ఓట్లేసిన ప్రజలకు కాంగ్రెస్, టిడిపి వెన్నుపోటు

ఏలూరు, 12 సెప్టెంబర్ 2013: ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు కాంగ్రెస్, టిడిపి నాయకులు వెన్నుపోటు పొడిచారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినే శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల అన్నారు. సమైక్య శంఖారావం బస్సుయాత్రలో భాగంగా గురువారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్, టిడిపి నాయకులకు ఓట్లేసిన ప్రజల కంటే పదవులే ముఖ్యం అని మండిపడ్డారు. తమ ఓట్లు దండుకుని తమ బతుకులు బుగ్గిపాలు చేస్తారా? అని ప్రశ్నిస్తూ కోట్లాది మంది రోడ్డెక్కారన్నారు. కోట్లాది గుండెలు రగిలిపోతున్నాయన్నారు.

సమైక్యాంధ్ర విషయంలో మీరూ, మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజీనామాలు చేశారా? అని చంద్రబాబును  శ్రీమతి షర్మిల  ప్రశ్నించారు. జీతాలను త్యాగం చేసి ఎన్జీవోలు ఉద్యమం చేస్తుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కనికరం కూడాలేదని విమర్శించారు. చంద్రబాబు ఎన్జీవోల కృషిని కూడా తక్కువ చేసి చూస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన సంకేతాలు వచ్చిన వెంటనే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రతినిధులంతా ఒక్కుమ్మడిగా రాజీనామా చేశారని గుర్తు చేశారు. ఆ  రోజునే సీమాంధ్ర కాంగ్రెస్, టిడిని నాయకులు కూడా రాజీనామాలు చేసి ఉంటే.. విభజన ప్రక్రియ ఆగిపోయి ఉండేదన్నారు.

న్యాయం చేయలేరని తేలిపోయింది కనుక రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని శ్రీమతి షర్మిల డిమాండ్‌ చేశారు. తన కష్టాన్ని పక్కనపెట్టి జగనన్న ఏడు రోజులపాటు ప్రజల కోసం నిరవధిక నిరాహార దీక్ష చేశారని గుర్తు చేశారు. తనవంతు పోరాటాన్ని జైలు నుంచే చేశారన్నారు. తెలంగాణపై చేసిన తప్పును ఇప్పటిదాకా టిడిపి వెనక్కి తీసుకోలేదన్నారు. సీమాంధ్ర అట్టుడుకుతున్నా చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై ఒక్క మాటా మాట్లడకపోవడం దారుణం అన్నారు.

చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ తప్పు అని తన ఎమ్మెల్యేలతో సహా రాజీనామా చేయాలని  శ్రీమతి షర్మిల డిమాండ్‌ చేశారు. వారు రాజీనామాలు చేసేవరకు సీమాంధ్రులు వారిని తరిమి తరిమి కొట్టాలని పిలుపు ఇచ్చారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కాంగ్రెస్‌తో కుమ్మక్కయిందని చంద్రబాబు ఆరోపించడం కొత్త కాదన్నారు. చంద్రబాబును ఉద్దేశించి ఎఫ్‌డిఐ ఓటింగ్‌ విషయంలో కాంగ్రెస్‌తో కుమ్మకై ఎంపిలను గైర్హాజరు చేసింది మీరు కాదా? కాంగ్రెస్‌తో కుమ్మక్కై శ్రీ జగన్‌పై అక్రమ కేసులు పెట్టించింది మీరు కాదా? సమైక్యాంధ్ర విషయంలో మీతో పాటు మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజీనామాలు చేశారా? అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. చీకట్లో చిదంబరాన్ని కలిసి తనపై కేసులను మాఫీ చేయించుకున్న ఘనత చంద్రబాబుది అన్నారు.
Back to Top