గొల్లపూడిలో ఘనంగా సీఎం వైయస్‌ జగన్‌ బర్త్‌ డే వేడుకలు

600 కేజీల భారీ కేక్‌కట్‌ చేసిన వైయస్‌ఆర్‌ సీపీ ప్రజాప్రతినిధులు, నేతలు

విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను గొల్లపూడిలో ఘనంగా నిర్వహించారు. సీఎం పుట్టినరోజును పురస్కరించుకొని 600 కేజీల కేక్‌ను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, వెల్లంపల్లి శ్రీనివాస్, సామినేని ఉదయభాను, మ‌ల్లాది విష్ణు, కైలా అనిల్‌కుమార్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, రుహుల్లా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా సీఎం వైయస్‌ జగన్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. గొల్లపూడిలో ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఆధ్వర్యంలో జరిగిన సీఎం పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆలోచనలు దేశ రాజకీయాల్లోనే ఒక ప్రత్యేకతగా నిలుస్తున్నాయని, సామాజిక దృక్పథంతో వైయస్‌ఆర్‌  సీపీ ప్రభుత్వ పరిపాలన సాగుతోందని చెప్పారు. ఈరోజు రాష్ట్రంలోని ప్రజానీకం కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా సీఎం వైయస్‌ జగన్‌ను ఆదరిస్తున్నారన్నారు. మునుపెన్నడూ లేని విధంగా పరిపాలనలో అనేక సంస్కరణలు చేపట్టారని గుర్తుచేశారు. విద్య, వైద్యం, ఉద్యోగం, ఇళ్లు ఇలా సామాజిక దృక్పథంతో పరిపాలన చేస్తున్నారని, సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్‌ ఆలోచన విధానంతో సీఎం వైయస్‌ జగన్‌ పాలన సాగుతోందన్నారు. 

నా నియోజకవర్గంలో ట్యాబ్‌ల పంపిణీ..
ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం ఎడ్లపల్లి గ్రామంలో జరగనుందని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా  విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ జరగనుందని, ఈ కార్యక్రమం తన నియోజకవర్గంలో జరుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరి క్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం వైయస్‌ జగన్‌కు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని రాష్ట్ర ప్రజలందరి తరఫున కోరుకుంటున్నామని చెప్పారు. 
 

Back to Top