చంద్రబాబువి డ్రామాలు

గుడివాడ(కృష్ణా జిల్లా) : ప్రత్యేక హోదా మీద చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని కృష్ణాజిల్లా
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) మండిపడ్డారు. కేసుల నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను
తాకట్టుపెట్టి మోదీ కాళ్లమీద పడ్డాడని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోరుతూ
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌పిలుపు మేరకు
మంగళవారం రాష్ట్ర బంద్ విజయవంతమైందని చెప్పారు. వ్యాపార, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ
ఉద్యోగులు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించి హోదా కావాలని తమ వాణిని బంద్ ద్వారా
వినిపించారన్నారు. రాజకీయాలతో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నేడు
రాష్ట్ర ప్రజలకు తన స్వప్రయోజనాలకోసం వెన్నుపోటు పొడుస్తున్నాడని విమర్శించారు.
ప్రత్యేక హోదా అవసరంలేదు ప్రత్యేక ప్యాకేజీ కావాలని కేంద్రాన్ని అడిగిన
చంద్రబాబు.. ఆ డబ్బు వస్తే తండ్రీ కొడుకులు దోచుకోవచ్చని అనుకున్నారని చెప్పారు. ప్రత్యేక
హోదాపై ముఖ్యమంత్రి దద్దమ్మ చంద్రబాబు తన డ్రామాలు మానుకోవాలని సూచించారు. పోలీసులతో
నాలుగు బస్సులు బలవంతంగా నడిపించి రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఆకాంక్ష లేదని
చెప్పడానికి చంద్రబాబు వక్రబుద్ధితో వ్యవహరిస్తున్నాడని నాని మండిపడ్డారు. రానున్న
ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టిన గతే చంద్రబాబుకు పడుతుందన్నారు. కేంద్రమంత్రి
వెంకయ్య నాయుడు రాష్ట్ర ప్రజల ఆకాంక్షను కేంద్రానికి చెప్పాలని సూచించారు. విభజన
చట్టంలో ఉన్న హామీలను కేంద్రం నెరవేర్చాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు
పాలేటి చంటి, దుక్కిపాటి శశిభూషణ్, గొర్ల శ్రీను పాల్గొన్నారు.

Back to Top