అధికారపార్టీకి కొమ్ముకాస్తున్న స్పీకర్ పై అవిశ్వాసం

స్పీకర్ అధికారపార్టీకి కొమ్ముకాస్తున్నారు
ప్రతిపక్షం గొంతునొక్కుతూ ..విలువలకు తిలోదకాలిస్తున్నారు
ప్రజల మనోభవాలను కాలరాస్తున్నారు
పార్టీకార్యకర్తకు, స్పీకర్ కు తేడా లేకుండా పోయిందిః కోటంరెడ్డి

హైదరాబాద్ః సభలో పార్టీలకతీతంగా తండ్రిపాత్ర పోషించాల్సిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు ...ప్రతిపక్షం గొంతు నొక్కే రీతిలో అధికారపార్టీకి కొమ్ముకాస్తూ రక్షణకవచంలా ఉంటున్నాడని  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రికి మద్దతు పలుకుతూ స్పీకర్ కోడెల నిరంకుశ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పార్టీ కార్యకర్తకు, స్పీకర్ కు తేడాలేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.  

ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దాకా  ప్రతిపక్ష నాయకుని ప్రసంగానికి అడుగడుగునా అడ్డుతగిలినా...స్పీకర్ అడ్డుచెప్పకపోవడం దారుణమన్నారు. అధికారపక్షం సభ్యులు ప్రతిపక్ష నేతను ఎన్ని తిట్టినా, దుర్భషలాడినా స్పీకర్ కోడెల వింటాడు గానీ ఖండించడని చెప్పారు. ఉన్నతమైన స్పీకర్ స్థానంలో ఉండి, రాష్ట్ర ప్రజల మనోభావాలను కాలరాస్తూ.... విలువలకు తిలోదకాలు ఇస్తున్నందునే కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాసం పెడుతున్నామన్నారు. సభా సంప్రదాయాలను మంటగల్పుతున్న అధికారపార్టీ తీరును ప్రజలంతా గమనిస్తున్నారని కోటంరెడ్డి చెప్పారు.  

సభలో జరుగుతున్న పరిణామాల పట్ల ప్రజలు కూడా ఆవేదన చెందుతున్నారని,  చర్చ సందర్భంగా.. ముఖ్యమంత్రి, స్పీకర్‌ను కోరేది ఒకటేనని, ప్రత్యక్ష ప్రసారాలను ఎడిట్ చేయకుండా ప్రసారం చేస్తే ఎవరు తప్పు చేశారో అర్థమవుతుందని ఆయన అన్నారు. స్పీకర్‌కు, పార్టీ కార్యకర్తకు తేడా లేకుండా పోతోందనే  విషయాన్ని కోర్టులే చెబుతున్నాయన్నారు. స్పీకర్ స్థానంలో కూర్చునే ముందువరకు పార్టీ కార్యకర్తే గానీ, కూర్చున్న తర్వాత కూడా ఆ పార్టీకి వంత పాడితే సమంజసం కాదన్నారు.  స్పీకర్ అయిన తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేయాలని కోటంరెడ్డి అభిప్రాయపడ్డారు. 

ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ...  సీనియర్ అయిన సీఎంగారికి, జూనియర్ సభ్యుడిగా ఒక విన్నపం చేస్తున్నా..మా పార్టీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీలోకి వచ్చారు. వాళ్లను ప్రలోభాలు పెట్టామని మేమంటున్నాం, కాదు అభివృద్ధి కోసమేనని మీరంటున్నారు. స్పీకర్ మీద అవిశ్వాసం పెట్టాం.. అభివృద్ధి చూసి మీతో వచ్చిన ఆ ఎనిమిది మంది ఎక్కడున్నారు, వాళ్లతో మీరు స్పీకర్‌కు మద్దతుగా ఓటేయించే అవకాశం ఏమైనా ఉందా అని అడుగుతున్నా?  అంటూ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపారు.

