బాబూ..ఎందుకీ కడుపుమంట

ఫెడరల్‌ ఫ్రంట్‌ స్వాగతిస్తే పొత్తు అంటకడతారా..?

ఎల్లో మీడియాతో దుష్ప్రచారాలు చేయించడం నీచ రాజకీయం

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఫెడరల్‌ ఫ్రంట్‌ స్వాగతించాం

హరికృష్ణ మృతదేహం సాక్షిగా శవ రాజకీయాలు చేసింది చంద్రబాబే

అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే సంబంధిత మంత్రి ఏం చేస్తున్నాడు

వైయస్‌ జగన్‌తో కేటీఆర్‌ భేటీ అయితే ఎందుకీ ఉలిక్కిపడుతున్నారు

ప్రజలంతా చంద్రబాబు విష ప్రచారాన్ని గమనించాలి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: రాష్ట్రాల ప్రయోజనాలు, హక్కులను కాపాడేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేసిన ఫెడరల్‌ ఫ్రంట్‌ను ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతిస్తే చంద్రబాబుకు ఎందుకు కడుపు మంట అని వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భేటీ అయ్యి ప్రజలందరికీ మీడియా ద్వారా ఒక క్లారిటీ ఇచ్చారన్నారు. అయినా చంద్రబాబు, ఆయన మంత్రులు, పచ్చమీడియాను అడ్డుపెట్టుకొని మరో విష ప్రచారానికి తెరతీశారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ఏపీలోని 25 మంది ఎంపీలకు టీఆర్‌ఎస్‌లోని 17 మంది ఎంపీలు ఒక్కతాటిపైకి వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఫెడరల్‌ ఫ్రంట్‌ను స్వాగతించామన్నారు. కానీ దురదృష్టం కొన్ని పత్రికల్లో ‘పొడిచిన పొత్తు’ అని, ‘ముసుగు తీసేస్తే సరి’ పథనాలను ప్రచురించి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని బొత్స మండిపడ్డారు. ఈ మేరకు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు పత్రికా సమావేశాలతో ఇచ్చిన సమాచారం, అత్యుత్సాహంతో ఎల్లో మీడియా ప్రజలను తప్పుదోవపట్టించడానికి దుష్ప్రచారాలకు తెరతీసిందన్నారు. 

పొత్తు అనేది ఏ నేపథ్యంలో ఏర్పడుతుందో చంద్రబాబు కోటరీకి, ఎల్లోమీడియాకు తెలుసా.. అని బొత్స ప్రశ్నించారు. ఒకే రాష్ట్రంలోని రెండు రాజకీయ పార్టీలు ఎక్కువ సీట్లు సాధించడానికి, లేదా ఒక పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు మరో పార్టీతో పొత్తు పెట్టుకుంటుందన్నారు. వైయస్‌ఆర్‌ సీపీలో టీఆర్‌ఎస్‌ కలిసిపోయిందని మాట్లాడుతున్న వారికి ఏపీలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఉందో.. లేదో తెలియదా అని నిలదీశారు. 2014 మాదిరిగానే 2019 ఎన్నికల్లో కూడా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. ఈ విషయంపై పార్టీ అధ్యక్షులు అనేక సందర్భాల్లో చెప్పారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, అంతేకంటే ఎక్కవ వైయస్‌ఆర్‌ సీపీకి ఏ అవసరాలు లేవన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్తామన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి కేసీఆర్‌ వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల పెద్దలతో సమావేశమయ్యారన్నారు. కేటీఆర్‌ వైయస్‌ జగన్‌ను కలిస్తే ఎందుకు చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. 

తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రసార మాధ్యమాలు, సోషల్‌ మీడియాను అడ్డుపెట్టుకొని వైయస్‌ఆర్‌ సీపీని ఏపీ ప్రజలను తిట్టిన కేసీఆర్‌తో కలుస్తారా..? 10, 11, 13 షెడ్యుల్‌లో న్న అంశాలను వ్యతిరేకించిన పార్టీతో చేతులు కలుపుతారా..? అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్న పార్టీతో ఏ విధంగా కలుస్తారు.. పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడుతున్న పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటున్నారని ప్రజల్లో అపోహలు సృష్టించి రాజకీయ లబ్ధిపొందాలని చంద్రబాబు, ఆయన మంత్రులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్ర టీఆర్‌ఎస్‌తో వైయస్‌ఆర్‌ సీపీ పొత్తు పెట్టుకోవడం లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఫెడరల్‌ ఫ్రంట్‌ను స్వాగతించామన్నారు. ప్రజలంతా ఆలోచన చేయాలని, హరికృష్ణ మృతదేహం సాక్షిగా చంద్రబాబు శవ రాజకీయాలకు తెరతీశారన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేయడానికి చంద్రబాబు కేటీఆర్‌ను సంప్రదించిన మాట వాస్తవం అని, అదే విధంగా చంద్రబాబు మీడియాతో పొత్తు గురించి మాట్లాడిన వీడియోలను పత్రికా సమావేశంలో చూపించారు. చంద్రబాబు కలవడానికి ప్రయత్నించినప్పుడు మంచి పార్టీనా..? ఇప్పుడు వైయస్‌ఆర్‌ సీపీ ఫ్రంట్‌ను స్వాగతిస్తే తిట్టిన పార్టీ అవుతుందా..? చంద్రబాబూ అని నిలదీశారు. 

కొత్తగా పుట్టిన ఏపీని పురిటిలోనే చంపినట్లు స్వార్థ రాజకీయాల కోసం నాలుగేళ్లు బీజేపీ జతకట్టి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టిందని చంద్రబాబేనని బొత్స మండిపడ్డారు. పది సంవత్సరాల ఉమ్మడి రాజధానిని ఓటుకు కోట్ల కేసు కోసం వదిలి ఈ రోజు ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కడితే ఇరిగేషన్‌ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కోర్టుకు వెళ్లి అన్యాయం అని అడిగారా..? కేంద్రానికి ఫిర్యాదు చేశారా..? ఎంత సేపు స్వార్థ రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని మండిపడ్డారు. టీడీపీ కలిస్తే ప్రయోజనాలు, ఇంకొకరు కలిస్తే కుప్పకూల్చేయడానికి అంటూ దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. తెలుగుదేశం వక్రభాష్యాన్ని, నీచపు రాజకీయాలను ప్రజలంతా గమనించాలని ప్రజలను కోరారు. 

ప్రతిపక్షంపై విమర్శలు చేసే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆకాశానికి ఎత్తుతూ రాసే పత్రికల్లో ఒకటైన పత్రికలో చంద్రబాబు, ఆయన సతీమణి ఉన్న ఫొటో పెట్టి ‘ముసుగులో గుద్దులాట’ అనే హెడ్డింగ్‌ పెడితే ఏం అనుకోవాలని, ఈ పత్రిక భాష్యం ఎలా ఉందో ప్రజలంతా ఆలోచించాలన్నారు. ఏపీలో పోలీస్‌ వ్యవస్థను కాళ్ల కింద చెప్పుల్లా చంద్రబాబు తయారు చేశాడని మండిపడ్డారు. 2014కు ముందు పోలీస్‌ వ్యవస్థకు మంచి గుర్తింపు ఉండేదని, మళ్లీ అలాంటి గుర్తింపు వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే వస్తుందన్నారు. దయచేసి ప్రజలంతా టీడీపీ మోసపు మాటలు నమ్మొద్దని, ఒకసారి వంచించపడ్డా.. ఊసరవెల్లి రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. దేశ రాజకీయాల్లో మనకంటూ ఒక స్థానం కల్పించుకోవాలని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాలని బొత్స సూచించారు. తెలుగు ప్రజలందరినీ కలుపుకొని వెళ్లి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటామన్నారు. 

 

తాజా వీడియోలు

Back to Top