దమ్మున్న నాయకుడు జగన్‌ : దాడి

విశాఖపట్నం, 11 మే 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి దమ్మున్న నాయకుడని మాజీ మంత్రి పార్టీ నాయకుడు దాడి వీరభద్రరావు అభివర్ణించారు. శ్రీ జగన్‌ను సిఎంను చేయాలన్న వన్ పాయింట్ ఫార్ములాను అందరూ అనుసరించాలని వీరభద్రరావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో‌ శ్రీ జగన్‌ను అధికారంలోకి తీసుకురావటమే తమ లక్ష్యం అని దాని అన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరిన అనంతరం ఆయన తొలిసారి శనివారం‌నాడు సొంత జిల్లా విశాఖకు వచ్చారు.

ఈ సందర్భంగా దాడి వీరభద్రరావు మాట్లాడుతూ, మన సమాజం మార్పు కోరుకుంటోందని... వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీని అందలం ఎక్కించాలన్నది ప్రజల భావన ‌అని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలను‌ పెద్ద ఎత్తున ప్రవేశపెట్టింది వై‌యస్ రాజశేఖరరెడ్డి అని దాడి అన్నారు. అవినీతి ఆరోపణలు లేకుండా ఏ పార్టీ లేదని ... ప్రధానమంత్రే అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారని దాడి ప్రస్తావించారు.

చంద్రబాబు నాయుడిని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడతానని శ్రీ జగన్ చెప్పారని, ‌ఇలాంటి లక్షణం ఎంతో దమ్మున్న నాయకుడికి మాత్రమే ఉండే లక్షణమని దాడి వ్యాఖ్యానించారు. పదవి కోసం కాదని... గౌరవం కోసమే తాను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరానని దాడి వీరభద్రరావు తెలిపారు. కొణతాల రామకృష్ణతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాని ఆయన అన్నారు. తమ మధ్య విభేదాలున్నాయనేది మీడియా సృష్టేనని దాడి కొట్టిపారేశారు. కొణతాల బాధ్యత కలిగిన నాయకుడని, అందరం కలిసి వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.
Back to Top