మైనార్టీలంతా వైయ‌స్ఆర్ సీపీవైపే

చిత్తూరుః ముస్లిం మైనార్టీలంతా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీవైపే ఉన్నార‌ని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. మ‌ద‌న‌ప‌ల్లెలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాలు మైనార్టీలు ఇప్ప‌టికీ మ‌ర్చిపోలేద‌న్నారు. టీడీపీ వైపుకు మైనార్టీలు ఆక‌ర్షితుల‌వుతున్నార‌న్న మాటలు అవాస్త‌వ‌మ‌న్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు, ప్రలోభాలు పెట్టినా ఎప్పటికీ మైనార్టీలు త‌లొగ్గ‌ర‌న్నారు. చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీల జోక్యంతో వైయ‌స్ఆర్ సీపీ కార్యకర్తలు ఎలాంటి పథకాలకు నోచుకోకుండా, అన్యాయ మైపోయారన్నారు. కార్యకర్తలందరికీ అండగా ఉంటామని, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌ను ముఖ్యమంత్రిని చేయాల‌నే ధ్యేయంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి బూత్ కమిటీలు కీలకమన్నారు. బూత్‌ కమిటీ సభ్యులు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను వైయ‌స్ఆర్ కుటుంబంలో భాగస్వాముల‌ను చేసి, నవరత్నాలు ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల‌న్నారు.

Back to Top