తాడేపల్లి: పొగాకు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు పొదిలికి వచ్చిన వైయస్ జగన్ పై కుట్రపూరితంగానే టీడీపీ రాళ్ళ దాడి చేయించిందని వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షనేతగా వైయస్ జగన్ ఎక్కడకు వెళ్ళినా పెద్ద ఎత్తున వస్తున్న ప్రజాధరణను చూసి కూటమి ప్రభుత్వం ఓర్వలేక పోతోందని మండిపడ్డారు. దీనిలో భాగంగానే పొదిలిలో ఒక ప్రణాళిక ప్రకారం జగన్ కాన్వాయిలో అరాచకం సృష్టించేందుకు హింసకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే... పొగాకు వేలం కేంద్రానికి వైయస్ జగన్ వేలాది మందితో ర్యాలీగా వస్తుంటే టీడీపీ దాడులకు తెగబడింది. కొంతమంది నల్లబెల్లూన్లతో నిరసన తెలిపే పేరుతో ముందు నిలబెట్టి వారి వెనుక రాళ్ల కుప్పను ఏర్పాటు చేసి, ర్యాలీపైకి రాళ్ళతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా ఈ ప్రతికా సమావేశంలో ప్రజలు చూసేందుకు ప్రదర్శిస్తున్నాం. ఈ వీడియోల్లో చాలా స్పష్టంగా ఎలా టీడీపీ మూకలు దాడి చేశాయో చూడవచ్చు. మాజీ ముఖ్యమంత్రి ర్యాలీగా వస్తుంటే నల్ల బెలూన్లు, ప్లకార్డులతో నిలబడి నిరసన తెలిపే వారికి పోలీసులు ఎలా పర్మిషన్ ఇచ్చారు? నిరసనకు ఎవరు పర్మిషన్ అడిగారు? ఆ అర్జీ ఎక్కడుందో చూపించాలి. రాళ్ల దాడులకు పాల్పడిన వారిలో నలుగురైదుగురు తప్ప స్థానికులు ఎవరూ లేరు. కేవలం అక్కడ స్థానికుల ఇంటి స్థలాన్ని మాత్రమే దాడులకు వాడుకున్నారు. టీడీపీ వారు మా ర్యాలీపై దాడులు చేస్తుంటే జిల్లా ఎస్పీ స్వయంగా నిలబడి వారికి రక్షణ కల్పించడం దారుణం. ఈ రాళ్ల దాడుల్లో తలలు పగిలి అమాయకులైన రైతులు తీవ్రంగా గాయపడ్డారు. దాడులు చేసిన వారిని వదిలేసి పోలీసులు లాఠీలతో వాతలు తేలేలా రైతులను చావబాదారు. మళ్లీ అర్థరాత్రి వేళ మా నాయకుల ఇళ్లమీద పడి జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులను అరెస్ట్ చేశారు. మన్నం శ్రీధర్ అనే మా పార్టీకి చెందిన జిల్లా ప్రధాన కార్యదర్శిని బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఇంట్లో నుంచి ఎందుకు తీసుకెళ్లారు? ఆయనేమైనా రౌడీషీటరా? ఆయన మీద ఏమైనా కేసులున్నాయా? ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. రైతులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత కాదా? నష్టపోతున్న పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అడగడం మా పార్టీ చేసిన తప్పా? రైతులను కొట్టిన పోలీసుల మీద సుమోటోగా కేసులు నమోదు చేయాలి. - నిరసనకి ఎలా అనుమతించారు? జగన్ కార్యక్రమానికి వేలాదిగా జనం వస్తారని తెలిసి కూడా నిరసనలకు ఎలా అనుమతించారు? ఏదైనా జరగరాని సంఘటన జరిగి ఉంటే దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? 50 వేల మంది ర్యాలీగా వచ్చి 40 మంది మీద దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదా? కానీ నిరసన పేరుతో టీడీపీ నాయకులు ఎంతగా కవ్వించినా మా కార్యకర్తలెవరూ చలించలేదు. క్రమశిక్షణతో నడుచుకున్నారు కాబట్టే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. మా నాయకుడి మాదిరిగానే మా కార్యకర్తలకు విలువలు, విశ్వసనీయతకి ఈ ఘటన ఉదాహరణ. 40 మంది టీడీపీ నిరసనకారుల కోసం 400 మంది పోలీసులను రక్షణగా మోహరించారు. దాడుల కోసం ఇళ్లపై రాళ్లకుప్పలను సిద్ధం