మీ తర్వాతే మా వైఖరి వెల్లడి

హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. రెండుసార్లు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి కేంద్రం తీసుకున్న చర్యలేమిటని ఆయన ప్రశ్నించారు.  ఇప్పటిదాకా కాంగ్రెస్ సాధించిన పురోగతి ఏంటన్నారు. ఇచ్చే శక్తీ, తెచ్చే శక్తీ ఉందని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు పార్టీ వైఖరిపై ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. హోంమంత్రి మారారంటూ ఒకసారీ, కొత్తపార్టీ వచ్చిందని మరోసారీ అఖిలపక్షం పేరుతో నాటకాలాడటం కాంగ్రెస్‌కు రివాజుగా మారిందన్నారు. తెలంగాణ ఇవ్వాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు ఉంటే పదేపదే అఖిలపక్ష సమావేశాలను ఎందుకు ఏర్పాటు చేస్తోందని ప్రశ్నించారు. తెలంగాణ పట్ల కాంగ్రెస్‌ను నిలదీయాల్సిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆ పని చేయకపోగా అదే పార్టీతో దోబూచులాడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణపై కాంగ్రెస్ వైఖరి చెప్పిన తర్వాత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తన వైఖరిని వెల్లడిస్తుందని గోవర్ధన్ స్పష్టం చేశారు.

Back to Top