిపోయిందని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తెలిపారు. 

రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.. అందరి కష్టాలు తెలుసుకున్న మహానేత అన్ని వర్గాలకూ అనుగుణంగా పరిష్కారాలు చూపారన్నారు. తండ్రి దారిలో పాదయాత్ర చేసిన శ్రీమతి షర్మిల అన్ని సమస్యలను రాసుకున్నారు. జగనన్న ముఖ్యమంత్రి కాగానే అవన్నీ తీరుస్తారన్నారు. నిర్వీర్యమైన కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసిన వైయస్ఆర్ కుటుంబాన్ని సీబీఐ రూపంలో కాంగ్రెస్ కాటేసింది. చంద్రబాబుకు రెండో సారి అధికారమివ్వడానికి ప్రజలు అంగీకరించరన్నారు. శ్రీమతి షర్మిలతో పాటు నడవడానికి తన భార్య భారతికి  అవకాశం రావడాన్ని అదృష్టంగా భావించానన్నారు.  పాదయాత్ర ఫలితం త్వరలో చేకూరుతుంది.

నల్లా సూర్య ప్రకాశ్ మాట్లాడుతూ... జగన్ సీఎం అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రజామోదం పొందిన సీఎంలు ఎన్టీఆర్, వైయస్ఆర్ మాత్రమేనని చెప్పారు.  తండ్రి ఆశయాలకు కట్టుబడి ఉండడం వల్లే శ్రీ జగన్ జైల్లో ఉండాల్సి వచ్చిందన్నారు. తెలంగాణలో కూడా రాజన్నను గుండెల్లో దాచుకుంటున్నారనీ, జగనన్న ఎవరూ ఆపలేరనీ,  కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డేనని తెలిపారు. పార్టీ నేతలు డాక్టర్ ఎమ్.వి. మైసూరారెడ్డి, జలగం వెంకటరావు, ఎమ్మెల్యే సుజయ కృష్ణరంగారావు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్యే జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా మాట్లాడారు.

Back to Top