వీధి రౌడీలా సీఎం విమ‌ర్శ‌లు

కోడ్‌ ప్రతిపక్షానికేనా.. అధికార పార్టీకి వర్తించదా..?
వైయస్‌ జగన్‌కు ఈసీ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదు
ఓటర్లను ప్రభావితం చేసేందుకు టీడీపీ మైండ్‌ గేమ్‌
నంద్యాలలో డబ్బులు పంచుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు
పోలీసులకు 10 మంది ఎమ్మెల్యేలు కనిపించడం లేదా..
టీడీపీ ప్ర‌లోభాల‌పై ఈసీకి ఫిర్యాదు  

హైదరాబాద్‌:  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై వీధిరౌడీలా విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి వాసిరెడ్డి ప‌ద్మ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసేందుకు చంద్ర‌బాబు ఇలాంటి వ్యాఖ్య‌లు చేశార‌ని ఆమె ధ్వ‌జ‌మెత్తారు. నంద్యాలలో అమలులో ఉన్న ఎన్నికల కోడ్‌ను తెలుగుదేశం ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎమ్మెల్యేలను నంద్యాలకు పంపించి ఏం చేయగలుగుతారో.. చేయండి అని ఆదేశాలు ఇచ్చారని ఆమె త‌ప్పుప‌ట్టారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..చంద్రబాబు తన ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చినట్లు పక్కా సమాచారం ఉందన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వ్యక్తి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించడం దారుణమన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు నంద్యాలలో బాహటంగా తిరుగుతున్నారని మండిపడ్డారు. నంద్యాల నివాసితుడైన శిల్పా చక్రపాణిరెడ్డిని ఓటర్‌ కాదని వెల్లగొట్టిన పోలీస్‌ యంత్రాంగానికి 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తిరుగుతుంటే కళ్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి వైయస్‌ఆర్‌ సీపీ నేతలను అరెస్టు చేయాలని పోలీసులు ఆదేశాలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. సచివాలయం కంట్రోల్‌రూమ్‌లో కూర్చొని మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారని ఫైరయ్యారు.

వైయస్‌ఆర్‌ సీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు
ఎన్నికల కోడ్‌ ప్రతిపక్షానికేనా.. అధికార పార్టీకి వర్తించదా అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. పోలీంగ్‌ బూత్‌లోకి టీడీపీ నేతలు, అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి, ఆయన సోదరి మౌనిక బూత్‌కు వెళ్లి ఓటర్లను, ఏజెంట్లను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తన పాలనను చూపించి గెలవలేని ముఖ్యమంత్రి కేవలం డ్రామాలు, అబద్ధాలు, గుండాయిజం క్రియేట్‌ చేసి గెలవాలని కుట్రలు చేస్తున్నాడన్నారు. చంద్రబాబు పోలీసులను వైయస్‌ఆర్‌ సీపీపై ఉసిగొల్పి విచ్చల విడిగా డబ్బులు పంచుతున్నారన్నారు. ఒక పక్క పోలింగ్‌ జరుగుతుంటే మరోపక్క వీధుల్లో తిరుగుతూ టీడీపీ నేతలు డబ్బులు పంచుతున్నా.. పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. నంద్యాల ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొంటున్నారని, మోసపూరిత చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ఓటు వేసేందుకు బారులు తీరారన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ఘన విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. 

అంత‌ అత్యుత్సాహం ఎందుకు?
ఉదయం నుంచి చంద్రబాబు తనకు అనుకూలంగా ఉన్న మీడియా ఛానళ్లతో ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌కు ఈసీ నోటీసులు ఇచ్చిందంటూ ఓటర్లను ప్రభావితం చేయడానికి మైంట్‌ గేమ్‌ ఆడుతున్నారని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. వాస్తవానికి వైయస్‌ జగన్‌కు ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన చంద్రబాబు, తప్పుడు ప్రసారాలు చేసిన మీడియా ఛానళ్లపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. కోడ్‌ ఉందని తెలిసి కూడా చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి వీధి రౌడీలా ప్రతిపక్షనేతపై విమర్శలు చేశారన్నారు.  ఓటర్లను బెదిరిస్తూ చంద్రబాబు, శిల్పా మోహన్‌రెడ్డి ఇంటిపై రాత్రి పోలీసులతో దాడులు చేయించారన్నారు. పోలింగ్‌ ఏజెంట్లకు ఫారాలు కూడా ఇవ్వనివ్వకుండా చేశారన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి నుంచి, పార్టీ నాయకులు, కార్యకర్తలను నిర్బంధించేందుకు కుట్రలు చేశారన్నారు. చంద్రబాబు ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఓటర్లు విజ్ఞతతో ఓటు వేయడానికి వచ్చారన్నారు. మరికొన్ని గంటల్లో ముగియనున్న ఓటింగ్‌లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని వాసిరెడ్డి ప‌ద్మ‌ కోరారు.

Back to Top