రాష్ట్రంలో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్‌ గ్యాంగ్‌ 

వైయస్ఆర్‌సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్‌

గుంటూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త లక్ష్మీనారాయణను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.

చంద్రబాబు, లోకేష్‌కు ప్రైవేటు సైన్యంగా కొందరు పోలీసులు

పోలీసులు చట్టాలను చేతుల్లోకి తీసుకుంటే సమాజానికే చేటు

కొందరు పోలీస్‌ అధికారుల వల్ల మొత్తం వ్యవస్థకు చెడ్డపేరు

సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్షేపణ

లక్ష్మీనారాయణను వేధించిన డీఎస్పీపై చర్యలు తీసుకోవాలి

ఈ ఘటనపై సిట్టింగ్‌ జడ్జ్‌తో విచారణకు ఆదేశించాలి

రాష్ట్రంలో రాజ్యహింసపై రాష్ట్రపతి, ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు

సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టీకరణ

గుంటూరు: రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు కొందరు పోలీస్‌ అధికారులు ప్రైవేటు సైన్యంలా పని చేస్తున్నారని, వారితో ఒక ఆర్గనైజ్డ్‌ క్రై మ్‌ గ్యాంగ్‌ తయారయ్యిందని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్షేపించారు. గుంటూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త లక్ష్మీనారాయణను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 
    లక్ష్మీనారాయణను వేధించిన డీఎస్పీపై ప్రభుత్వం వెంటనే  విచారణకు ఆదేశించి, తగిన చర్యలు తీసుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి  డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై సిట్టింగ్‌ జడ్జ్‌తో జ్యుడీషియల్‌ ఎంక్వయిరీ జరిపించాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యహింస ఘటనలపై రాష్ట్రపతికి, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

మీడియాతో  సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

చట్టాల అతిక్రమణ సరికాదు:
    ఉత్తరప్రదేశ్‌లో పోలీస్‌ వ్యవస్థ ఒక ఆర్గనైజ్డ్‌ క్రై మ్‌ గ్యాంగ్‌గా మారిందని ఇటీవలే ఎన్‌హెచ్‌ఆర్‌సి ఆగ్రహం వ్యక్తం చేసింది. అలహాబాద్‌ హైకోర్ట్‌ యాబై ఏళ్ళ కిందట చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఈ కామెంట్‌ చేసింది. ‘చట్టాల ప్రకారం పని చేయాల్సిన వ్యవస్థ రాజకీయ నేతల అవసరాల కోసం, వారు చెప్పినట్లు చేసేందుకు గానూ చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే, ఒక క్రిమినల్‌ గ్యాంగ్‌కు యూనిఫారం వేసినట్లుగా ఉంటుంది’ అని ఆనాడు అలహాబాద్‌ కోర్ట్‌ వ్యాఖ్యానించింది. అదే పరిస్థితి ఇప్పుడు యూపీలో కనిపిస్తోందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
    కాగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే యూపీ కంటే రెండు వందల శాతం ఎక్కువగా కనిపిస్తోంది. రోజురోజుకూ రాష్ట్రంలో పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయి. 

పోలీసు పంచాయితీ:
    గుంటూరుకు చెందిన వ్యాపారి లక్ష్మీనారాయణ అనే వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తను డీఎస్పీ స్థాయి పోలీస్‌ అధికారి పంచాయతీ పేరుతో పిలిచి ఆయన ఆత్మగౌరవం దెబ్బతినేలా వేధించారు. దీనితో మనస్థాపం చెందిన లక్ష్మీనారాయణ ప్రాణత్యాగానికే సిద్దపడి, ఇప్పుడు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నారు. లక్ష్మీ నారాయణను.. నీవు, ఫలానా కులం వాడివి కాదా? ఈ పార్టీతో ఎలా ఉన్నావంటూ.. సాక్షాత్తూ డీఎస్పీ నిందిస్తూ  పంచాయతీ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్రం ఎటుపోతోందనే అనుమానం కలుగుతోంది.
    గతంలో ఎమర్జెన్సీ సమయం, తీవ్రవాదాన్ని అరికట్టే సందర్భాల్లో పోలీసులకు అసాధారణ పవర్స్‌ ఇచ్చినప్పుడు వారే సొంతంగా పంచాయతీలు చేయడం, జడ్జ్‌మెంట్‌ చేయడం చూశాం. తరువాత కాలంలో పోలీసులు ప్రజలతో మమేకమై, శాంతిభద్రతలను కాపాడే వ్యవస్థగా ఉండేలా అందరూ ప్రోత్సహించారు. వైయస్‌ జగన్‌ పాలనలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ను తీసుకువచ్చి, ప్రజలను కాపాడే వ్యవస్థగా మార్చారు. దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాశనం చేస్తున్నారు. 

అప్రకటిత ఎమర్జెన్సీ:
    రాష్ట్రంలో ఒక అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారు. పోలీసులకు చట్టాన్ని కాపాడేందుకు ఇచ్చిన ఒక శక్తివంతమైన ఆయుధాన్ని వారు తమ చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా దానిని వినియోగిస్తే ఎటువంటి అరాచకం జరుగుతుందో ఊహించవచ్చు. దీనిని కనీసం ప్రశ్నించే వారు కూడా ఉండరు. ఇది సమాజంలో దారుణమైన పరిస్థితులకు కారణమవుతోంది.
    రాష్ట్రంలో ఒక బలమైన రాజకీయపార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలపైనే పోలీసులు ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతుంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటీ? శాతవాహన కాలేజీ నిర్వాహకులపై టీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో కిడ్నాప్‌ చేశారు. తెనాలిలో ముగ్గురు యువకులను నడిరోడ్డుపై లాఠీలతో చావబాదారు. పల్నాడులో హరికృష్ణ అనే యువకుడిని పోలీస్‌ క్వార్టర్‌లో చిత్రహింసలకు గురి చేశారు. అలాగే సోషల్‌ మీడియా యాక్టివీస్ట్‌ సుధారాణి అనే మహిళను రోజుల తరబడి పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ కనీసం అరెస్ట్‌ కూడా చూపకుండా దారుణంగా వ్యవహరించారు. కృష్ణవేణి అనే సోషల్‌ మీడియా యాక్టివీస్ట్‌ విషయంలోనూ ఇలాగే చేశారు. ఇటువంటివి చూస్తే ఎవరైనా ఖాకీ యూనిఫారం చూస్తేనే భయపడుతున్నారు. చట్టాల ప్రకారం పని చేసే పోలీస్‌ అధికారులను వీఆర్‌లో పెట్టి వేధిస్తున్నారు.
    రాష్ట్రంలో వ్యవస్థలు గాడి తప్పాయి. చట్టాలకు విరుద్దంగా వ్యవహరించే వారిపై ఎటువంటి చర్యలు లేవు. పైగా అటువంటి వారికి హోం మంత్రి స్థాయిలో ఉన్నవారే మద్దతుగా మాట్లాడుతున్నారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఎప్పుడూ ఎవరినీ క్షమించలేదు. కానీ ఇప్పుడు అధికారపక్షమే వారికి అదనపు అధికారాలు ఇచ్చి దౌర్జన్యాలను ప్రోత్సహిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు.

Back to Top