జగన్‌కొక న్యాయం... ధర్మానకో న్యాయమా?

- ప్రతిపక్షంలో ఉన్న జగన్ కేసునెలా ప్రభావితం చేస్తారు?
- పదవుల్లో ఉన్న మంత్రి, ఐఏఎ‌స్‌లు ప్రభావితం చేయరా?
- ఏమిటీ సీబీఐ పక్షపాతం? 

హైదరాబాద్, 26 సెప్టెంబర్‌ 2012: వివాదాస్పద 26 ప్రభుత్వ జిఓల విషయంలో సీబీఐ ద్వంద్వ విధానాలు అవలంబిస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తప్పు పట్టింది. నిర్ధారణ కాని అవే ఆరోపణలు, అవే చార్జిషీట్లు ఎదుర్కొంటున్న మంత్రి ధర్మాన ప్రసాదరావును, ప్రభుత్వ కార్యదర్శులను ఒక విధంగా, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్‌ తదితరుల విషయంలో మరో విధంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది. సీబీఐ పక్షపాత వైఖరి ప్రదర్శించిందని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు‌కు ముందస్తు బెయిల్‌ వచ్చిన ఉదంతంతో సీబీఐ కుట్ర బహిర్గతమైందన్నారు.

కీలక పదవుల్లో ఉన్న మంత్రి, ఐఏఎస్‌లకన్నా ఏ అధికార హోదా లేకుండా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్‌రెడ్డి ఏవిధంగా కేసును ప్రభావితం చేస్తారని సీబీఐ భావిస్తున్నదో ప్రజలకు చెప్పాలని పద్మ నిలదీశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

‘వైయస్ అధికారంలో ఉండగా కొన్ని ఒప్పందాలు చట్ట వ్యతిరేకంగా జరిగాయని, వాటి కారణంగా జగ‌న్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. సీబీఐ తన ఎ‌ఫ్ఐఆ‌ర్‌లో 26 జీవోలలో క్విడ్ ప్రో కో జరిగిందని ఆరోపిస్తూనే ఎక్కడా అందుకు కారకులైన మంత్రులు, సెక్రటరీలను పేర్కొనలేదు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో గత్యంతరం‌ లేక చార్జీషీట్లలో ఒకరిద్దరు మంత్రులు, కొందరు కార్యదర్శులను చేర్చింది. సీబీఐ దాఖలు చేసిన నాలుగవ చార్జిషీట్‌లో నలుగురికి తప్ప మిగతా 24 మందికి బెయిల్ లభించింది. హైకోర్టు, సుప్రీంకోర్టులో జగ‌న్మోహన్‌రెడ్డి బెయిల్ పిటిష‌న్ విచారణ‌కు వచ్చిన ప్రతీసారి సాక్షుల్ని ప్రభావితం చేస్తారంటూ సీబీఐ అడ్డుపడుతోంది. ఎనిమిది సంవత్సరాలు మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి, 25 ఏళ్లుగా సర్వీస్‌లో ఉన్న ప్రభుత్వం కార్యదర్శులు ఎలాంటి ప్రభావితం చేయరా? ఏనాడూ సచివాలయంలో అడుగైనా పెట్టని , ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఎలా ప్రభావితం చేస్తారు? అది కూడా ఎ‌ఫ్ఐఆ‌ర్ దాఖలు చేసిన 280 రోజులకు అరెస్టు చేసి‌న సీబీఐ ఇలాంటి అన్యాయమైన వాదన చేస్తోంది. సీబీఐ పక్షపాత వైఖరికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ’ అని వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. 

కేంద్రంలో జరిగిన ఏ కుంభకోణంతోనూ ప్రధానికి సంబంధంలేదని చెబుతూ.. మరో పక్కన రాష్ట్రంలో జారీ అయిన జీవోలకు దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డిని బాధ్యుణ్ని చేయడం అన్యాయమని పద్మ విమర్శించారు. ‌మరణించిన వ్యక్తిని కూడా బాధ్యుడ్ని చేస్తూ సీబీఐ ఎఫ్ఐఆ‌ర్‌లో పేరు పెట్టిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ కుమ్మక్కై రాష్ట్రంలో మూడో ‌పార్టీ లేకుండా చేయాలనే కుట్రలు చేస్తున్నాయన్నారు. వీరి నాటకాన్ని గమనిస్తున్న ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు.

జగన్మోహన్‌రెడ్డిని అరెస్టు చేయడం కోసమే ఆనాటి మంత్రి మోపిదేవి వెంకట రమణను, నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్టు చేసి, వారిని బలి పశువులుగా చేశారని పద్మ ఆరోపించారు. మిగిలిన మంత్రుల జోలికి సీబీఐ ఎందుకు వెళ్ళలేదని వెళ్లలేదని ఆమె నిలదీశారు.
Back to Top