తాడేపల్లి: హైదరాబాద్లోని పార్కు హయత్ హోటల్లో నిమ్మగడ్డ, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ల రహస్యభేటీపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. `బాబు హైదరాబాద్ లో చేస్తున్న గలీజు పనులివే. గోతులు తవ్వడం, చీకటి వ్యవహారాలు, మ్యానిప్యులేషన్లు, వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో మునిగి తేలుతుంటాడు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని విజయవంతంగా సమాధి చేసి, దళారి స్థాయికి పతనమయ్యాడు. అధికారం దరిదాపుల్లోకి ఎప్పటికీ రాలేడు` అని ట్వీట్ చేశారు. అదే విధంగా.. `ఏడాదిలోనే 90 శాతం హామీలు నెరవేర్చి, ఇంకా చేయాల్సిన పనుల గురించి జగన్ గారు తపన పడుతుంటే, బాబు గ్యాంగ్ హైదరాబాద్ లో తిష్ఠవేసి కుట్రలకు తెగబడ్డారు. రాష్ట్ర శ్రేయస్సు అవసరం లేదు. ప్రజలు సంతోషంగా ఉండొద్దు. సంక్షేమ పాలనను ఎలా అడ్డుకోవాలా అని స్కెచ్చులు వేస్తున్నారు` అని మరో ట్వీట్ చేశారు. `అసలు వాళ్లు ముగ్గురు గోప్యంగా కలవాల్సిన రాచకార్యాలు ఏమున్నాయని అంతా అనుమానాలు వ్యక్తం చేస్తుంటే, కుల మీడియా ఆవేదన మరోలా ఉంది. సిసి కెమెరా ఫుటేజి బయటకెలా వచ్చిందని గుండెలు బాదుకుంది. విఐపిలు, సెలబ్రటీలు వెళ్లే చోట ఇంత ఆశామాషీగా ఉంటే ఎలా అని కడివెడు నీళ్లు కార్చింది` అంటూ ఎల్లోమీడియా మీడియా తీరుపై ట్వీట్ చేశారు.