8న జగనన్న విద్యా కానుక

అమరావతి : ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న విద్యా కానుక’కార్యక్రమాన్ని అక్టోబర్‌ 8న ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 42.34 లక్షల మంది విద్యార్థులకు రూ.650 కోట్ల ఖర్చుతో స్టూడెంట్‌ కిట్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు సమాచారశాఖ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌రెడ్డి  ఓ ప్రకటన విడుదల చేశారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు స్టూడెంట్‌ కిట్లు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. ప్రతి స్టూడెంట్‌ కిట్‌లో 3 జతల యూనిఫారాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్‌ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఒక స్కూల్‌ బ్యాగ్‌ ఉంటాయని తెలిపారు. బడిబయట పిల్లల సంఖ్యను గణనీయంగా తగ్గించడం, తద్వారా పాఠశాలల్లో పిల్లల నమోదు శాతం పెంచడంతో పాటు అభ్యసనా కార్యక్రమంలో వారు ఉత్సాహంగా పాల్గొనేలా చేయడం ద్వారా మెరుగైనా ఫలితాలు సాధించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని ఈ సందర్భంగా సమాచారశాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 
 

Back to Top