తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ మలివిడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. రాష్ట్రంలో 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వైయస్ఆర్ సర్కిల్లో ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించే బహిరంగ సభతో ఈ ప్రచార భేరి మోగించనున్నారు. నేడు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీఎం వైయస్ జగన్ పాల్గొననున్నారు. వైయస్ఆర్ సీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం తాడిపత్రిలోని వైయస్ఆర్ సర్కిల్లో తొలి సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని వెంకటగిరిలోని త్రిభువని సర్కిల్లో నిర్వహించే బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని కందుకూరు కేఎంసీ సర్కిల్లో జరిగే సభలోనూ సీఎం వైయస్ జగన్ పాల్గొంటారు. సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ కావడం.. బస్సుయాత్ర చరిత్ర సృష్టించడంతో వైయస్ఆర్ సీపీ శ్రేణులు, అభిమానులు, సానుభూతిపరులు రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీఎం వైయస్ జగన్ ఎన్నికల మలివిడత ప్రచారానికి శ్రీకారం చుడుతుండటంతో వైయస్ఆర్ సీపీ శ్రేణుల్లో నయాజోష్ నెలకొంది. ఎన్నికల తొలివిడత ప్రచారంలో భాగంగా గతనెల 27న వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నుంచి సీఎం వైయస్ జగన్ ప్రారంభించిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర 23 జిల్లాల్లో 86 నియోజకవర్గాల్లో 2,188 కిలోమీటర్ల దూరం సాగి, ఈనెల 24న శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ముగిసింది. ఈ యాత్రకు జనం తండోపతండాలుగా పోటెత్తడంతో నైతిక స్థైర్యం దెబ్బతిన్న కూటమి శ్రేణులు కుదేలయ్యాయి. బస్సుయాత్రలో మండుటెండైనా.. అర్ధరాత్రయినా అభిమాన సంద్రం ఉప్పొంగింది. ఇక ఇచ్చిన హామీలన్నీ అమలుచేయడం.. సుపరిపాలన అందించడం ద్వారా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపిన సీఎం వైయస్ జగన్ నాయకత్వంపై ప్రజల్లో బలమైన నమ్మకాన్ని బస్సుయాత్ర ప్రతిబింబించిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ ఘనవిజయం సాధించడం తథ్యమని జాతీయ, ప్రతిష్టాత్మక పొలిటికల్ కన్సల్టెన్సీలు నిర్వహించిన 20కి పైగా సర్వేలు తేల్చిచెప్పాయి.