వైయస్ఆర్ జిల్లా: చంద్రబాబు ప్రజా విద్రోహ కార్యక్రమాలు బట్టబయలై జైలుకు వెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సీ.రామచంద్రయ్య అన్నారు. బాబు అవినీతి ఆరోపణలపై కేంద్ర సంస్థలు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లాలో పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ.. టీడీపీని ప్రజలు చీదరించుకొని ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా.. చంద్రబాబు చైతన్య యాత్ర చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు అవినీతి గ్రహించిన ప్రజలు గత ఎన్నికల్లో టీడీపీని తిరస్కరించారన్నారు. గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, ఆ సొమ్మంతా గడిచిన ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాలకు బదలాయించాడన్నారు.
చంద్రబాబు తన వైఫల్యాలను ప్రజలపై నెడుతున్నాడని, ప్రజలు చాలా విజ్ఞులని, పనిచేసే ప్రభుత్వాలకే ఓటు వేస్తారని రామచంద్రయ్య అన్నారు. అది ఢిల్లీలో ప్రూవ్ అయిందని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడంతో దారుణంగా ఓడించారన్నారు. నీ అవినీతిని ప్రజలు సమర్థించాలా..? చంద్రబాబూ అని ప్రశ్నించారు. ఐటీ దాడుల్లో ఆధారాలతో సహా దొరికిపోవడం వల్లే చంద్రబాబు వాటిపై మాట్లాడలేకపోతున్నాడని ఆరోపించారు. మొన్నటి వరకు మోడీపై చంద్రబాబు విరుచుకుపడ్డాడని, ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు మోడీలు ఉన్నారని, వారిని ఓడగొడతానని మాట్లాడాడని గుర్తుచేశారు. ఇప్పుడు బీజేపీలోకి టీడీపీ ఎంపీలను పంపించి మోడీతో జతకట్టేందుకు చంద్రబాబు తహతహలాడుతున్నాడని ఎద్దేవా చేశారు. బాబు వైఖరిని అర్థం చేసుకున్న ప్రధాని మోడీ దగ్గరకు కూడా రానివ్వడం లేదన్నారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనపై పచ్చమీడియా విషప్రచారం చేస్తోందిన రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటిరోజున 1:45 గంటల పాటు రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు, ఆర్థిక అవసరాలు, కౌన్సిల్ ఏ పరిస్థితుల్లో రద్దు చేశామని సీఎం జగన్ ప్రధాని మోడీకి వివరించారన్నారు. కానీ, ఎల్లో మీడియా మాత్రం వేరే విధంగా వార్తలు రాసిందని మండిపడ్డారు. ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఆంధ్రజ్యోతి పత్రిక క్వశ్చన్ మార్కులు, ఆశ్చర్యార్థకం పెట్టి వార్తలు రాస్తుందని, ఇదేనా జర్నలిజం అని ప్రశ్నించారు.