తాడేపల్లి : మంత్రి నారా లోకేశ్ రెడ్బుక్ రాజ్యాంగం అంటూ మాట్లాడుతుంటే.. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ మాత్రం వాటిని అమలు చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూ ప్రజలను, తన అభిమానులను రెచ్చగొడుతున్నారు. వీరా మనల్ని పరిపాలించేది.. అంటూ వైయస్ఆర్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నాగనారాయణమూర్తి, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరు కనకారావులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్.. తన సినిమా ఈవెంట్లో అభిమానులను రెచ్చగొట్టేలా మాట్లాడటంపై శుక్రవారం రాత్రి తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. “సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లకు మీరు భయపడాల్సిన అవసరం లేదు.. దాడి చేయండి.. కొట్టండి.. మీకు నచ్చిన విధంగా దాడి చేయండి.. అది సివిలైజేషన్’ అంటూ పవన్కళ్యాణ్ ప్రజలను, వారి సైనికులను రెచ్చగొట్టడం దారుణమన్నారు. అదే రకమైన ప్రవర్తన జనసైనికులకూ వచ్చిందన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కారును అడ్డగించి ఆపి రాళ్లు రువ్వి, పైకెక్కి వారు చేసిన విన్యాసాలను అందరూ చూశారని, తిరుపతిలో ఓ థియేటర్ అద్దాలు పగులగొట్టి.. టికెట్ లేకుండానే సినిమా చూశారని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఈ విధమైన ప్రవర్తనతో వీరు రాష్ట్రాన్ని ఎటు తీసుకెళుతున్నారని ప్రశ్నించారు.