రాజ్యసభ ఎన్నికలోనూ వెల్లడైన కుమ్మక్కు

హైదరాబాద్ :

నాలుగున్నర సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు రాజ్యసభ ఎన్నికల్లోనూ అదే కుట్ర కొనసాగించారని వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. స్వయంగా తనకు సంఖ్యాబలం లేకపోయినా కాంగ్రెస్ ‌అధిష్ష్ఠానం నిర్దేశకత్వంలోనే టీడీపీ ఇద్దరు అభ్యర్థులను నిలబెట్టిందని ఆయన ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం‌ నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులుతో కలసి శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడారు.

రాజ్యసభ ఎన్నికల కోసం పార్టీ ఎమ్మెల్యేలందర్నీ ఏకతాటిపైకి తెచ్చి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు విభజన విషయంలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఎందుకు చెబుతున్నారని గడికోట ప్రశ్నించారు. పదవి కోసం ఉమ్మడి విధానం, ప్రజల సమస్యలపై ద్వంద్వ వైఖరేమిటని నిలదీశారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత పెంచడానికి ప్రయత్నిస్తున్న శ్రీ వైయస్ జగ‌న్‌ను విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ‌ సొంతంగా రాజ్యసభ సభ్యుడిని గెలిపించుకునేందుకు తగినంత సంఖ్యాబలం లేకపోవడం వల్లే అభ్యర్థిని నిలబెట్టబోమని ముందే ప్రకటించామని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్‌లో పాల్గొనరని చెప్పామన్నారు. చంద్రబాబు మాత్రం వైయస్ఆర్‌సీపీపై బురదచల్లడమే పనిగా పెట్టుకున్నారని నిప్పులు చెరిగారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజ్యసభ ఎన్నికలు నిర్వహిస్తే మూడు సీట్లు రావని కాంగ్రెస్, రెండు సీట్లు కూడా తనకు దక్కవని టీడీపీలు ఉమ్మడి అభిప్రాయానికి వచ్చి ఎన్నికలు ముందు జరిపేలా ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తీసుకొచ్చాయన్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై వారి డెరైక్షన్‌లోనే పనిచేస్తూ విభజన విషయంలో ఆ పార్టీ మాదిరిగానే రెండు విధానాలు వినిపిస్తున్నారన్నారు.

కేంద్రంలో అఖిలపక్ష సమావేశానికి వైయస్ఆర్‌సీపీని స్పీకర్ మీరాకుమా‌ర్ తొలిసారి ఆహ్వానించా‌రన్నారు. కానీ రేపు ఉదయం సమావేశమనగా, సాయంత్రం లేఖ పంపారన్నారు. వెళ్లడానికి తగిన సమయం లేకే వారికి లేఖ పంపించామన్నారు. అఖిలపక్ష సమావేశం విషయంలో తమను తప్పుబడుతున్న చంద్రబాబు అసెంబ్లీలోనే ఉండి బీఏసీ సమావేశాలకు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో కూర్చుని కూడా రెండు ప్రాంతాల నేతల చేత డ్రామాలు ఆడించిన వ్యక్తి, నీతి, నిజాయితీల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్ పార్టీకి హో‌ల్‌సేల్‌గా అమ్మేస్తే, చంద్రబాబు నాయుడు టీడీపీని రిటైల్‌గా అమ్ముకుంటున్నారని గడికోట ఆరోపించారు. నాలుగున్నర సంవత్సరాలుగా ప్రతీ అంశంలోనూ కాంగ్రెస్‌తో చంద్రబాబు మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకుంటున్నా‌రని ఆయన విమర్శించారు.

Back to Top