జలయజ్ఞ రూపకర్తనే విస్మరిస్తారా?

అనంతపురం :

జలయజ్ఞం రూపకర్తఅయిన మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డినే హంద్రీ-నీవా ప్రారంభ సభలో విస్మరించారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పరితపించారనీ,  అందులో భాగమే ఆయన చేపట్టిన జలయజ్ఞమనీ వారు వివరించారు.   'కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని కలలు కన్నారు. రూ.4,800 కోట్లు కేటాయించి హంద్రీ-నీవాకు శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత 10 శాతం పనులు పూర్తి చేసేందుకు ఇన్నేళ్లు పట్టింది. ఇంతటి బృహత్తర పథకాన్ని చేపట్టిన వైయస్ పేరును ఆదివారం కర్నూలు జిల్లా మల్యాలలో జరిగిన పథకం మొదటిదశ ప్రారంభోత్సవంలో పాలకులు ఉచ్చరించకపోవడం బాధాకరమ’ని అన్నారు. ఈ మేరకు ఆదివారం వారు స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల నీచ రాజకీయాలకు పరాకాష్ట ఈ ఘటన అని ధ్వజమెత్తారు. వైఎస్‌ను నాయకులు మరచినా...రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ మరవరని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో మహానేత వైఎస్ రాష్ట్ర బడ్జెట్‌లో సగం నిధులు ఇరిగేషన్ ప్రాజెక్టులకే కేటాయించారన్నారు. ఎన్టీఆర్ ఆలోచనలతో హంద్రీ-నీవా పథకానికి బీజం పడినా... అయితే ఆచరణ సాధ్యం కాదని అప్పట్లో అధికారులు తేల్చి చెప్పారన్నారు. ఆ తర్వాత చంద్రబాబు పునాదిరాళ్లు మాత్రమే వేసి ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. ఈ పథకాన్ని ఆచరణలోకి తెచ్చిన ఘనత వైయస్ఆర్‌కే దక్కుతుందన్నారు.

     పార్టీ జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ శంకరనారాయణ మాట్లాడుతూ వైయస్‌ను ప్రజల నుంచి దూరం చేయడానికి కాంగ్రెస్ కుయుక్తులు పన్నుతోందని విమర్శించారు.  ఆ నీటితో ప్రతి గ్రామంలోనూ వైఎస్ విగ్రహాలకు అభిషేకం చేయాలని రైతులు, ప్రజలకు పిలుపునిచ్చారు.  ఈ రకంగానైనా ఆయన రుణం కాస్త తీర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. పార్టీ సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత మాట్లాడుతూ ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా కాంగ్రెస్ నేతల తీరు ఉందన్నారు. హంద్రీ-నీవా రూపకర్త వైఎస్ అయితే... పేరు చెప్పుకోవాలని చూస్తోంది కాంగ్రెస్ నేతలని దుయ్యబట్టారు. ఇందుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జిల్లా నేత తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ కలలు సాకారమైన రోజున అధికార పార్టీ నాయకులు వ్యవహరించిన తీరు అత్యంత బాధాకరమన్నారు. పథకం ప్రారంభ సభలో టీడీపీ, కోట్ల విజయభాస్కర్‌రెడ్డిని గుర్తు చేసుకున్న కాంగ్రెస్ నేతలు వైఎస్ పేరు మాత్రం ప్రస్తావించకపోవడాన్ని ప్రజలు క్షమించరన్నారు. రాప్తాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ నాడు వైఎస్‌ను అపర భగీరథుడని పొగిడిన నోర్లు ఈ రోజు ఎందుకు మూగబోయాయని నిలదీశారు. గాలేరు- నగరి, హంద్రీనీవా పథకాల అమలుకు కృషి చేసింది మహానేతేనన్నారు. ఆయన హయాంలోనే నగరి పూర్తయిందన్నారు. హంద్రీ-నీవా పనులు 90 శాతం పూర్తయ్యాయన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పెండింగ్‌లో ఉన్న సాగు, తాగునీరు ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని చెప్పారు.

Back to Top