బాపట్ల: వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు బాపట్ల ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన వ్యాఖ్యలు మహిళలను అవమానించే విధంగా ఉన్నాయని పేర్కొంటూ సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రేపల్లె నియోజకవర్గం వైయస్ఆర్సీపీ సమన్వయకర్త పీటా నాగ మోహన్ కృష్ణ, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు, పర్చూరు సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి తదితరులు కలిసి ఎస్పీని కలిసి ఫిర్యాదు పత్రం అందజేశారు. అనంతరం ఎస్పీ కార్యాలయం వెలుపల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడుతూ, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను సహించబోమని స్పష్టం చేస్తూ, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని, బాధ్యులపై వెంటనే కేసులు నమోదు చేయాలని వైయస్ఆర్సీపీ నేతలు కోరారు.