సభానాయకుడు పెద్దన్న, ప్రతిపక్ష నేత చిన్నన్న పాత్రలో ఉంటారు. ఈ సభ చక్కటి నియమ నిబంధనలను ఏర్పాటు చేసుకుని ఉండాలి. ఎన్ని విభేదాలున్నా ఈ సభలో అడుగుపెట్టిన తర్వాత సభ ప్రజా గుండె చప్పుళ్లకు ప్రతిరూపంగా ఉండాలి. మనం ఏర్పాటుచేసుకున్న నియమావళిని తుచ తప్పకుండా పాటించాలి. కానీ స్పీకర్ శాసనసభాసాక్షిగా,  ఆయన కూర్చున్న చోట ఉన్న సత్యమేవ జయతే సాక్షిగా నియమనిబంధనలను పాతరేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు అంతా చూస్తున్నారని చెప్పారు.  కోటంరెడ్డి మాట్లాడుతున్న ప్రతిసారి మంత్రులు అడ్డు తగలడంపై చురక అంటించారు. అప్పుడే లేచారా అంటూ యనమలపై అసహనం వ్యక్తం చేశారు. తాము  ఏం మాట్లాడాలో కూడా వాళ్లే డిక్లేర్ చేస్తే.... మేము ఎందుకని ప్రసంగ పాఠాలు రాసివ్వండి చదివేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక లైబ్రరీలో పుస్తకాలు చదివినప్పుడు ఆనాటి సభలో తరిమెల నాగిరెడ్డి తన పదవికి రాజీనామా చేస్తూ ఒక మాట అంటారు. సమావేశాలు బాతాఖానీ కబుర్లుగా మారిపోతున్నాయి. సభలు దారి తప్పినప్పుడు ప్రజాస్వామ్యానికే మచ్చ అవుతుందని, సభకు రాజీనామా చేసి, మళ్లీ సభలో అడుగుపెట్టనని వెళ్లిపోయారు. 
అధ్యక్షా రెండేళ్లుగా సభలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న దారుణాలు చూస్తుంటే.... అసలు నేను ఈ సభలో ఎందుకు ఉండాలి.  ఈ సభ ప్రజల గుండె చప్పుళ్లకు అనుగుణంగా ఉంటోందా అనే ఆందోళన వస్తోంది. . ప్రజాసమస్యలపై చర్చలు సాగుతున్నాయా అన్న అనుమానం కలుగుతోందని వాపోయారు. 

కోట్లాది మంది ప్రజలు చూస్తున్నారు. మేం స్పష్టంగా చెబుతున్నాం.  మన మధ్య వాదనలు వద్దు. ప్రత్యక్ష ప్రసారాల్ని చూపించేవాళ్లు ఎడిట్ చేస్తున్నారు. పార్లమెంటరీ బాష వదిలేసి బూతులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో తెలియాలంటే ప్రతి సంఘటన ప్రత్యక్షప్రసారం చేయాలి. ఎవరు తప్పు చేస్తే వారికి ప్రజలే శిక్ష వేస్తారని కోటంరెడ్డి అన్నారు. మా బాధంతా ఒక్కటే. స్పీకర్ తండ్రి స్థానంలో ఉన్నారు. పెద్దన్న స్థానంలో ఉన్న సభా నాయకుడు అన్నిరకాలుగా నియమాలను బుల్డోజ్ చేస్తున్నారు, స్పీకర్‌ను కూడా ప్రభావితం చేస్తున్నారు. ఇటీవల మా సభ్యురాలు రోజాను ఏడాది పాటు నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేేశారు.

 బాధ్యత గల ముఖ్యమంత్రి స్థానంలో ఉండి .. పిచ్చపిచ్చగా ఉందా, మీ కథ తేలుస్తా, మీ సంగతి తేలుస్తానని ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు నిజమా కాదా?. నిన్నటి రోజున వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను ఏకపక్షంతో వ్యవహరించిన మాట వాస్తవమా కాదా?. చంపేసి సమాధి కట్టేస్తానని ఓ సభ్యుడు రికార్డుల పూర్వకంగా మాట్లాడితే వాళ్లమీద చర్యలు లేవు. స్పీకర్ కు వాళ్లమీద చర్యలు తీసుకోవాలన్న ఆలోచన కూడా రావట్లేదు. వైఎస్ఆర్‌సీపీ సభ్యుల మీద మాత్రం ఎంతమందిని సస్పెండ్ చేయాలన్న ఆలోచన చేస్తున్నారని దుయ్యబట్టారు . నేను అన్నమాట ఒక్కటి తప్పయినా ఈ క్షణమే పదవికి రాజీనామా చేస్తాను, మళ్లీ జీవితంలో సభలోకి అడుగుపెట్టను అంటూ ఉద్విఘ్నంగా ప్రసంగించారు.


తాజా వీడియోలు

Back to Top