తాడేపల్లి: కేవలం రెండు ఎకరాల ఆస్తిని మాత్రమే ఇచ్చిన తాత ఖర్జూరనాయుడు, ఆయన కుమార్తెలన్నా నారా లోకేష్కు చిన్నచూపేనని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చివరికి అమరావతి, కుప్పంలో చంద్రబాబు నిర్మించిన నారా మహల్స్ శంకుస్థాపన, గృహప్రవేశాలకు కూడా లోకేష్ తన సొంత మేనత్తలను ఆహ్వానించకుండా వారిని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన ఆస్తులను రక్తంపంచుకు పుట్టిన చెల్లెళ్ళకు ఏ మేరకు పంపకం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కుటుంబం అంటే ఏ మాత్రం ప్రేమాభిమానాలు లేని నారా చంద్రబాబు, లోకేష్లు ఇతరుల కుటుంబాల గురించి పెద్దమనుషులుగా మాట్లాడటం గురివింద గింజ సామెతను తలపిస్తోందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే... మహానాడు సాక్షిగా నారా లోకేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్గారిని తన తాత అంటు, తాను ఆయన రాజకీయ వారసుడిని అని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగు సంప్రదాయంలో మన తాతగారు ఎవరు అవుతారు? మన నాన్న తండ్రి తాతగారు అవుతారు. ఈ లెక్కన లోకేష్ తాతగారు ఎవరంటే అది ఖర్జూరపు నాయుడు. ఆయన పేరు చెప్పుకుంటే తప్పేముంది. ఆయన ఫొటోకు దండేసి, పూలు జల్లితే తప్పేముంది. రెండెకరాల సామాన్యుడని ఆయనపై చిన్నచూపా? నారా లోకేష్ ఈ సమాజానాకి ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారో స్పష్టం చేశాలి. మా నాయకుడి కుటుంబం గురించి వారు మాట్లాడుతున్నారు. అసలు చంద్రబాబుగారి కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు? ఆయన చెల్లెళ్లు ఎక్కడ? లోకేష్ తన మేనత్తల గురించి ఎప్పుడైనా పట్టించుకున్నాడా? కనీసం మొన్న అమరావతిలో నారా మహల్ నిర్మాణ శంకుస్థాపనకు పిలిచాడా? పోనీ మొన్న కుప్పంలో ఇంటికి గృహప్రవేశం పిలిచినప్పుడైనా పిలిచాడా? పోనీ లోకేష్ తన అత్తలకు, అంటే చంద్రబాబుగారు తన చెల్లెళ్లకు పంచిన ఆస్తులు ఎన్ని? అంతెందుకు తెలుగు సంప్రదాయం ప్రకారం తల్లి ఆస్తులు కూతుళ్లకు వస్తుందంటారు…, కాని తన నాయనమ్మ ఆస్తిని లోకేష్ తనపేరుమీ ఎందుకు రాయించుకున్నాడు. హైదరాబాద్లో ఖరీదైన మదీనాగూడ భూమి ఎలా రాయించుకున్నాడు..? సమాధానాలు చెప్పగలరా? పోనీ తన హెరిటేజ్ ఆస్తుల్లో చంద్రబాబు తన చెల్లెళ్లకు ఏదైనా ఇచ్చాడా? ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని అక్రమంగా లాక్కొని, ఆయన మరణానికి కారకుడైన చంద్రబాబు గుప్పిట్లో టీడీపీ ఉందన్న సంగతి రాష్ట్రంలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. చంద్రబాబును అధ్యక్షపీఠం నుంచి లాగేస్తున్న లోకేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్టీఆర్ కాళ్ల దగ్గరకి చేరిన పెద్ద కోవర్టు చంద్రబాబే. ఆ లక్షణాలనే పుణికి పుచ్చుకున్న నారా లోకేష్ ఇప్పుడు చంద్రబాబుని పార్టీ అధ్యక్ష పీఠం నుంచి లాగబోతున్నాడు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కుర్చీ నుంచి లాగి పడేస్తాడు. ఇందతా పైనుంచి చూసి ఎన్టీఆర్ సంబరపడతారు. రాజకీయాల కోసం ప్రత్యర్థుల కుటుంబ సభ్యులపై