జనం పక్షాన జగనన్న పోరాడతాడు: షర్మిల

షర్మిల శనివారం పాదయాత్ర ముగిసేటప్పటికి: రోజులు: 52, కిలోమీటర్లు: 739.80

మహబూబ్‌నగర్, 9 డిసెంబర్‌ 2012: కాంగ్రెస్ పాలనలో ప్రజలను రాబందుల్లా పీక్కుతింటున్నారని, ప్రజల శ్రమను దోచుకుంటున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సమయం వచ్చినపుడు ఈ దోపిడీ దొంగలకు తగిన బుద్ధి చెప్పాలని, జగనన్నను ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నాయకుడనే వాడిని ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి లాంటి మనుసు ఉండాలని శ్రీమతి షర్మిల ఉద్ఘాటించారు. అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ఏకకాలంలో అమలుచేసే నాయకత్వ లక్షణం నాయకుడికి ఉండాలన్నారు. 'ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ చేతులు ముడుచుకొని కూర్చో‌దన్నారు. జగనన్న ప్రజల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాడు' అని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు.

ప్రజా సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం, దానితో కుమ్మ‌క్కు డ్రామాలాడుతున్న చంద్రబాబునాయుడు వైఖరికి నిరసనగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి తరఫున శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 52వ రోజు శనివారం మహబూబ్‌నగర్ జిల్లా షా‌ద్‌నగర్ నియోజకవర్గంలో కొనసాగింది. అల్వాల్, ఎక్లాస్‌ఖాన్‌పేట, సంగెం, కొంగగూడెంలలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో శ్రీమతి షర్మిల స్థానిక మహిళలతో మాట్లాడారు. వారి సాధకబాధకాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల స్థానిక రైతులు, మహిళలు ఇతర వర్గాలవారి సమస్యలను శ్రద్ధగా ఆలకించారు. వారి బాధలు విన్న అనంతరం ఆమె స్పందిస్తూ, ‘రైతన్నకు ప్రాణం, చేనూ రెండూ ముఖ్యమే. తొందరపాటుతో ఏ ఒక్కదాన్ని కూడా పొగొట్టుకోవద్దని కోరుతున్నా.. ఒక్క ఏడాది పాటు ఓపిక పట్టండి.. త్వరలోనే జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. మీ అప్పుల విషయం ఆయన చూసుకుంటారు. రైతున్న రాజులా చేస్తారు. రాజన్న రాజ్యంలో ప్రజలు కోరుకున్న విధంగా పాలన ఉంటుంది’ అని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు.

‘రూపాయికి కిలో బియ్యం అన్నారు. 20 కేజీలు ఇచ్చే బియ్యాన్ని 15 కేజీలకు కోత పెట్టారు. ఐదు కేజీల బియ్యం ఇక్కన్నే పాయె! ఈ రోజు కేజీ బియ్యం రూ.20పైనే ఉంది. రేషన్‌లో కోతపెట్టిన 5 కేజీల బియ్యం తెచ్చుకోవాలంటే రూ.100 పెట్టాల్సిందే. సర్కారోళ్లు మొత్తం కలిపి రూ.15 తగ్గించి మా నెత్తిన రూ.100 బరువు పెట్టారు’ అని అల్వాల్‌కు చెందిన దుర్గమ్మ, సాయమ్మ అనే మహిళలు గోడు వెళ్లబోసుకున్నారు. ఉప్పు, పప్పు, చింతపండు, కారం పసుపు.. ఇలా అన్నింటి ధరలు పెంచేశారని, ఉపాధి పనికి పోయి పొద్దంతా కష్టం చేస్తే రూ 30, రూ 40 కూలీ పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు షర్మిల స్పందిస్తూ.. ‘ఇప్పుడిస్తున్న బియ్యంలో కూడా కోత పెడతారేమో అని కొందరు.. మొత్తం రేషన్ బియ్య‌ం పథకాన్నే ఎత్తేస్తారేమోనని మరికొందరు అక్కాచెల్లెమ్మలు భయపడుతున్నారు. నేను గ్రామాల వెంట వస్తున్నప్పుడు చాలా మంది నాతో ఈ విషయం చెబుతున్నారు. అయితే, అక్కా..! అలాంటిది ఏదీ జరగదు. ఒకవేళ మీరు భయపడినట్లు మీకు అన్యాయం జరిగితే జగనన్న మీ తరఫున పోరాటం చేస్తాడు అన్నారు.

