అనంతపురం జిల్లా: బొమ్మనహల్ మండలంలో వైయస్ఆర్సీపీ నేత యువరాజ్ స్వామిపై టీడీపీ గూండాలు దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గత కొంతకాలంగా జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడులు పెరుగుతున్నాయని వైయస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొమ్మనహల్ ప్రాంతంలో యువరాజ్ స్వామిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఆయనకు గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. దాడి వెనుక టీడీపీ గూండాల హస్తం ఉందని వైయస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన వైయస్ఆర్సీపీ రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి దాడిని తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షలతో రాష్ట్రంలో దాడులు కొనసాగుతున్నాయని, ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. యువరాజ్ స్వామిపై దాడి చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.