ప్రజాసమస్యలు పట్టనందుకే కాంగ్రెస్‌కు చావుదెబ్బ

హైదరాబాద్ :

ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కేవలం కుట్రదారులను నమ్ముకోవడం వల్లే కాంగ్రెస్‌ పార్టీకి నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో చావుదెబ్బ తగిలిందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విశ్లేషించారు. సీబీఐ, చంద్రబాబు నాయుడు లాంటి కుట్రదారులపై ఆధారపడి ఎన్నికలకు వెళితే ఫలితాలు ఇలాగే ఉంటాయని గట్టు వ్యాఖ్యానించారు. సీబీఐ, చంద్రబాబు లాంటి కుట్రదారుల మీద ఆధారపడి పనిచేసిన కాంగ్రె‌‌స్ పార్టీకి దేశంలో ఇక నూకలు చెల్లాయన్నారు. అనునిత్యం ప్రజాసమస్యలపై పోరాటం చేయడం వల్లే ఢిల్లీలో రెండు జాతీయ పార్టీలను కాదని ప్రాంతీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ‌ (ఆప్)కి ప్రజలు మద్దతు తెలిపారన్నారు. మన రాష్ట్రంలో కూడా నిత్యం ప్రజాసమస్యలపై పోరాటం చేసిన, చేస్తున్న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు పట్టం కట్టడం ఖాయమన్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా వస్తుండగా ఆదివారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో గట్టు మీడియాతో మాట్లాడారు.

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును చూస్తే సోనియాగాంధీ ఇటలీ పోవడం ఖాయమని గట్టు వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల తర్వాత దేశంలో కాంగ్రెస్, రాష్ట్రంలో చంద్రబాబు కనుమరుగవుతారని జోస్యం చెప్పారు. అధికార పార్టీకి బ్రాంచి ఆఫీసులుగా మారిన చంద్రబాబు లాంటి వ్యక్తులను ప్రజలు దూరం పెట్టనున్నట్లు ఇటీవల వెలువడిన సర్వేల్లో కూడా స్పష్టమైందని గుర్తుచేశారు.

చంద్రబాబుకు ఎంతసేపూ దివంగత ‌మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డిని ఆడిపోసుకోవడం తప్పితే, ఆయన తొమ్మిదేళ్ల చీకటిపాలనను ప్రస్తావించే ధైర్యం లేదన్నారు. ‌మరణించిన వైయస్ఆర్ పేరుతో పోరాడటానికి చంద్రబాబుకు జీవితకాలం సరిపోయేట్లు‌ లేదన్నారు. అవినీతికి బాబు చిరునామాగా మారినందువల్లే ప్రజలు లాగి కొడితే ఇప్పటికీ కోలుకోవడంలేదన్నారు. 2009 తర్వాత కూడా జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో ఏ ఒక్కటీ గెలుచుకోకపోగా, డిపాజిట్లు కోల్పోయిన విషయం గుర్తుంచుకోవాలని గట్టు రామచంద్రరావు ఎద్దేవా చేశారు.

Back to Top