ఇదో రాజకీయా(నా)టకం

కర్నూలు: చంద్రబాబుపై సీబీఐ విచారణ జరుగుతుందన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు కుమ్మక్కులో భాగమేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ధ్వజమెత్తారు. కర్నూలులో ఆమె బుధవారం కళానికేతన్ షోరూమ్‌ను ప్రారంభించారు. అనంతరం శోభానాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై సీబీఐతో విచారణ చేయించేంత సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. కోర్టులో ఉన్న అంశంపై కిరణ్ కుమార్ రెడ్డి ఎలా మాట్లాడతారని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. త్వరలో కోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ ప్రారంభిస్తుందనడం ఎంతవరకూ సమంజసమన్నారు. దీనిని బట్టి కోర్టులు కూడా ఆయన చెప్పిన మేరకు వ్యవహరిస్తున్నాయన్న అభిప్రాయాన్ని కలిగిస్తోందన్నారు.  ఇది సీఎం ఆడుతున్న రాజకీయ నాటకమని శోభ అభిప్రాయపడ్డారు. వైయస్ జగన్‌పై కూడా వీళ్ళే చెప్పి పెట్టించారనుకోవాల్సి ఉంటుందన్నారు. కొద్ది రోజుల్లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావటం ఖాయమన్నారు. బాబు ఓ పక్క పాదయాత్ర చేస్తుండగా మరోపక్కనుంచి కార్యకర్తలు పార్టీని వదిలి వెళ్లిపోతున్నారని అవహేళన చేశారు. పార్టీ నేతలకే నమ్మకం కలిగించని చంద్రబాబు ప్రజలకు ఎలా నమ్మకం కలిగిస్తారని ఆమె ప్రశ్నించారు.  

Back to Top