రూ. 30 కోట్లు..15 కోట్లు ఎర‌

() వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల‌కు ఎర‌
() టీడీపీ బేర‌సారాలు బ‌య‌ట పెట్టిన నేత‌లు
() టీడీపీ నీచ రాజ‌కీయాలు బ‌ట్ట బ‌య‌లు

సాలూరు మ‌రియు ఐరాల‌:  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల‌ను త‌మ వైపు తిప్పుకొనేందుకు తెలుగుదేశం చేస్తున్న నీచ ప్ర‌య‌త్నాలు క్ర‌మంగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేల‌ను కోట్ల రూపాయిలు పెట్టి కొనుగోలు చేసేందుకు చేస్తున్న య‌త్నాలు సంచ‌ల‌నం క‌ల‌గిస్తున్నాయి. ప‌ట్టిసీమ మొద‌లుకొని రాజ‌ధాని దాకా చేసిన వేల కోట్ల రూపాయిల అవినీతి తో సంపాదించిన సొమ్ముల్ని ఎమ్మెల్యేల‌ను కొనేందుకు య‌త్నిస్తున్నార‌న్న మాట నిజం అవుతోంది. ప్ర‌లోభాల వివ‌రాల్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బ‌య‌ట పెట్టారు. 
30 కోట్లు రేటు పెట్టారు
విజ‌య‌న‌గ‌రం జిల్లా సాలూరు ఎమ్మెల్యే పీడిగ రాజ‌న్న‌దొర టీడీపీ నాయ‌కుల ప్ర‌య‌త్నాల్ని వెల్ల‌డించారు. " టీడీపీ నాయ‌కులు న‌న్ను ప్ర‌లోభ‌పెట్టి ఆ పార్టీలో చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నించారు. తొలుత నాకు రూ. 5 కోట్లు ఇస్తామ‌ని చెప్పారు. ఆ త‌ర్వాత రూ. 15 కోట్లతో పాటు మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌న్నారు. నేను స్పందించ‌క‌పోవ‌డంతో ఏకంగా రూ. 30 కోట్ల‌తో పాటు మంత్రి ప‌ద‌వి కూడా ఇస్తాన‌న్నారు"     అని  ఎమ్మెల్యే పీడిక రాజ‌న్న‌దొర తెలిపారు. టీడీపీ నాయ‌క‌త్వం త‌న‌ను కొనుగోలు చేసే విష‌యంలో తెర‌వెనుక జ‌రిగిన మంత‌నాల‌ను బ‌య‌ట‌పెట్టారు. ఇటీవ‌ల ప్ర‌లోబాల‌కు లోనై వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు అధికార ప‌క్షం వారితో ఇమ‌డ‌లేక‌, వారి మ‌ధ్య కూర్చోలేక‌, ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పుకోలేక అవ‌స్థ‌లు ప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. 
రూ. 15 కోట్లు అంటూ ఫోన్ లు
 ప్రభుత్వంపై ప్రతిపక్షం ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌లో పాల్గొనకుండా ఉంటే ముందస్తుగా రూ.10 కోట్లు ముట్టజెబుతామంటూ తనకు టీడీపీ వర్గాల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని చిత్తూరు జిల్లా పూతలపట్టు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడించారు.
ఆదివారం ఆయన చిత్తూరు జిల్లా ఐరాలలో మీడియా ముందు ఈ వివరాలు వెల్లడించారు.  రూ.10కోట్లు ఇవ్వడంతోపాటు, తర్వాత రూ.5 కోట్ల రూపాయల మేర పనులు అప్పగిస్తామని చెప్పి కొన్ని రోజులుగా టీడీపీ వర్గాలు తనను ప్రలోభ పెడుతున్నాయని, కాల్స్ వస్తున్నాయని అన్నారు. దీనికి సంబంధించి ఓ ఎస్‌ఎంఎస్ కూడా తన నంబర్‌కు వచ్చినట్టు తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఈ విధమైన చర్యలు సరికావని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Back to Top