నీచ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. హైదరాబాద్, అమరావతి, కుప్పంలలో వందల వేల కోట్లతో చంద్రబాబు విలాసవంతమైన రాజభవనాలు కడుతున్నాడు. కానీ ఏ ఒక్క ప్రారంభోత్సవానికి కూడా చంద్రబాబు తన తోబుట్టువులను ఎందుకు పిలవలేదు? ఆయా ఇళ్ల భూమి పూజలు, గృహ ప్రవేశాలకు పాలు పొంగించడానికి తోబుట్టువులు ఎందుకు రాలేదు? తమ్ముడి భార్యను కూడా పిలవలేదు. వారంతా ఎక్కడున్నారని మేం కూడా అడిగితే ఏం సమాధానం చెబుతారు. నారా ఖర్జూరనాయుడు నా తాత. నేను ఖర్జూర నాయుడి మనవడ్ని అని లోకేష్ ఎందుకు చెప్పడం లేదు? ఎంతోమంది కూతుళ్లు, మనవళ్లు, మనవరాళ్లు, ఇంకో కోడలు ఉన్నప్పటికీ చంద్రబాబు తల్లి మదీనాగూడలో వందల వేల కోట్లు విలువ చేసే ఇంటిని నారా లోకేష్ పేరిట మాత్రమే ఎందుకు రాసింది? అమ్మన్నమ్మ గారి మనవడ్ని అని లోకేష్ ఎందుకు చెప్పడం లేదు? ఎన్టీఆర్ మనవడివి ఎలా అవుతావు అని మేం అడగడం లేదు కదా. ఇప్పటికైనా తండ్రీకొడుకులు రాజకీయాల్లోకి ఇతరుల కుటుంబ సభ్యులను లాగడం ఆపితే బాగుంటుంది. పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసు అధికారం అండతో టీడీపీ నాయకులు చేస్తున్న పాపాలకు అంతేలేకుండా పోతోంది. పల్నాడు జిల్లాలో జంట హత్యలు జరిగిన వెంటనే భారీగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, ప్రత్యక్ష సాక్షులను విచారించారు. జిల్లా ఎస్పీ కూడా అక్కడికి చేరుకుని హత్యకు సంబంధించి మీడియా ఎదుట వివరాలు వెల్లడించారు. హత్య చేసిన వారు, హత్యకు గురైన వారు ఇద్దరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనని స్పష్టంగా చెప్పారు. స్థానికులతోపాటు పోలీస్ సిబ్బందితో మాట్లాడిన తర్వాతనే జిల్లా ఎస్పీ మీడియా ముందుకొచ్చి వివరాలు చెప్పారు. ఆధిపత్య పోరుతోనే ఈ జంట హత్యలు జరిగాయని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. వర్గపోరుతోనే తెలుగుదేశంలోని ఒక వర్గం ఇంకో వర్గం మీద దాడి చేసి చంపారని ఒకపక్క ఎస్పీ స్వయంగా మీడియాకు చెబితే, రాత్రి 8 గంటలకు తయారు చేసిన ఎఫ్ఐఆర్లో మాత్రం పిన్నెల్లి సోదరులను నిందితులుగా చేర్చారు. హత్యతో ఏ సంబంధం లేకపోయినా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ6, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని ఏ7 గా కేసు నమోదు చేశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? హత్య సమయంలో కారులోంచి ఐదుగురు వ్యక్తులు దిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ ఐదుగురిలో ఏ ఒక్కరైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నారా? ఏనాడైనా ఫ్యాన్ గుర్తుకు ఓటేశారా? పిన్నెల్లి సోదరులతో ఎప్పుడైనా తిరిగారా? ఆధారాలుంటే చూపించాలి. ఈ హత్య కేసులో ముద్దాయిగా ఉన్న తోట వెంకట్రామయ్య తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే స్కార్పియో కారు కొన్నాడు. కారు కొన్న వెంటనే టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డిని పిలిచి ఆయనతోనే ఓపెనింగ్ డ్రైవ్ చేయించాడు. అంతేకాదు ఎమ్మెల్యే పేరు జేబీఆర్ అని స్టిక్కర్ కూడా వేయించుకున్నాడు. ఇదుగో అందుకు సంబంధించిన ఫోటోలు. ఎమ్మెల్యేకి ఎంత చనువు కాకపోతే ఆయనతో కొత్త కారును