చంద్రబాబు కాదు అబద్ధాల బాబు

ఉండి, 25 మే 2013:

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును శ్రీమతి షర్మిల అబద్ధాల బాబుగా అభివర్ణించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో శుక్రవారం రాత్రి ఏర్పాటైన బహిరంగ సభలో తనదైన శైలిలో బాబు, కిరణ్ పాలనపై మండిపడ్డారు. చంద్రబాబు తన పాలనలో రైతుల ఉసురు తీశారనీ,  వ్యవసాయం దండగన్నారనీ గుర్తుచేశారు. ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని పిచ్చి లెక్కలు వేసి చెప్పిన విషయాన్ని ఎవరూ మరువలేదనీ, మరువలేరనీ ఆమె చెప్పారు. వృద్ధులు పింఛను కావాలంటే ఆ ఊళ్లో పింఛన్ వచ్చే వాళ్లెవరైనా మరణిస్తే  ఇస్తానన్నారు. రాయితీలుస్తే ప్రజలు సోమరలవుతారనేది చంద్రబాబు సూత్రీకరణని శ్రీమతి షర్మిల చెప్పారు.  ప్రజల్ని అంతలా వేధించిన చంద్రబాబు తనకు మళ్లీ అవకాశం ఇవ్వాలంటూ ఇటీవల పాదయాత్ర చేరని ఎద్దేవా చేశారు. ఇటీవలే దానిని ముగించిన బాబు ఇప్పుడు పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడం మొదలెట్టారన్నారు.
'చార్జీలు పెంచింది వైఎస్సారట.. చంద్రబాబు తన హయాంలో ఏ చార్జీలూ పెంచలేదట.. రైతుల పక్షాన నిలబడ్డారట.. ఆయన వల్లనే ఉచిత విద్యుత్తు సాధ్యమయిందట' ఇంతకంటే అబద్ధాలేమైనా ఉంటాయా అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. విమర్శించారు. చూడబోతే ఫీజు రీయింబర్సుమెంటు పథకం తానే ప్రవేశపెట్టానని చంద్రబాబు చెప్పినా చెబుతారని ఆమె ఎద్దేవా చేశారు. ఆరోగ్యశ్రీ, 108, 104 పథకాలు తనవే అని కూడా చెబుతారనే అనుమానాన్నీ వ్యక్తంచేశారు. చార్మినార్, నాగార్జున సాగర్ తానే కట్టాను అని కూడా ఆయన చెప్పగల దిట్టన్నారు.

8 సార్లు కరెంటు చార్జీలు పెంచారు
‘చంద్రబాబుకు అబద్ధాలు చెప్పడం కొత్తేమీ కాదన్నారు. మహానేత ఉచిత విద్యుత్తు ఇస్తానని హామీ ఇస్తే.. చంద్రబాబు పైన వేలాడుతున్న కరెంటు తీగలను చూపిస్తూ ‘ఉచిత విద్యుత్తు ఇస్తే వాటి మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే’ అని హేళన చేసి మాట్లాడారు. తొమ్మిదేళ్లలో 8 సార్లు కరెంటు చార్జీలు పెంచి వాటిని కట్టాలని ఒత్తిడి చేశారు. ‘అయ్యా మేం కరువులో ఉన్నాం.. అప్పుల్లో ఉన్నాం’ అని రైతులు ఎంత మొరపెట్టుకున్నా చంద్రబాబు నాయుడు వినలేదు. వాళ్ల మీద కేసులు పెట్టారు. ప్రత్యేక కోర్టులు పెట్టి రైతులను జైలుకు పంపించే వరకు నిద్రపోలేదు. అవమానాలు తట్టుకోలేక వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రోజులవి. చంద్రబాబు మన రాష్ట్రంలో రైతులను ఇంతగా హింసించారు.' ఎన్నికల తర్వాత ఆయనకు తాను చేసి వాగ్డానాలు గుర్తుండవని శ్రీమతి షర్మిల తెలిపారు. అలా మరిచిపోయిన వాటిలో ప్రతి మహిళకూ వివాహ సమయంలో మంగళ సూత్రాలు, పాఠశాలలకు వెళ్ళే ఆడపిల్లకు సైకిళ్ళు.. ఉన్నాయని వివరించారు.

నమ్మి ఓటేసి అధికారం ఇస్తే అన్ని వాగ్దానాల్లో చంద్రబాబు ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదన్నారు.  చంద్రబాబుకి మాట ఇవ్వడం అంటే ఏమిటో ఆ మీట మీద నిలబడడం అంటే ఏమిటో ఈ జన్మకు అర్థం కాదు. ఇది చాలదన్నట్టు ఇప్పుడేమో మళ్లీ వాగ్దానాలు చేస్తున్నారన్నారు. అధికారం ఉన్నప్పుడే ఏమీ చేయలేదు కాని ఇప్పుడేమో అన్నీ చేస్తామని వాగ్దానాలు చేస్తున్నారు. అంటే ప్రజలు అమాయయకులనీ, తాను ఏది చెప్తే అది నమ్ముతారని చంద్రబాబు అభిప్రాయపడుతున్నట్లున్నారు. ఎన్టీఆర్ గారు ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానైతే టీడీపీని స్థాపించారో, అదే కాంగ్రెస్ పార్టీతో ఈ రోజు చంద్రబాబు నాయుడు కుమ్మక్కైపోయారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఈ రోజు కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై సీబీఐని కలుపుకొని అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను నిర్బంధించాయని శ్రీమతి షర్మిల వాపోయారు.

ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబర్సుమెంట్, పావలా వడ్డీ రుణాలు, ఉచిత విద్యుత్తు, పక్కా ఇళ్లు ఇలా దివంగత మహానేత తన హయాంలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి చూపెట్టారు. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి రూపాయి కూడా చార్జీ పెంచని రికార్డు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ఆర్ అని చెప్పారు. మన దురదృష్టం కొద్దీ ఆ కాలం పోయింది. ఇప్పుడు మన ఖర్మకొద్దీ కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి ఇప్పటికే ఎరువుల ధరలు 300 శాతం పెంచారు. ఆర్టీసీ చార్జీలు 3 సార్లు పెంచారు. మరోవైపు రూ. 305 ఉన్న గ్యాసు ధర రూ. 420కు పెరిగింది. అదీ సబ్సిడీ ఉంటే. సబ్సిడీ లేకుంటే ఒక్క గ్యాసు సిలిండర్‌కు రూ.1,000 పెట్టాల్సిన పరిస్థితి. రిజిస్ట్రేషన్ చార్జీలు, వ్యాట్, కరెంటు చార్జీలు.. ప్రతి ఒక్కటీ పెంచేశారన్నారు.

Back to Top