రాజకీయ సంక్షోభంతోనే రాష్ట్ర విభజనకు తెర

హైదరాబాద్, 3 సెప్టెంబర్ 2013:

చంద్రబాబు నాయుడిది రెండు కళ్ళ సిద్ధాంతమే అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు దాడి వీరభద్రరావు మండిపడ్డారు. టిడిపి సభ్యులు పార్లమెంట్‌లో ఆడుతున్న నాటకానికి సూత్రధారి చంద్రబాబు నాయుడే అని ఆయన అన్నారు. లోక్‌సభలో సోమవారం టిడిపి సభ్యులు సృష్టించిన గందరగోళాన్ని ఈ సందర్బంగా దాడి గుర్తు చేశారు. ఈ సంఘటనతో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం మరోసారి బయటపడిందని వీరభద్రరావు విమర్శించారు. లోక్‌సభ, రాజ్యసభలో టిడిపి సభ్యులను రెండుగా విడగొట్టి చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని దాడి మండిపడ్డారు. సీమాంధ్ర కాంగ్రెస్ ‌నాయకులు పదవులకు రాజీనామా చేసి రాజకీయ సంక్షోభాన్ని సృష్టించాలని ఆయన సూచించారు. ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభం వస్తేనే గాని విభజన నిర్ణయం ఆగదని దాడి అభిప్రాయపడ్డారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల అభీష్టం మేరకే నడుచుకుంటుందని ఆయన అన్నారు.

Back to Top