నడిపిస్తాడా? ఇదే కారులో ఎమ్మెల్యే జూలకంటి, తోట వెంకట్రామయ్యను వెంటబెట్టుకుని వెళ్లి సీఎం చంద్రబాబును కలిసి ఫొటోలు దిగుతారా? మొన్న ప్రభుత్వ ఉద్యోగం పొందిన తోట వీరాంజనేయులు కూడా హత్యకేసులో నిందితుడిగా ఉన్న తోట వెంటక్రామయ్య కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో కూడా పాల్గొన్నాడు. నిందితులు టీడీపీ వారేనని ఇన్ని ఆధారాలు స్పష్టం చేస్తున్నా, వైయస్ఆర్సీపీ వారిగా చూపించి పిన్నెల్లి సోదరులను కేసుల్లో అక్రమంగా ఇరికించాలని కుట్ర పన్నారు. ఇంతకన్నా ఘోరం ఇంకెక్కడైనా ఉంటుందా? ఇంకెన్ని పాపాలు మూటకట్టుకుంటారు. పవన్ సినిమా కోసమే థియేటర్లలో తనిఖీలు రాష్ట్రంలో మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరిగినా విచారణ చేయరు. మర్డర్లు జరిగినా శిక్షలుండవు. ఆఖరుకి పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహించే పిఠాపురంలో దళితులను సాంఘిక బహిష్కరణ చేసినా ప్రభుత్వం పట్టించుకోదు. కానీ పవన్ కళ్యాణ్ సినిమా ఆపడానికి ప్రయత్నిస్తున్నారని అనుమానం వచ్చిందే తడవగా ఎంక్వయిరీ అన్నారు. ట్రంప్ ఒప్పుకుని ఉంటే విచారణకు ఎఫ్బీఐని కూడా విచారణకి పిలిపించేవారేమో. సినిమాలతో ప్రభుత్వాలకు ఏంటి సంబంధం అని నాడు పవన్ కళ్యాన్ అన్నాడు. ఇప్పుడు ఆయనే కలగజేసుకుంటున్నాడు. టికెట్ల రేట్ల మీద ఎందుకు పరిమితులు విధిస్తున్నారు. ఎంత రేటుకైనా ఎందుకు అమ్ముకోనివ్వడం లేదు. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంటే తప్ప సినిమా హాళ్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ఆయనకు అనిపించలేదు. కూల్ డ్రింక్లు, పాప్కార్న్ పేరుతో దోచుకుంటున్నారని ఆనాడు తెలియదా? ఏడాదిగా పట్టించుకోకుండా ఇప్పుడెందుకు తనిఖీలు చేయిస్తున్నారు. నాడు థియేటర్ల మీద కక్ష కట్టారని మా ప్రభుత్వం మీద విష ప్రచారం చేశారు. చివరికి మా వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలనే ఇప్పటికీ పాటిస్తున్నారు. దానిలో తప్పులుంటే ఎప్పుడో రద్దు చేసేవారే కదా. ఇంటిలిజెన్స్ వైఫల్యం చెందింది ఈ ప్రభుత్వం ఎంత చేతకానిదంటే, ఏప్రిల్ 19న సినిమా థియేటర్ల యాజమాన్యాలు కూర్చుని సమ్మె చేయాలని నిర్ణయించుకుంటే ఈ ప్రభుత్వానికి సమాచారం లేదు. జనసేన నాయకుడు ఇంటర్వ్యూలు ఇచ్చింది కూడా ఇంటిలిజెన్స్కి తెలియదు. ఎంతసేపటికీ రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థను వైయస్ఆర్సీపీ నాయకుల ఇంటి చుట్టూ పెట్టి కాపలా కాయిస్తున్నారు. ఇంటిలిజెన్స్ డిపార్ట్మెంట్ మా ఇళ్ల చుట్టూ తిరుగుతున్నట్టుంది. ఎవరో ప్రొడ్యూసర్ వీడియో పంపితే తప్ప థియేటర్ యాజమాన్యాలు పెట్టుకున్న మీటింగ్, సమ్మె నిర్ణయం గురించి వారికి తెలియలేదు. ఈ కారణంగానే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఇంతగా క్షీణించాయి. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు వీరికి అధికారం దక్కింది. పోలీసులను శాంతి భద్రతల పరిరక్షణకు కాకుండా వైయస్ఆర్సీపీ నాయకుల మీద ప్రతీకారాలకు వాడుకుంటున్నారు. కాబట్టే ముక్కు పచ్చలారని చిన్నారి నుంచి వృద్ధ మహిళల వరకు ఆడవారి మానప్రాణాలకు రక్షణ లేకుండా పొయింది.