నెల్లూరు జిల్లా: కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి హామీ ఇచ్చారు. సర్వేపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని పార్టీ కమిటీల ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా గ్రామ, మండల, వార్డు స్థాయి కమిటీలను బలోపేతం చేస్తూ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయాలని, కార్యకర్తలే పార్టీ బలమని పేర్కొంటూ నాయకులు, కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం మాజీ మంత్రివర్యులు, వైయస్ఆర్ సీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు పాల్గొని పార్టీ కమిటీల ప్రాధాన్యతను నాయకులు, కార్యకర్తలకు వివరించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు మేడా రఘునాధ్ రెడ్డి , తిరుపతి ఎంపీ గురుమూర్తి , రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితమ్మ తదితర ప్రముఖ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ, వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రామ, మండల, వార్డు స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టామని తెలిపారు. మండల, వార్డు కమిటీల్లో పనిచేసే నాయకులు, కార్యకర్తలకు తగిన గౌరవం, గుర్తింపు కల్పించేలా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పారు. ముఖ్యంగా గ్రామస్థాయి కమిటీల్లో పనిచేసే ప్రతి కార్యకర్తకు అధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ఈరోజు ప్రతిపక్షంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ, రేపు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు. అలాగే కూటమి ప్రభుత్వం కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిపై తప్పుడు కేసులు బనాయించినా, ఆయన ధైర్యంగా ఎదుర్కొని నిలబడటం కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలిచిందని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికార పార్టీ ఎంతటి ఒత్తిళ్లు తెచ్చినా తట్టుకొని నిలబడే శక్తిని కార్యకర్తలకు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు అందించారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి అధ్యక్షతన ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పదికి పది అసెంబ్లీ స్థానాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.