తాడేపల్లి: రాష్ట్రంలో బ్రాహ్మణులపై యథేచ్ఛగా దౌర్జన్యాలు సాగుతున్నాయని, వారిని కూటమి ప్రభుత్వం బలహీనులుగా చూస్తోందని, అందుకు విజయవాడలోని శాతవాహన కాలేజీ కూల్చివేత తార్కాణంగా నిలుస్తోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లడించారు. కాలేజీని కూల్చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారన్న ఆయన, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కూల్చిన కాలేజీ శిధిలాల కింద విద్యార్థుల సర్టిఫికెట్లు ఉన్నా, కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆయన ఆక్షేపించారు. ఇటీవలే శాతవాహన కాలేజీ ప్రిన్సిపాల్ కిడ్నాప్నకు గురయ్యారని, కాలేజీకి చెందిన 5 ఎకరాల భూమిపై కొందరి కన్ను పడిందని, ఆ భూమి కబ్జా కోసమే ఈ దౌర్జన్యం, కూల్చివేత సాగిందని చెప్పారు. కోర్టు తీర్పు ఉందని ఎలాంటి దౌర్జన్యమైనా చేస్తారా? అని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మల్లాది విష్ణు ప్రశ్నించారు. ప్రెస్మీట్లో మల్లాది విష్ణు ఇంకా ఏం మాట్లాడారంటే..: కూలుస్తుంటే కళ్లప్పగించి చూస్తున్నారా: రాష్ట్రంలో రెడ్బుక్ పరిపాలన నడుస్తోంది. బ్రాహ్మణులను చిన్నచూపు చూస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం, వారిపై దౌర్జన్యాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. విజయవాడలో ఏకంగా శాతవాహన కాలేజీని కూలుస్తున్నా కళ్లప్పగించి చూశారు తప్ప, దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కూల్చిన కాలేజీ శిధిలాల కింద విద్యార్థుల విలువైన సర్టిఫికెట్స్ ఉన్నాయి. కాలేజీ యాజమాన్యం వాటిని భద్రపర్చే అవకాశం కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రి హేయంగా కాలేజీని కూల్చేశారు. విలువైన భూమిపై కన్ను: విజయవాడలో శాతవాహన కాలేజీకి 5 ఎకరాల భూమి ఉంది. నగరంలో ఖరీదైన ప్రదేశంలో కాలేజీ ఉంది. ఆ భూమిపై కన్నేసిన కొందరు, కొన్నాళ్లుగా అనైతికంగా వ్యవహరిస్తున్నారు. వారం, పది రోజుల ఏకంగా కాలేజీ ప్రిన్సిపాల్ను కిడ్నాప్ చేశారు. ఆయన్ను బెదిరించి, బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని చెబుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉదాసీనంగా వ్యవహరించారు. ఆ తర్వాత కోర్టు తమకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చిందంటూ, రాత్రికి రాత్రే కాలేజీని నేలమట్టం చేశారు. కాగా, శాతవాహన కాలేజీకి చెందిన భూమి కోసం అధికార పక్షంలోనే రెండు వర్గాలు కొట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రభుత్వం నిద్ర పోతోందా? లేక నిద్ర పోతున్నట్లు నటిస్తోందా?. విజయవాడలో శాతవాహన కాలేజీకి ఘన చరిత్ర ఉంది. నగరంలో అనేక మంది ప్రముఖులు టీవీఎస్ శర్మ, అండవల్లి సత్యనారాయణ, రామశాస్త్రి లాంటి ప్యక్తులు ఈ కాలేజీకి కరస్పాండెంట్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రభుత్వం ఎందుకు మౌనం?: శాతవాహన కాలేజీని కూల్చేస్తుంటే ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరించారు. బ్రాహ్మణులంటే వారికి కూడా చిన్న చూపా? వారు ఏమీ చేయలేరన్న అభిప్రాయమా? మరి ఎందుకు కాలేజీని కూల్చిన వారిపై చర్యలు తీసుకోలేకపోతున్నారు?. ప్రభుత్వం కూడా ఎందుకు మౌనం వహిస్తోంది?. శాతవాహన కాలేజీ కూల్చి 48 గంటలు కావొస్తోంది. అయినా బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. అర్థరాత్రి యథేచ్ఛగా కాలేజీ భవనాలు కూల్చుతుంటే ఎవరు కూడా అటువైపు వెళ్లలేదు. కూల్చివేతలు పూర్తి అయిన తరువాత ఉదయం 7.30 గం. తర్వాత అక్కడికి వెళ్లిన పోలీసులు ఫిర్యాదు స్వీకరించకుండా, దానిపై న్యాయ సలహా తీసుకుంటామని చెప్పడంలో అర్ధం ఏమిటి?. వాస్తవానికి గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే, శాతవాహన కాలేజీ స్వాధీనం కోసం జీఓ ఇచ్చి, ఆ తర్వాత రద్దు చేశారు. మళ్లీ ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఈ కుట్ర జరుగుతోంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే..: శాతవాహన కాలేజీపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి, ఈ దౌర్జన్యాలకు బాధ్యులైన వారిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. కాలేజీని వెంటనే తిరిగి నిర్మించాలి. లేని పక్షంలో దీనిపై పార్టీ పరంగా న్యాయపోరాటం చేస్తాం. అవసరమైతే సుప్రీంకోర్టు తలుపు తడతామని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పారు.