తాడేపల్లి: రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీలను కూడా వేలంపాటగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని వైయస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నలమారు చంద్రశేఖర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతి బదిలీకి ఒక రేటును నిర్ణయించి కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యే స్థాయి నుంచి మండల నాయకుల వరకు దోచుకుంటున్న విపరీత పరిస్థితిని చూస్తున్నామని మండిపడ్డారు. నిబంధనలను పక్కకుపెట్టి లంచాలు ముట్టచెబితేనే బదిలీ అంటున్న దారుణం రాష్ట్రమంతా కనిపిస్తోందని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేల సిఫారస్ లేఖ ఉంటేనే బదిలీ చేస్తామంటున్న అధికారులు ఈ లంచాల పర్వంలో భాగస్వాములుగా మారారని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే.. సాధారణ బదిలీలకు సంబంధించి ప్రభుత్వం జీవో ఎంస్ నెంబర్ 23ని మే 15న విడుదల చేసింది. మే 16 నుంచి జూన్ 2 వరకు సాధారణ బదిలీలు చేపట్టాలని అన్ని శాఖలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రజలకు పారదర్శక పాలన అందించాలనే ఉద్దేశంతో ఈ బదిలీలు చేపట్టాలని జీవో పేర్కొంటూనే దానికి భిన్నంగా అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతూ ఉద్యోగులను వేధిస్తున్నారు. గతేడాది కూడా వసూళ్ల కోసం బదిలీల గడువును పెంచుకుంటూ పోయారు. బదిలీలను వేలంపాటగా మార్చేశారు. ఉద్యోగుల బదిలీల్లో రాజకీయ జోక్యం ఎక్కువైపోయింది. మండల స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ఉద్యోగులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కూటమి పాలనలో ఉద్యోగుల బదిలీల పేరిట నాయకులు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యేల నుండి సిఫార్సు లేఖలు తెమ్మని కొందరు అధికారులు చెబుతున్నారు. దాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది కూటమి పార్టీల నాయకులు ముఠాగా ఏర్పడి రూ. లక్షల్లో లంచాలు వసూలు చేస్తున్నారు. పోస్టును బట్టి రేటును నిర్ణయించి రూ. 2 లక్షల నుంచి దండుకుంటున్నారు. రెవెన్యూ శాఖలో భారీగా వసూళ్లపర్వం బదిలీలకు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు తీసుకురావాలనే విధానం పెట్టడం ఏంటి? ఈ విధానం సరైనదేనని భావిస్తే దాన్ని జీవోలో ప్రభుత్వం ఎందుకు ప్రస్తావించలేదు? ముఖ్యంగా రెవెన్యూ డిపార్టుమెంట్ లో ఈ తంతు ఎక్కువగా నడుస్తోంది. నాయకులు దందాలు చేసుకునేందుకు వీలుగా తమకు అనుకూలమైన తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లను తమకు కావాల్సినట్టుగా బదిలీ చేయించుకుంటున్నారు. ఉద్యోగుల మీద ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకోవాలనే కుట్రలకు తెరలేపారు. నిబంధనలు అర్హతలను పక్కనపెట్టి మరీ లంచాలతో బదిలీలు చేస్తున్నారు. సెరీ కల్చర్ డిపార్ట్మెంట్లో రూ. లక్షల్లో వసూలు చేస్తున్నట్టు పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా వసూళ్లు చేసుకుంటూ పోతే ఉద్యోగులు కూడా స్వేచ్చగా పనిచేసే పరిస్థితి ఉండదు. ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా బదిలీల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలి. వసూళ్ల పర్వానికి ముగింపు పలికి ఉద్యోగుల విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకుని బదిలీలు చేపట్టాలి. ఉద్యోగులపై దాడులు అరికట్టాలి కూటమి పాలనలో ఉద్యోగుల భద్రత కొరవడింది. గురువారం నాడు అనంతపురం జిల్లాలో రాజేష్ నాయుడు అనే టీడీపీ నాయకుడు మహానాడుకి ప్రజలను తరలించలేదనే కారణంతో అశ్వథ్రెడ్డి అనే సచివాలయం ఉద్యోగిని అసభ్యపదజాలంతో దూషించాడు. కావాలంటే రికార్డు చేసుకోండని భయంలేకుండా బెదిరింపులకు దిగాడు. చంద్రగిరి నియోజకవర్గం రామిరెడ్డిపల్లె అనే పంచాయతీలో ఒక టీడీపీ నాయకుడు తన బిల్లుల కోసం గ్రామ సచివాలయానికి వెళ్లి ఉద్యోగులను నానా విధాలుగా దుర్భాషలాడి వారిని బయటకు పంపి కార్యాలయానికి తాళం వేశాడు. ప్రభుత్వ ఉద్యోగులను టీడీపీ నాయకులు బానిసలుగా భావిస్తున్నారు. ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల మీద ప్రభుత్వం తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలి. దీంతోపాటు ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తక్షణం నెరవేర్చాలి.