తాడేపల్లి: రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించి, మత వైషమ్యాలు పెంచేందుకు కొన్ని రాజకీయ పక్షాలు కుట్రలు చేస్తున్నాయని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనలో దోషులను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని, ఇందుకోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఘటనలో పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వైయస్ జగన్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ అందరి మన్ననలు పొందుతున్నారని చెప్పారు. హిందుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని దుయ్యబట్టారు. గురువారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చాలా దురదృష్టకరం అంతర్వేది ఆలయంలో వచ్చే ఫిబ్రవరిలో రథోత్సవం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆలోపే మరో రథాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం రూ.95 లక్షలు మంజూరు చేసింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించి, దోషులను కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అంతర్వేదిలో రథం దగ్ధం కావడం చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఈ నెల 5వ తేదీ నుంచి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు విచారణకు ఆదేశించడం, ఈవోను సస్పెండ్ చేయడం వంటి చర్యలన్నీ గమనిస్తే ప్రభుత్వం చిత్తశుద్ధితో దోషులను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుందని ఎవరికైనా అర్థం అవుతోంది. ప్రార్థన మందిరంపై రాళ్లు వేయడం సమంజసం కాదు.. దురదృష్టం ఏంటంటే ప్రభుత్వంపై బుదర జల్లేందుకు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని కొన్ని రాజకీయ పక్షాలు, దుష్టశక్తులు ఇందులో ప్రవేశించాయి. ఈ అనుమానాలు రావడానికి ప్రధానంగా ఆ శాఖకు చెందిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మరో మంత్రి విశ్వరూప్ ఆలయానికి వెళ్లే అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరో ప్రార్థన మందిరంపై రాళ్లు వేశారు. దోషులను శిక్షించాలన్న దానికన్న కొన్ని మతాల మధ్య మత వైష్యమ్యాలు పెంచేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. మరో ప్రార్థన మందిరంపై రాళ్లు వేయడం అనేది సమంజసం కాదు. దీన్ని హిందువులే కాదు..దేశ ప్రజలెవరూ అంగీకరించారు. మరో మాట చెప్పాలంటే శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి కూడా దీన్ని సహించరు. భక్తుల ముసుగులో కొన్ని దుష్టశక్తులు ప్రవేశించి, మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాయన్న అనుమానాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏమైనా ఉందా? ప్రభుత్వ అలసత్వం ఉందా? లేక మరొకరు ఎవరైనా దుండగులు చేశారా అన్న కోణంలో విచారణ జరపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. విచారణ జరుగుతోంది. దోషులు తప్పనిసరిగా బయటకు వస్తారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం ప్రభుత్వం, సీఎం వైయస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇంత చకచకా చర్యలు తీసుకుంటుంటే ప్రభుత్వంపై బుదర జల్లేందుకు కొన్ని రాజకీయ శక్తులు తాపత్రయంతో పని చేస్తున్నాయి. ప్రజల దృష్టి మరల్చేందుకు.. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగకుండా సీఎం వైయస్ జగన్ శ్రద్ధ తీసుకొని ముందుకు సాగుతున్నారు. దాదాపు రూ.60 వేల కోట్ల రాష్ట్ర ప్రజలకు నేరుగా అందించారు. రేపు వైయస్ఆర్ ఆసరా కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. వీటిని దృష్టి మళ్లించేందుకు ఏదో ఒక సంఘటనను పట్టుకొని దురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వైయస్ జగన్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వానికి ఏ మతమైనా ఒక్కటే..రాష్ట్రంలో అన్ని మతాల ప్రజలు అన్నదమ్ముల మాదిరిగా కలిసి బతుకుతున్నారు. మతాల సామరస్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది. మతాలతో రాజకీయాలు చేయడం దురదృష్టకరం. అంతర్వేది ఘటనపై దోషులను శిక్షించేందుకు ఈ ప్రభుత్వం వెనుకాడదు. గతంలోనూ ఇలాగే ఆరోపణలు చేసి అభాసుపాలు.. గతంలో తిరుపతి బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం అంటూ, కొండపై శిలువ ఉందని, శ్రీశైలంలో అన్యమతస్థులు ఉన్నారని టీడీపీ ఆరోపించింది. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగినవే అనితెలిసి అభాసుపాలు అయ్యారు. ప్రస్తుతం చక్కని, స్థుస్తిర పాలన సాగుతోంది. కుట్రలు చేసి బురద జల్లే ప్రయత్నం మానుకోవాలి. ఇవాళ సోము వీర్రాజు మాట్లాడారు. దోషులను శిక్షించేందుకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదా? రథం తగిలేయడం ఎంత తప్పో? చర్చీలపై రాళ్లు వేయడం అంతే తప్పు. చంద్రబాబు ఈ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అన్యాయాలు, దౌర్జన్యాలు చేసి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. వైయస్ జగన్ కష్టపడి, ప్రజల నుంచి వచ్చారు. చంద్రబాబుకు నైతిక హక్కు లేదు.. చంద్రబాబుకు హిందుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు, విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. 39 పురాతన దేవాలయాలను ఇష్టం వచ్చినట్లు కూలగొట్టిన ఘటనలు తెలుగు ప్రజలు మరిచిపోలేదని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలి. మీ పార్టీ నాయకుడి ఇళ్లు పోతుందని, మధ్యలో ఉన్న గుడిని దుర్మార్గంగా కూల్చిన ఘటన ఎవరూ మరిచిపోలేదు. అలాంటి వ్యక్తి ఇవాళ హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు. అంతర్వేది రథం దహనం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు. కులాలు, మతాల మధ్య విద్వేషాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకునే నీచ సంస్కృతి చంద్రబాబుదే. విచారణకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎలాంటి విచారణకైనా ప్రభుత్వం రెడీగా ఉంది. అన్ని మత విశ్వాసాలను కాపాడుతామని అంబటి రాంబాబు పేర్కొన్నారు.