చంద్రబాబు మెయిన్‌ విలన్‌..పవన్‌ సైడ్‌ విలన్‌ 

ఉహా చిత్రాలు, గ్రాఫిక్స్‌తో బాబు ఐదేళ్లు కాలయాపన

 రాజధానిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు

అమరావతిలో ఒక్కటైనా శాశ్వత కట్టడం ఉందా?

పవన్‌ విమర్శలకు కౌంటర్‌ ఇవ్వడం తప్పా?

పవన్‌ చాలా కామెడీగా మాట్లాడుతున్నారు

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

తాడేపల్లి: పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లో చిరంజీవి అశీస్సులతో హీరో అయ్యారని, రాజకీయాల్లో హీరో కాలేకపోయారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. రాజకీయాల్లో చంద్రబాబు మెయిన్‌ విలన్‌ అయితే..పవన్‌ సైడ్‌ విలన్‌ అయ్యారన్నారు. పోటీ చేసిన రెండు చోట్లా పవన్‌ తుక్కుతుక్కగా ఓడిపోయారని విమర్శించారు. పవన్‌ మాటలకు అర్థంపర్థం లేకుండా పోయిందని, ఆయన కామెడీగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు వేల కోట్లు దోచుకున్నారని,  ఒక్క శాశ్వత కట్టడం కూడా అమరావతిలో కనిపించదన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. 
వరల్డ్‌ లార్జెస్ట్‌ సిటీ అమరావతి అంటూ గ్రాఫిక్స్‌ ఫొటోలు చూపించారని, మన రాష్ట్రంలో చంద్రబాబు చూపించిన ఫొటోలు, బిల్డింగ్‌లు ఎక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు.సింగపూర్‌ ఫోటోలో చూపించి ఇదే అమరావతి అన్నారు. కృష్ణానదిపై ఐకాన్‌ బ్రిడ్జి అన్నారు. ఎక్కడైనా కనిపించిందా?. తెలియని వాళ్లు ఈ ఫోటోలు చూసి అమరావతి అద్భుతంగా ఉందనే భ్రమలు కల్పించారన్నారు. ఉహా చిత్రాలు, గ్రాఫిక్స్‌తో బాబు కాలయాపన చేశారన్నారు. దేశంలో దొరికిన చోటల్లా అమరావతి పేరుతో చంద్రబాబు అప్పులు చేశారని మండిపడ్డారు. రాజధాని పేరుతో రూ.9 వేల కోట్లు చంద్రబాబు వృథా చేశారని విమర్శించారు. ప్రజలను ఊహా ప్రపంచంలో తిప్పి సర్వనాశనం చేశారన్నారు. స్వైర్‌ ఫీట్‌కు రూ.12 వేలు వెచ్చించి తాత్కాలిక సచివాలయం నిర్మించారన్నారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించి, అమరావతిని నిర్మిస్తున్నామని గొప్పులు చేసి చంద్రబాబు సాధించింది ఏంటని ప్రశ్నించారు. రాజధానికి ఐదేళ్లలో నోటిఫికేషన్‌ ఇవ్వలేదన్నారు. అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉందని, ఏపీకి మాత్రం ఆ పరిస్థితి లేకుండా చంద్రబాబు పాలన సాగించారన్నారు. రాజధాని అంతా కూడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారే తప్ప..సాధించింది ఏమీ లేదన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. అమరావతిలో ఒక్కటైనా శాశ్వత కట్టడం ఉందా అని ప్రశ్నించారు. రాజధాని పేరుతో రైతులను మోసం చేశారని ధ్వజమెత్తారు. కిలోమీటర్‌కు రూ.7 కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. రాజధాని చుట్టూ చంద్రబాబు బినామీలు భూములు కొన్నారని పేర్కొన్నారు. అమరావతికి శంకుస్థాపన చేసిన తరువాతే టీడీపీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారని, అమరావతి ఇప్పటికీ పూర్తి కాలేదని, అయితే టీడీపీ కార్యాలయ నిర్మాణం పూర్తి కావొస్తుందన్నారు.
ఇసుకపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 14న చంద్రబాబు ఇసుక దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఏదో విధంగా వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారని తెలిపారు. 
పవన్‌ కళ్యాణ్‌ కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. కర్నూలులో హైకోర్టు పెట్టుకోవాలని, పులివెందులకు దగ్గరగా ఉంటుందని పవన్‌ వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. ఆర్థిక నేరగాడు, జైలుకు వెళ్లి వచ్చాడని రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి పవన్‌ అవాక్కులు, చవాక్కులు మాట్లాడటం తప్పుకాదా అని నిలదీశారు.  మా జగన్‌ను ఎందుకు దూషిస్తున్నారని ప్రశ్నించారు. రాంబాబు ఇంటికి పెళ్లికి వెళ్లానని పదే పదే పవన్‌ పేర్కొనడం బాధాకరమన్నారు. అంటే పెళ్లికి వచ్చినంత మాత్రానా రాజకీయంగా విమర్శించకూడదా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు కూడా పెళ్లికి వచ్చారని, వారిని రాజకీయంగా విమర్శించామని చెప్పారు. లక్షల పుస్తకాలు చదివిని మేధావి పెళ్లి గురించి మాట్లాడటం సరికాదన్నారు. నేను ఫ్యాక్షనిస్టునా? సత్తెనపల్లికి వచ్చి తెలుసుకోవాలన్నారు.
విజయసాయిరెడ్డి గురించి కూడా పవన్‌ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హద్దు అదుపు లేకుండా పవన్‌ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పవన్‌ చాలా కామెడిగా మాట్లాడుతున్నారని, ఆయన మాటలకు అర్థంపర్ధం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములే కొలబద్దలు అన్నారు. రెండు చోట్ల ఓడిపోయిన పవన్‌ సీఎంను విమర్శించడం సరికాదన్నారు. ఇప్పటికైనా పవన్‌ ఇలాంటి విధానాలు మానుకోవాలని సలహా ఇచ్చారు. పవన్‌ సినిమా హీరో అన్నారు..చిరంజీవి ఆశీస్సుల వల్ల సినిమాల్లో హిట్‌ అయ్యారన్నారు. రాజకీయాల్లో హీరో కాలేకపోయారని, సైడ్‌ విలన్‌ అయ్యారని ఎద్దేవా చేశారు. మెయిన్‌ విలన్‌ చంద్రబాబు అయితే సైడ్‌ విలన్‌ పవన్‌ అయ్యారని, చంద్రబాబుకు నెరసిన గడ్డం..మీదేమో నల్ల గడ్డమని, మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌ అని అభివర్ణించారు.  అరే సాంబా రాసుకో..నాకో తిక్కుంది..దానికో లెక్క ఉందని రాసుకోవాలని డైలాగ్‌ విసిరారు.  పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ సంస్కారం నేర్చుకోవాలని అంబటి రాంబాబు హితవు పలికారు. 

 

Read Also: ఇసుక మాఫియా, స్మగ్లింగ్‌  నివారణకు కఠిన చర్యలు 

Back to Top