తాడేపల్లి: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం రాక, నిరుద్యోగ యువతకు శాపంలా మారిందని, కొత్తగా ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా, అదే పనిగా పలువురు కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నారని వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ఆక్షేపించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏపీపీఎస్సీ వ్యవహరించినా, ఆ సంస్థ కార్యదర్శిగా పని చేసిన డీజీ స్థాయి అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును దారుణంగా వేధిస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాగార్జునయాదవ్ తెలిపారు. ప్రెస్మీట్లో నాగార్జునయాదవ్ ఇంకా ఏం మాట్లాడారంటే..: ఆయన్ను వేధించడమే వారి ధ్యేయం: రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడంలో భాగంగానే తమకు నచ్చిన వ్యక్తులను కేసుల్లో ఇరికించడం, నచ్చిన సెక్షన్లు ప్రయోగించడం జరుగుతోంది. దేశ చరిత్రలోనే లేని విధంగా రాష్ట్రంలో డీజీ స్థాయి అధికారిని వేధించడం కోసం ముంబై నుంచి ఒక చిన్న ఆర్టిస్టును తీసుకొచ్చి తప్పుడు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. జత్వాని కేసులో పీఎస్సార్ ఆంజనేయులును అరెస్ట్ చేసిన తర్వాత.. తాను ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పని చేసినప్పుడు, ఆ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని కొత్త కథను తయారు చేసుకొచ్చి తద్వారా ఆయనను ఇబ్బంది పెట్టడమే కాకుండా, నిరుద్యోగ యువతలో అనుమానాలు రేకెత్తించే కుట్రలకు కూటమి ప్రభుత్వం తెర తీసింది. హైకోర్టు ఆదేశాలతోనే..: 2019 అసెంబ్లీ ఎన్నికలకు కొన్నాళ్ల ముందు, యువతను మభ్య పెట్టడం కోసం డిసెంబర్ 31, 2018న చంద్రబాబు ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి సంబంధించి 2019 మే నెలలో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అందులో 51 తప్పులొస్తే అభ్యర్థులు కొందరు హైకోర్టుకెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకు, అప్పుడున్న వైయస్సార్సీపీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆ పరీక్షలో వచ్చిన తప్పులు సరిదిద్ది, ఫలితాలు ప్రకటించి, ఆ తర్వాత మెయిన్స్ పరీక్ష నిర్వహించింది. అయితే అప్పుడు కోవిడ్ ఉండడంతో, ఆ పత్రాలను డిజిటల్ మూల్యాంకనం చేశారు. దీనిపై కొందరు అభ్యర్థులు కోర్టుకెళ్తే, అనివార్య పరిస్థితుల్లో డిజిటల్ మూల్యాంకనం చేసినా, సంప్రదాయ పద్ధతిలో తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. ఆ మేరకు ఆ ప్రశ్నపత్రాలు సంప్రదాయ పద్ధతిలో మూల్యాంకనం చేయడంతో పాటు, కోర్టు ఆదేశాల మేరకే ఫలితాల ప్రకటన. ఇంటర్వ్యూల నిర్వహణ. తుది ఫలితాల ప్రకటన. ఆ తర్వాత ఉద్యోగాల నియామకం జరిగింది. 2018 నుంచి 2022 వరకు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పని చేసిన డీజీ స్థాయి అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును టార్గెట్ చేసుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం, ఆ పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఆరోపించి, కేసు పెట్టి వేధిస్తోంది. కూటమి ప్రభుత్వం. నిరుద్యోగులకు శాపం: చంద్రబాబుకు యువత, నిరుద్యోగులపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. అందుకే వైయస్ జగన్ హయాంలో 21 నోటిఫికేషన్లు ఇస్తే వాటన్నింటినీ పెండింగ్లో పెట్టి పరీక్షలకు సిద్ధమవుతున్న 8.5 లక్షల నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు. గ్రూప్ పరీక్ష విషయంలో కూటమి ప్రభుత్వం ఆడిన డ్రామాను అభ్యర్థులు ఎప్పటికీ మర్చిపోలేరు. రేపు ఉదయం పరీక్ష జరుగుతుందనగా ఈరోజు సాయంత్రం పరీక్ష వాయిదా పడిందని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. పరీక్ష వాయిదా వేశామని సీఎం చంద్రబాబు చెప్పినట్లు ఆడియో లీకు చేశారు. కానీ ఉదయం మాత్రం యథావిథిగా పరీక్ష నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం గ్రూప్స్ అభ్యర్థుల జీవితాలతో తండ్రీకొడుకులు బంతాట ఆడుకున్నారు. వైయస్ జగన్ హయాంలో..: అంతకు ముందు వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ ద్వారా 78 నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించి 6,296 పోస్టులు భర్తీ చేశారు. దాని ద్వారా అప్పటి సీఎం శ్రీ వైయస్ జగన్ మంచి పరిపాలన దక్షుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇదే విషయం కేంద్ర ప్రభుత్వ అధ్యయనంలోనూ తేలింది. 2019–24 మధ్య పలు రాష్ట్రాల్లో నిర్వహించిన పోటీ పరీక్షల్లో 65 పేపర్లు లీక్ కాగా, మన రాష్ట్రంలో మాత్రం అన్ని పరీక్షలు సజావుగా నిర్వహించారని, అది అప్పటి సీఎం శ్రీ వైయస్ జగన్ సమర్థతను తెలియజేస్తోందని కేంద్ర ప్రభుత్వ నివేదిక స్పష్టం చేసింది. నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు చెలగాటం: విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నాడు. చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయింది మొదలు అన్నిసార్లు ప్రశ్నాపత్రాలు లీకవ్వడం అనేది సర్వసాధారణంగా మారింది. 1995లో చంద్రబాబు తొలిసారి సీఎం కాగానే, పదో తరగతి ప్రశ్నపత్రం లీకైంది. ఆ తర్వాత 1997లో ఇంటర్ ప్రశ్నపత్రం లీకైంది. విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే 2017లో మంత్రిగా ఉన్న నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్థల్లో ప్రశ్నపత్రాల లీకేజీల పరంపర కొనసాగింది. రాయలసీమ జిల్లాల్లో ఉన్న నారాయణ విద్యాసంస్థల్లో వరుసపెట్టి పేపర్ లీక్లు జరిగాయి. ఆ విషయం టీడీపీ కరపత్రంగా ఉన్న ఈనాడులో కూడా రాశారు. అయినా ఎవరిపైనా ఏ చర్యలు లేవు. ఇప్పుడు కూడా ప్రశ్నపత్రాల లీకేజీ కొనసాగుతోంది. ఇటీవలే పదో తరగతి ప్రశ్నపత్రం లీకైంది. చివరకు హాఫ్ ఇయర్లీ ప్రశ్నపత్రాలు కూడా వాట్సాప్లో ప్రత్యక్షమయ్యాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీఈడీ ప్రశ్న పత్రాలు లీకయ్యాయి. కాగా, వైయస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు 2022లో పేపర్ లీక్ చేయడానికి నారాయణ విద్యాసంస్థలతో పాటు, పలు కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రయత్నిస్తే, వాటిని వైయస్ఆర్సీపీ ప్రభుత్వం భగ్నం చేసింది. 12 మందిని అరెస్టు చేసి పలు విద్యాసంస్థల మీద కేసులు నమోదు చేసింది.