'సమైక్య ఉద్యమంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్'

బుట్టాయిగూడెం (ప.గో.జిల్లా):

సమైక్య రాష్ట్రం కోసం కట్టుబడి ఉద్యమిస్తున్నది రాష్ట్రంలో ఒక్క వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ మాత్రమే‌ అని పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు. బుట్టాయిగూడెంలో బుధవారం జరిగిన సమైక్యాంధ్ర ఏజెన్సీ ప్రజాగర్జనలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలోని యుపిఎ ప్రభుత్వం స్వార్థపూరిత కుట్రను ముందే పసిగట్టిన తమ పార్టీ ఎమ్మెల్యేలు పదవులకు ముందే రాజీనామాలు చేసిన వైనాన్ని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన ప్రకటనను నిరసిస్తూ 50 రోజులుగా ప్రజా ఉద్యమం జరుగుతుంటే యుపిఎ ప్రభుత్వ పాలకులు కనీసం పట్టించుకోకపోవడం శోచనీయం అన్నారు.

స్వాతంత్య్ర పోరాటానికి సత్యాగ్రహ ఉద్యమం కొనసాగిన విధంగానే ఇప్పుడు సీమాంధ్రలో కూడా అలాంటి ఉద్యమమే జరుగుతోందని బాలరాజు అన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు వారి పదవులకు స్పీకర్ ఫా‌ర్మాట్‌లో రాజీనామాలు చేసి ఉంటే అసలు ఈ విభజన ప్రకటనే వచ్చేది కాదని అన్నారు. కాంగ్రెస్ వైఖరి వల్ల అన్ని వర్గాల సీమాంధ్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

Back to Top