ఒక వైపు కరోనా బాధితులు..మరో వైపు పేదల సంక్షేమం

కరోనా కట్టడిలో వలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ ఎంతో కీలకం

ప్రధాని సూచనలు పాటిస్తూ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం

కరోనా వల్ల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేయలేకపోయాం

వైయస్‌ జగన్‌ ప్రచారం కోరుకోవడం లేదు  

వైయస్‌ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి 

తాడేపల్లి:  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా నియంత్రణపై ప్రభుత్వం ముందుగానే అప్రమత్తతం కావడంతో పరిస్థితి అదుపులో ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు   సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఒక వైపు కరోనా బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ..వారికి సరైన వైద్యం అందించడంతో పాటు మరోవైపు పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. సీఎం వైయస్‌ జగన్‌కు పబ్లిసిటీ  అవసరం లేదని, ప్రభుత్వం తరఫున చేయాల్సిన కార్యక్రమాలన్ని చేస్తునే, అధికారులతో పనులు చేయిస్తున్నారన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.  ప్రజా సంక్షేమానికి సీఎం వైయస్‌ జగన్‌ పెద్దపీట వేశారని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు వైయస్‌ఆర్‌సీపీ కట్టుబడి ఉందన్నారు. నేడు పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల పంపిణీ చేయాలనుకున్నామని.. కానీ కరోనా వల్ల ఇళ్ల పట్టాల కార్యక్రమం చేయలేకపోయమని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమల్లో దేశానికే ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా నిలిచిందన్నారు. మహిళా సాధికారికతకు కూడా సీఎం వైయస్‌ జగన్ పెద్దపీట వేస్తున్నారని చెప్పారు.

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ముందంజ
కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించడంలో అమెరికా వంటి దేశాలు సరైన రీతిలో అప్రమత్తం కాకపోవడం వల్ల వైఫల్యం చెందిందని సజ్జల అన్నారు.  భారత దేశం ప్రధాని మోడీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం  ముందు జాగ్రత్తలు తీసుకుందని చెప్పారు. సీఎం వైయస్‌ జగన్‌ ముందు చూపుతో కరోనా కట్టడి విషయంలో ఆయా రాష్ట్రాలతో పోల్చితే ఏపీ ముందంజలో ఉందని పేర్కొన్నారు.  సామాజిక దూరం పాటించడం, ఇతర జాగ్రత్తలు తీసుకోవడంలో గ్రామ స్థాయిలో ఉన్న వలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ ఎంతో కీలక పాత్ర పోషించాయని అన్నారు. ఇది ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ విజన్ అని తెలిపారు. 

అప్పట్లో చంద్రబాబు చేసిందేమిటి?
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విపత్తులు వస్తే ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు అన్నారు. చంద్రబాబు చేసింది తక్కువ..ప్రచారం ఎక్కువగా ఉంటుందన్నారు.  ఏదైన తప్పులు జరిగితే అధికారుల మీద తోసి వేయడం, మంచి జరిగితే ఆయన ఖాతాలో వేసుకోవడం చూశామన్నారు. హుద్ హుద్ తుపాను వస్తే చంద్రబాబు ప్రచారం కోసం విశాఖలో కూర్చుంటే అధికారులు చాలా ఇబ్బందులు పడ్డారని సజ్జల గుర్తు చేశారు. గోదావరి పుష్కరాల సమయం ఏడాది ముందే తెలిసినా, చివరి నిమిషం వరకు పనులు చేయకుండా, ఆ తర్వాత నామినేషన్ పద్దతిలో కోట్ల రూపాయల పనులు కేటాయించారని విమర్శించారు.

వైయస్‌ జగన్ అధికారులకు స్వేచ్ఛ ఇచ్చారు
ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌  మోహన్ రెడ్డి  వ్యవస్థలు పనిచేయాలని కోరుతున్నారన్ని సజ్జల తెలిపారు.  అధికారులకు దిశానిర్దేశం చేసి, స్వేచ్చగా పని చేసే వెలుసుబాటు కల్పించడంతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు.   ఇలాంటివి వైయస్‌ జగన్‌ ప్రచారానికి వాడుకోరని తెలిపారు.  గంటల కొద్ది మీడియా సమావేశాలు పెట్టి సమయం వృథా చేయడం సిఎంకు ఇష్టం ఉండదన్నారు. కరోనా కట్టడికి సీఎం వైయస్‌ జగన్‌ తాను చేయవలసిన పనులు అన్నీ చేశారని, కంట్రోలింగ్ మెకానిజం, హెల్ప్ లైన్ లు పెట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.   

Back to Top