చేసుకున్నారు. టీడీపీ నాయకులే దాడులకు తెగబడినట్టు ఎన్నో వీడియోలు సాక్ష్యంగా ఉన్నా మా నాయకుల మీదనే అక్రమ కేసులు నమోదు చేశారు. ఆఖరుకి జైళ్లలో ఉన్న వారి కోసం పరామర్శకు వెళితే మా జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాదరెడ్డి మీద ఈ దుర్మార్గపు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. మా నాయకులు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పట్ల సీఐ దురుసుగా వ్యవహరించాడు. మహానటులు టీడీపీ నేతలు పొరుగు రాష్ట్రంలో సినిమా రంగంలోని నిష్ణాతులకు ఇచ్చిన అవార్డులను రాజకీయాల్లో అత్యుత్తమ నటులు, దర్శకులుగా ఉన్న టీడీపీ వారికి ఇవ్వాలి. ఉత్తమ దర్శకుడు అవార్డు ఏపీ సీఎం చంద్రబాబుకి, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టు అవార్డు కొలుసు పార్థసారథికి, ఉత్తమ కమెడియన్ అవార్డు పట్టాభి చౌదరికి, ఉత్తమ విలన్ నారా లోకేష్కి ఇవ్వాలి. వారే దాడులు చేసి మేమే దాడులు చేసినట్టు మా నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక దళితుల మీద వరుసగా దాడులు జరుగుతున్నాయి. ప్రతిపక్ష నేత తెనాలిలో దళిత యువకులను పరామర్శించడానికి వెళితే వారి మీద రౌడీషట్ ఉందని ప్రచారం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి చనిపోతే పరామర్శించడానికి తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ వెళ్లారు. ఆ వీరయ్య చౌదరి మీద కూడా ఆరు క్రిమినల్ కేసులున్నాయి. వారు చెప్పేదాని ప్రకారం నేరారోపణలు ఉన్నప్పుడు పరామర్శించడానికి ఎలా వెళ్లారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి వెళ్లొచ్చా? దళితులను పరామర్శించడానికి మేం వెళితే తప్పు, మీ పార్టీ నాయకుల కోసం మీరు వెళితే ఒప్పా? దీనికి మంత్రి కొలుసు పార్థసారథి సమాధానం చెప్పాలి. రాష్ట్ర రాజకీయాల్లో పట్టాభి చౌదరి పేపర్ పులి. ప్రత్యక్ష రాజకీయాల్లో కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవని పట్టాభి చౌదరి, మాజీ సీఎం వైయస్ జగన్ ను ఉద్దేశించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పటికే వైయస్ జగన్ని ఉద్దేశించి నోటికొచ్చినట్టు మాట్లాడి రాష్ట్రంలో గతంలో జరిగిన అనేక సంఘటనలకు పట్టాభి బాధ్యుడయ్యాడు. ఇప్పటికీ ఏమయ్యా జగన్ రెడ్డీ అంటూ తన నోటిదూల ప్రదర్శిస్తున్నాడు. నోటికొచ్చినట్టు పేలితే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నా. వైయస్ జగన్ అంటే మీకు ఇష్టం లేకపోయినా ఆయన రాష్ట్రంలోని ఎంతోమందికి దేవుడు. తాడేపల్లి కొంప, బెంగళూరు కొంప అని నీచంగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడితే పట్టాభి మీద కేసులుండవా? రెడ్ బుక్ పేరుతో మా పార్టీ నాయకుల మీద జరుగుతున్న దాడులన్నీ గుర్తుంచుకుంటాం. అన్నింటికీ వడ్డీతో సహా చెల్లించుకుంటాం. రైతన్నలను పరామర్శించడానికి వెళితే ప్రతిపక్ష నాయకుడి మీద జరిగిన రాళ్ల దాడిని ఈ రాష్ట్ర రైతులంతా చూశారు. ఈ రాళ్లే రేపటి రోజున జగన్ మీదకి పూలవుతాయి. టీడీపీ వేసిన చెప్పులే ఆయన మెడలో మాలలవుతాయి. మంత్రి పార్థసారథి అన్న మాటలు వెనక్కి తీసుకోవాలి. పట్టాభి చౌదరిని టీడీపీ నాయకత్వం కంట్రోల్ లో పెట్టుకోవాలి. వైయస్సార్సీపీ నాయకులను అక్రమ కేసులతో వేధించడం మీద పెట్టిన శ్రద్దను ప్రజాసమస్యల పరిష్కారం మీద పెట్టాలి.