ప్రస్తుత సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్రజల సమస్యలు పట్టడం లేదని శ్రీమతి షర్మిల చెబుతుండగా.. సంగెం గ్రామానికి చెందిన సువర్ణ అనే మహిళ కలుగజేకుంటూ సీఎంపై మండిపడ్డారు. ‘వైయస్ తెచ్చిపెట్టిన కుర్సీల కాలు మీద కాలేస్కొని కిర‌ణ్‌కుమార్ గూసుండు. ఆయనేమన్నా కష్టపడి కుర్సీ తెచ్చుకున్నడా? జనం నడిమిట్ల తిరిగి కుర్సీ మీదికొచ్చినోళ్లకు మా బాధలు‌ ఎట్ల తెలుస్తయి. జనం సత్తే ఆయినకేంది.. బతికితే ఆయినకేంది? కుర్సీల గూచోని జనం బాధలు సూడమంటే టీవీలు జూత్తరు. ఆయనకెంత మందొచ్చిండ్రు.. ఈనకెంత మందొచ్చిండ్రు అని టీవీలల్ల జూసుడు తప్ప మాకేం జేత్తలే!’ అని నిప్పులు చెరిగారు.

చంద్రబాబు పాదయాత్ర ఓ నాటకం, బూటకం:
‘చంద్రబాబు చేస్తున్నది నాటకాల పాదయాత్ర. అదొక బూటకం. ఆయనకు తగినంత మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఆయనకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ అసమర్థ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలి. కానీ పెట్టరు. రైతులు కష్టాల కడలిలో ఉంటే చంద్రబాబు సాగునీటికి తొమ్మిదేళ్ళలో కనీసం రూ.10 వేల కోట్లయినా ఖర్చు చేయలేదు. అదే రైతు పక్షపాతి రాజన్న ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు నీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టారు.‌ మహానేత వైయస్‌ఆర్ బతికి ఉంటే ఇప్పటికే పాలమూరు జిల్లా సస్యశ్యామలం అయ్యేది’ అని శ్రీమతి షర్మిల అన్నారు. 'వ్యవసాయం దండగ అని చంద్రబాబు తన మనసులో మాట పుస్తకంలో రాసుకున్నారు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వొద్దని, ఇస్తే సోమరిపోతులవుతారని రాసుకున్నారు. ప్రాజెక్టులు కడితే నష్టమని రాసుకున్నారు. ఇప్పుడు పాదయాత్రల పేరుతో గ్రామాల్లో తిరుగుతూ మహానేత వైయస్‌ఆర్ చేసిన పథకాలన్నీ తాను కూడా చేస్తానని అబద్ధపు హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు గారూ.. క‌రవుకోరల్లో కరెంటు బిల్లులు కట్టలేకపోతే రైతులపై కేసులు పెట్టి అరెస్టులు చేసి జైల్లో పెట్టింది మీరు కాదా? వారింట్లో సామాన్లు లాగేసుకుంది మీరు కాదా? ఆ అవమానాలు భరించలేక మీ హయాంలో నాలుగు వేల మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్న విషయం నిజం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతోంది మీరు కాదా? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుమ్మక్కవడం నిజం కాదా?’ అని‌ శ్రీమతి షర్మిల నిలదీశారు.

శనివారంనాడు శ్రీమతి షర్మిల 15.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఇప్పటివరకూ మొత్తం 739.80 కిలోమీటర్లు నడిచారు.
Back to Top