ప్రభుత్వ భూములను పప్పుబెల్లాల్లా పంచుకుంటే చూస్తూ ఊరుకోవాలా?

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి ఎమ్మెల్యే అంబటి రాంబాబు

ముస్లిం వక్ఫ్‌ భూములను కూడా టీడీపీ నేతలు వదల్లేదు

భూముల స్వాధీనంపై ఎల్లోమీడియా గగ్గోలు 

తాడేప‌ల్లి:  టీడీపీ హ‌యాంలో ప్రభుత్వ భూములను పప్పుబెల్లాల్లా పంచుకుంటే చూస్తూ ఊరుకోవాలా? అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు ప్ర‌శ్నించారు. విశాఖలో టీడీపీ నేతలు భారీగా భూకబ్జాలు చేశారని   ధ్వజమెత్తారు. మంగళవారం  తాడేపల్లిలోని  వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో  అంబ‌టి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. 
టీడీపీ నేతల ఆక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ భూముల స్వాధీనంపై ఎల్లోమీడియా గగ్గోలు పెడుతోందని మండిపడ్డారు. లీజులు ముగిసినా కూడా భూములు ఖాళీ చేయలేదన్నారు. గతంలో చేసిన వ్యాఖ్యలు అయ్యన్న మర్చిపోయారా? భూ కబ్జాలపై అప్పటి మంత్రి అయ్యన్న ఫిర్యాదు చేసింది గుర్తులేదా? అని ఆయన ప్రశ్నించారు. 

విశాఖలో భూ కబ్జాలపై ఎల్లో పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయని.. ముస్లిం వక్ఫ్‌ భూములను కూడా టీడీపీ నేతలు వదల్లేదన్నారు. ‘‘టీడీపీ నేతల భూకబ్జాలను చంద్రబాబు సమర్ధిస్తారా?. ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటే కక్షసాధింపు ఎలా అవుతుంది. ప్రభుత్వ భూములను పప్పుబెల్లాల్లా పంచుకుంటే చూస్తూ ఊరుకోవాలా?. టీడీపీ నేతలు భూకబ్జాలు చేయలేదని చంద్రబాబు చెప్పగలరా?. చంద్రబాబుకు అధికార, ధనకాంక్ష తప్ప మరో ఆలోచన లేదంటూ అంబటి రాంబాబు దుయ్యబట్టారు. ప్రజల ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఎమ్మెల్యే అంబటి అన్నారు.

తాజా వీడియోలు

Back to Top