విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ఘోరంగా దెబ్బతిన్నదని.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ ధ్వజమెత్తారు. దేశ స్థాయిలో నీట్ ఎంత పెద్ద సమస్యగా మారిందో, రాష్ట్రంలో డిఎస్సీ కూడా అంతే పెద్ద కుంభకోణంగా మారిందని మండిపడ్డారు. డియస్సీలో అక్రమాలకు పాల్పడ్డం ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకున్నారని ఆక్షేపించారు. ఈ కుంభకోణానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్సాక్ష్యాధారాలతో సహా బహిరంగంగా ఎత్తిచూపినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి జవాబుదారీతనం లేకపోవడం దారుణమన్నారు. విద్యాశాఖ మంత్రిగా పూర్తిగా వైఫల్యం చెందిన నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, ఈ స్కామ్పై సీబీఐ విచారణ జరిపించాలని కొండా రాజీవ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే.. - డిఎస్సీ భారీ కుంభకోణం.. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత తమ డిమాండ్ల కోసం పోరాడి సాధించుకుంటూ ప్రజాస్వామ్య కీర్తిని పెంచుతుంటే, ఏపీలో మాత్రం ప్రజాస్వామ్యం ఘోరంగా కూనీ అవుతోంది. ఈ రెండేళ్ల కాలంలో అనేక అక్రమాలు, స్కామ్లు జరిగినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైంది. రేయనక పగలనక కష్టపడి చదివిన అభ్యర్థుల ఉద్యోగాలను గెద్దల్లా తన్నుకుపోయి అమ్మేసుకున్నారు. చివరికి జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తికి కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రాలేదంటే ఏపీలో డిఎస్సీ ఎంత పెద్ద కుంభకోణమో అర్థమవుతోంది. - ప్రశ్నిస్తే అణచివేత, లాటీఛార్జీలు.. డిఎస్సీ అక్రమాలపై ఆధారాలతో నిలదీస్తే సమాధానం చెప్పకపోగా ఎదురుదాడి చేస్తున్నారు. సమస్యలపై నోరెత్తిన విద్యార్థులు, నిరుద్యోగులపై లాటీలు జులిపిస్తూ, బూటు కాళ్లతో తన్నుతూ అక్రమ కేసులు పెడుతున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ 'చలో సంసద్' తరహాలోనే ఏపీలో 'చలో అసెంబ్లీ' పిలుపు రాకముందే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పూర్తిగా వైఫల్యం చెందారు. కేంద్రంలో నీట్ పేపర్ లీకేజీపై స్పందించి చర్యలు తీసుకున్నప్పుడు, ఏపీలో డిఎస్సీ కుంభకోణంపై ఎందుకు చర్యలు తీసుకోరు? తక్షణమే డిఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలి. - ప్రచార ఆర్భాటం – పెట్టుబడులపై అసలు నిజాలు.. రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పచ్చ మీడియాతో కలిసి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి చెప్పిన దాన్ని బట్టి వచ్చింది కేవలం ₹6,962 కోట్లు మాత్రమే. 25 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న వీళ్లు, కనీసం 20 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి లేదు, లాయర్లకు స్టైఫండ్ లేదు, విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ రాదు. పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్, ఆస్పత్రుల్లో వైద్యం అందక మరణాలు... ఇలా ఏ ఒక్క వర్గానికి కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయలేకపోయింది. - కూటమి గుండెల్లో వణుకు పుట్టిస్తాం.. అధికార మదంతో ప్రవర్తిస్తే యువత తలుచుకుంటే మిమ్మల్ని పరిగెత్తించడం ఖాయం. యువత అంతా ఒక్కటై రానున్న రోజుల్లో మీ ఇంటిని, అసెంబ్లీని ముట్టడించడం ఖాయం. కచ్చితంగా డియస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి. డియస్సీలో అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్.జగన్ ఆదేశాల మేరకు పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా ఆందోళనను చేపట్టడం ఖాయమని కొండా రాజీవ్ గాంధీ హెచ్చరించారు.