జగన్ వస్తే.. వైయస్ పథకాలన్నింటికీ ప్రాణం

రాజమండ్రి (తూ.గో.జిల్లా) :

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, జననేత జగనన్న ముఖ్యమంత్రి అయితే.. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నింటికీ ప్రాణం పోస్తారని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. అందుకు అవకాశం వచ్చినప్పుడు ప్రజలంతా జగనన్నను ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మరో ప్రజాప్రస్థానం 170వ రోజు బుధవారంనాడు శ్రీమతి షర్మిల రాజమండ్రిలో పాదయాత్ర చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పేదలకు అందాల్సిన ఆరోగ్యం గురించి మహానేత డాక్టర్‌ వైయస్‌ఆర్ ఆలోచన చేశారు. అనారోగ్యం పాలైనపుడు‌ తాను కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఎలా వైద్యం చేయించుకుంటారో.. అలాగే ప్రతి పేదవాడూ ధైర్యంగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి తన మంచం పక్కనే మంచం వేసుకొని తలెత్తుకొని వైద్యం చేయించుకోవాలనే గొప్ప సంకల్పంతో ఆరోగ్యశ్రీ పథకానికి‌ వై‌యస్‌ఆర్ ప్రాణం పోశారు. కానీ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ప్రాణం తీసి పాడెక్కించింది. ఆ పథకం నుంచి 135 వ్యాధులను తొలగించింది’ అని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి విమర్శించారు. ‘అవకాశం వచ్చినప్పుడు జగనన్నను ఆశీర్వదించండి, ఒక్క ఆరోగ్యశ్రీ పథకానికే కాదు, 108, 104 పథకాలు ఇలా రాజన్న అమలు చేసి చూపించిన ప్రతి పథకానికీ జగనన్న మళ్లీ జీవం పోస్తారు’ అని ప్రజలకు భరోసా ఇచ్చారు.

ప్ర‌జల సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దాని‌కి రక్షణగా నిలుస్తున్న చంద్రబాబు నాయుడు తీరుకు నిరసనగా శ్రీమతి షర్మిల చేస్తున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కొనసాగింది. ‘అమ్మా.. నా భర్తకు కాళ్లు, చేతులకు వాపు వచ్చిందని ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని ఆసుపత్రికి పోతే కార్డు చెల్లదని, డబ్బు కట్టాలని చెప్పారమ్మా’ అని సానిటోరియం సెంటర్‌కు చెందిన రామానుజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీమతి షర్మిల నడుస్తున్న దారివెంట ఎయిడ్సు బాధితులు, జాలర్లు, చేనేత కార్మికులు, వృద్ధులు, వికలాంగులు పలుచోట్ల కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. వాళ్ల ఆవేదనను శ్రద్ధగా విన్న శ్రీమతి షర్మిల ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ, వాళ్లకు ధైర్యం చెప్తూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగానే పై వ్యాఖ్యలు చేశారు.

జగనన్నను ఆశీర్వదించండి :
‘కాంగ్రెస్, ‌టిడిపిలు కుట్రలు పన్ని, కుతంత్రాలు చేసి, సిబిఐని వాడుకొని, అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను జైలుపాలు చేశాయి. అన్యాయంగా ఏడాది కాలంగా ఆయనను నాలుగు గోడల మధ్య బంధించాయి. కానీ త్వరలోనే జగనన్న బయటికి వస్తారు.. రాజన్న రాజ్యం నిర్మించే దిశగా మనందరినీ నడిపిస్తారు. రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన విద్యార్థుల కోసం మళ్లీ ఫీజు రీయింబర్సుమెంటు, పేదల కోసం ఆరోగ్యశ్రీ నిలబెడతారు. వృద్ధులకు, వితంతువులకు పింఛను రూ. 700 అవుతుంది. వికలాంగులకైతే రూ. 1000 అవుతుంద'న్నారు.

'తమ పిల్లలను చదివించేలా అక్కాచెల్లెళ్లను ప్రోత్సహించడం కోసం ‘వైయస్‌ఆర్ అమ్మ ఒడి’ పథకం ప్రవేశపెడతారు. కుటుంబంలో ఇద్దరు పిల్లలకు ప‌దవ తరగతి వరకు ఒక్కొక్కరికీ రూ.500 చొప్పున ఇస్తారు. అంటే ఏడాదికి రూ. 6 వేలు అమ్మ అకౌంట్లోనే పడుతుంది. ఇంటర్మీడియెట్ చదివితే ఏడాదికి రూ. 8,400, డిగ్రీ చదివితే రూ. 12,000 అమ్మ అకౌంట్లోనే పడతాయి. అంతకంటే పెద్ద చదువులు చదివే వారికి ఫీజు రీయింబ‌ర్సుమెంటు పథకం ఎలాగూ ఉండనే ఉంది. రాష్ట్రంలో గుడిసె అనేదే లేకుండా ప్రతి నిరుపేదకూ పక్కా ఇల్లు కట్టిస్తారు. పేదవాళ్లు ఎప్పటిలాగే ధీమాగా పెద్దాసుపత్రికి వెళ్లి ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకునే రోజులు మళ్లీ వస్తాయి. వైయస్‌ఆర్ హామీ ఇచ్చినట్టు ప్రతి పేద కుటుంబానికీ నెలకు 30 కిలోల బియ్యం ఇస్తారు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, మాతో కలిసి కదం తొక్కాలని మా ప్రార్థన’‌ అని శ్రీమతి షర్మిల విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికి 2,250.1 కిలోమీటర్ల పాదయాత్ర :
పాదయాత్ర 170వ రోజు బుధవారం శ్రీమతి షర్మిల రాజమండ్రిలోని సెయింట్‌ పా‌ల్ చర్చి ప్రాంగణం నుంచి యాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి ఆజాద్ చౌ‌క్, నందంగరిరాజు సెంట‌ర్, కంబాల చెరువు, సానిటోరియం సెంట‌ర్, కొంతమూరు, కోలమూరు మీదుగా పాదయాత్ర చేశారు. మధురపూడి శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.45 గంటలకు చేరుకున్నారు. బుధవారం మొత్తం 14.3 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,250.1 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది.

Back to Top