యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా జాబ్‌ మేళాలు

నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించే జాబ్‌మేళా పోస్టర్‌ను విడుదల చేసిన విజయసాయిరెడ్డి

మే 7, 8 తేదీల్లో నాగార్జున వర్సిటీలో జాబ్‌మేళా

ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు

ప్రకాశం జిల్లాల యువత, ఉద్యోగార్థులకు అవకాశం

భవిష్యత్తులో మరిన్ని జాబ్‌మేళా కార్యక్రమాలు

కార్యక్రమంపై ప్రతిపక్షాల విమర్శ అర్థరహితం

తాడేపల్లి: యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా జాబ్‌ మేళాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్ వి.విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.  మే 7, 8 తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించనున్న మెగా జాబ్‌మేళా పోస్టర్‌ను పార్టీ కేంద్ర కార్యాలయంలో  వి.విజయసాయిరెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేత‌ల‌తో క‌లిసి ఆవిష్క‌రించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

 
రెండు జాబ్‌మేళాలు సక్సెస్‌:
    ఈ జాబ్‌మేళాకు వచ్చే ఉద్యోగార్థులు  ( www.ysrcpjobmela.com )   వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పార్టీ అధ్యక్షులు, సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఇప్పటికే తిరుపతి, విశాఖపట్నంలో నిర్వహించిన జాబ్‌మేళాలు గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యాయి. ఇప్పుడు గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మే 7, 8న మూడో జాబ్‌మేళా నిర్వహిస్తున్నాం. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.

లక్ష్యానికి మించి..:
    వాస్తవానికి ఈ కార్యక్రమం తలపెట్టినప్పుడు మూడు జాబ్‌మేళా (తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు)ల్లో మొత్తం 15 వేల ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే తొలి రెండు కార్యక్రమాల్లోనే ఆ లక్ష్యాన్ని మించి, 30 వేలకు పైగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించే జాబ్‌మేళా కూడా గ్రాండ్‌ సక్సెస్‌ అవుతుందని భావిస్తున్నాం. ఆ కార్యక్రమానికి 208 కంపెనీలు రిజిస్టర్‌ చేసుకున్నాయి. 

విపక్షాల విమర్శ అర్థరహితం:
    వైయస్సార్‌సీపీ జాబ్‌మేళాలను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. జాబ్‌మేళాలో ఇస్తోంది సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలే అంటూ ఎద్దేవా చేస్తున్నాయి. కానీ వారి విమర్శలు అర్థరహితం. జాబ్‌మేళాల్లో ఉద్యోగాలు పొందిన వారి కనీస వేతనం రూ.15 వేలు కాగా, గరిష్ట వేతనం లక్షకు పైనే ఉంది. ఐటీ రంగంలోనూ అత్యధిక ఉద్యోగాలు లభిస్తున్నాయి.

ఏయే జిల్లాల వారికి అవకాశం?:
    ఆచార్య నాగార్జున యూనివర్శటీలో నిర్వహించే బాజ్‌మేళాకు ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ జాబ్‌మేళాకు 77వేల మంది నిరుద్యోగులు రిజిస్టర్‌ చేసుకున్నారు. ఇక్కడ కూడా వీలైనంత ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని భావిస్తున్నాం. 

అదే సీఎంగారి లక్ష్యం:
    రాష్ట్రంలో ఏ ఒక్కరూ నిరుద్యోగిగా మిగలకూడదని అంత వరకు ఈ జాబ్‌ మేళా కార్యక్రమం కొనసాగించాలని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతి జాబ్‌ మేళాలకు చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వచ్చారు. తమ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినప్పుడు వారి ముఖాల్లో అంతులేని ఆనందం కనిపించింది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వస్తే, ఆ కుటుంబ తలసరి ఆదాయం పెరుగుతుంది. తద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) పెరుగుతుంది. పారిశ్రామిక ఉత్పాదకత కూడా పెరుగుతుంది. ఇంకా  ప్రత్యక్ష, పరోక్ష లాభాలు కూడా ఉంటాయి. రాబోయే రెండేళ్లలో మరిన్ని జాబ్‌ మేళాలు నిర్వహిస్తాం. ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందం వెల్లివిరియాలన్నదే సీఎంగారి లక్ష్యం.. అని శ్రీ విజయసాయిరెడ్డి వివరించారు. 

 కార్యక్రమంలో మంత్రులు అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు,  మేరుగ నాగార్జున, పార్టీ సీనియర్‌ నేత, మండలిలో ప్రభుత్వ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డితో పాటు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Back to Top