11నుంచి రంగారెడ్డి జిల్లాలో షర్మిల పాదయాత్ర

హైదరాబాద్, 8 డిసెంబర్ 2012:దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేపట్టిన 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్ర ఈ నెల 11వ తేదీ నుంచి రంగారెడ్డి జిల్లాలో కొనసాగనుంది. జిల్లాలోని మహేశ్వరం, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ఆరు రోజుల పాటు శ్రీమతి షర్మిల పాదయాత్ర చేయనున్నారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 100 కిలో మీటర్ల మేరకు పాదయాత్ర కొనగుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు.

     అక్టోబర్ 18న వైయస్ఆర్ కడప జిల్లాలో ప్రారంభమైన శ్రీమతి షర్మిల పాదయాత్ర కర్నూలు, అనంతపురం జిల్లాల మీదుగా ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతోంది. మరో రెండు రోజుల పాటు పాలమూరు జిల్లాలో శ్రీమతి షర్మిల తన పాదయాత్ర కొనసాగించి మంగళవారంనాడు రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించనున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని కోళ్లమట్ట గ్రామంలో శ్రీమతి షర్మిల పాదయాత్రకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని జనార్ధన్ రెడ్డి తెలిపారు.

Back to Top