కుప్పకూలిన శాంతిభద్రతలు

మీరు, మీ పార్టీ నాయకుల నేరపూరిత చర్యలే అందుకు కారణం 

సీఎం చంద్రబాబుపై వైయ‌స్‌ జగన్‌ మండిపాటు

రాష్ట్రంలో ఎవరికీ రక్షణ, భద్రత లేకుండా పోయింది.. ఇందుకు శ్రీకాళహస్తిలో జరిగిన ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ

ఒక పోలీసుకు లేని రక్షణ ఇక సామాన్యులకు ఎక్కడిది? 

వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త శివలక్ష్మీనారాయణ ఆత్మహత్యకు బాధ్యులెవరు?  

అక్రమ కేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసిన వారిపై ఏం చర్యలు తీసుకుంటారు? 

ప్రజాస్వామ్యయుతంగా ప్రజల తరఫున కార్యక్రమాలు చేస్తే చంపేస్తారా?  

‘రాప్తాడు’లో దళిత బాలికపై సామూహిక అత్యాచారం చేసిన వారిపై చర్యలేవి? 

మీ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు చూస్తూ ఊరుకోరు 

బాధితులకు న్యాయం జరిగేలా వైయ‌స్ఆర్‌సీపీ పోరాడుతుంది

తాడేప‌ల్లి: రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. రాజకీయ కక్షలతో చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా లా అండ్‌ ఆర్డర్‌ (శాంతిభద్రతలు) కుప్పకూలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ, భద్రత లేకుండా పోయిందని, అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయంటూ ఇటీవల చోటుచే­సుకున్న సంఘటనలను గుర్తు చేశారు. 

అధికారంలో ఉన్న వారు అహంకారం, రౌడీయిజంతో చెలరేగిపోయి.. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు యంత్రాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ఫలితంగా జరుగుతున్న ఘటనలు అత్యంత దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు శ్రీకాళహస్తిలో జరిగిన ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అంటూ ఎత్తిచూపారు. 

మీ పద్ధతి మార్చుకోకపోతే.. ప్రజలు ఎల్లకాలం చూస్తూ ఊరుకోరని సీఎం చంద్రబాబును హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగేలా వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం చేస్తుందని భరోసా ఇస్తూ ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైయ‌స్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

1 అధికార పార్టీ.. పోలీసు యంత్రాంగాన్ని ఏ రకంగా అదుపాజ్ఞల్లోకి తీసుకుందో చెప్పడానికి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భార్య వాహనం డ్రైవర్‌ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. దీంతో ఓ పోలీసు చలానా రాశాడు. దీంతో ఆ ఎమ్మెల్యే.. ఆ కానిస్టేబుల్‌ను రప్పించుకుని, సీఐ సమక్షంలో నిందితుడైన అదే డ్రైవర్‌తో దాడి చేయిస్తారా? చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఆ ఘటనను మూసివేసేలా ప్రయత్నించి వ్యవస్థలకే తలవంపులు తెస్తున్నారు. ఒక పోలీసుకు లేని రక్షణ ఇక సామాన్యులకు ఎక్కడిది?

2 రాజకీయ కక్షలతో నిర్దోషులపై తప్పుడు కేసులు పెట్టి, వారిని జైళ్లకు పంపడం పరిపాటిగా మారింది. వైఎస్సార్‌ జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త రెడ్యం శివలక్ష్మీనారాయణపై అక్రమంగా కేసుపెట్టి, తీవ్రంగా కొట్టారు. లంచం ఇవ్వలేదని.. లేని గంజాయి కేసుపెట్టి 2 నెలలపాటు జైలుకు పంపడంతో అవమానాలు భరించలేక ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

పదేళ్ల కొడుకు, ఎనిమిదేళ్ల కూతురు ఉన్న లక్ష్మీనారాయణ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. చంద్రబాబు ఏడాది పాలనలో రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి గురైన ఇలాంటి కుటుంబాలెన్నో ఉన్నాయి. లక్ష్మీనారాయణకు జరిగిన అన్యాయానికి బాధ్యత ఎవరిది? అక్రమ కేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసిన వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారు? వ్యవస్థలు సక్రమంగా పని చేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేదా? 

3 ప్రజా సమస్యల పరిష్కారంపై గళమెత్తుతూ వైయ‌స్ఆర్‌సీపీ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందుకు టీడీపీ వాళ్లు కక్షగట్టి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమేష్‌ నాయుడును కత్తులతో పొడిచి, బండరాయితో మోది చంపేశారు. ఇక రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా, ప్రజల తరఫున ఎవ్వరూ కార్యక్రమాలు నిర్వహించకూడదా? అలా చేస్తే చంపేస్తారా? పోలీసుల పర్యవేక్షణ, ఇంటెలిజెన్స్‌ సరిగ్గా ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు కదా?  

4 శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లి గ్రామంలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికపై సామూహిక అత్యాచారం అత్యంత అమానవీయం. ఈ ఘటనపై కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనీయకుండా టీడీపీ వాళ్లు భయపెట్టారు. నిందితులకు అధికార పార్టీ అండదండలు ఉండడంతో వారిని ఎదిరించే ధైర్యం లేక, తండ్రి లేని ఆ బాలిక కుటుంబం ఏకంగా ఊరు విడిచి వెళ్లిపోయింది. పోలీసులది ప్రేక్షక పాత్రే అయ్యింది.

5 ఈ ఘటనలన్నింటినీ వేర్వేరుగా చూడకూడదు. చట్టాన్ని అపహాస్యం చేసి, బాధితులకు న్యాయాన్ని నిరాకరించి, అధికార పార్టీకి చెందిన వారు అని, ఆ నిందితులను స్వేచ్ఛగా వదిలేసినప్పుడు, ఈ పరిణామాలన్నింటినీ మౌనంగా చూస్తున్నప్పుడు.. కేవలం పాలన మాత్రమే కాకుండా, ప్రజాస్వామ్యాన్ని నడిపించే వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోతాయి. చంద్రబాబూ.. మీరు మీ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు ఇక ఎల్లకాలం చూస్తూ ఊరుకోరు. బాధితులకు న్యాయం జరిగేలా వారి తరఫున వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం  చేస్తుంది.   

Back to Top