వైయ‌స్ఆర్‌సీపీ నేత హత్యకు కుట్ర ?

ప‌ల్నాడు:  మాచర్ల నియోజకవర్గానికి చెందిన ఓవైయ‌స్ఆర్‌సీపీ మండల స్థాయి నాయకుడిని చంపేందుకు పన్నిన కుట్ర   భగ్నమైంది. దీనికోసం కర్నూలు జిల్లాకు చెందిన కిరాయి హంతకులకు కొందరు సుఫారీ ఇచ్చినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. మాచర్లలోని ఆర్‌అండ్‌బీ ప్రాంతంలో గురువారం సాయంత్రం అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ ఇద్దరిని వైయ‌స్ఆర్‌సీపీ దుర్గి మండల నాయకుడు మన్నెయ్య, అతని అనుచరులు పట్టుకున్నారు. వారిని స్థానిక పోలీసులకు అప్పగించగా వెంటనే స్పందించిన పోలీసులు ఆ పరిసరాల్లో ఉన్న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

మొత్తం ఐదుగురు కిరాయి హంతకులు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. వీరి నుంచి నాలుగు కత్తులు, రెండు కారం పొడి ప్యాకెట్లు దొరికినట్లు తెలుస్తోంది. వీరంతా కర్నూలు జిల్లాకు చెందిన సుఫారీ గ్యాంగ్‌ ముఠా అని, బుధవారం మధ్యాహ్నం పట్టణానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడిని చంపేందుకు వచ్చినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని సమాచారం.

దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత వివరాలు తెలుపుతామని మాచర్ల పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ మాచర్ల ఇన్‌చార్జిగా జూలకంటి బ్రహ్మారెడ్డిని నియమించిన రోజు నుంచి హత్యా రాజకీయాలు పురుడుపోసుకున్నాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలు నియోజకవర్గంలో భయాందోళలను కలిగిస్తున్నారు. ఎన్నూడు లేనివిధంగా వైయ‌స్ఆర్‌సీపీ నేతను చంపేందుకు సుఫారీ గ్యాంగ్‌ను రప్పించడం కలకలం రేపుతోంది.

Back to Top