జగన్ పిల్లల హక్కులను కాపాడండి

హైదరాబాద్, ‌8 అక్టోబర్‌ 2012: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు,‌ కడప లోక్‌సభ సభ్యుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి పిల్లల హక్కులను కాపాడాలని భారత జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎ‌న్‌సీపీసీఆర్)ను ఆంధ్రప్రదే‌శ్ బాలల హక్కుల సంఘం కోరింది. బాలల హక్కుల చట్టం కింద జగ‌న్ పిల్లలు హర్ష, వర్షలకు కలిగిన స్వేచ్ఛను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ హరిస్తున్నాయని సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు కమిష‌న్ దృష్టికి తీసుకెళ్లారు. పిల్లల హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ‌అచ్యుతరావు ఆదివారంనాడు కమిషన్ చై‌ర్‌పర్సన్ శాంతసిన్హాకు మెయి‌ల్ ద్వారా‌ ఓ పిటిషన్‌ పంపించారు.

ఈ పిటిషన్‌ను స్వీకరించినట్లు కమిషన్ కార్యాలయవర్గాలు వెల్లడించాయి. పిల్లలు వారి ప్రకృతి సిద్ధమైన, పరిరక్షకులైన తల్లిదండ్రుల నుండి దూరంగా ఉండే పరిస్థితులు కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, దర్యాప్తు సంస్థలకు హక్కు లేదని చట్టాలు స్పష్టం చేస్తున్నాయని ఆ పిటిష‌న్‌లో అచ్యుతరావు తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top