విశాఖపట్నం: విశాఖలో పెట్టుబడులు, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని విశాఖ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కెకె రాజు కూటమి నాయకులకు సవాల్ విసిరారు. విశాఖ లోని పార్టీ సిటీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలోని తర్లువాడలో శంకుస్థాపన చేసిన గూగుల్ డేటా సెంటర్కి వైయస్ఆర్సీపీ హయాంలోనే బీజం పడిందని, టీడీపీ కరపత్రిక ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలను చూసైనా టీడీపీ నాయకులు అంగీకరించక తప్పదని చెప్పారు. డేటా సెంటర్ ఏర్పాటుతో మన రాష్ట్రానికి ఏం లాభమో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రెండేళ్ల పాలనలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేసుకోవడం తప్ప ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేసిందేమీ లేదని ఆరోపించారు. చివరికి ముఖ్య ఆదాయ వనరుగా ఉన్న కెకె లైన్ లేకుండా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటైనా దాని గురించి చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, రెన్యూ ఎనర్జీ, గూగుల్ డేటా సెంటర్ వంటివన్నీ వైయస్ జగన్ కృషితోనే ఏర్పాటైతే, చంద్రబాబు తన గొప్పతనం అన్నట్టు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నాడని ఆక్షేపించారు. పారిశ్రామికవేత్తల సమక్షంలో రాజకీయాలు మాట్లాడి లోకేష్ రాష్ట్ర పరువు తీశాడన్న కెకె రాజు, విశాఖలో జి అక్షరం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. విశాఖలో వి అంటే.. వైయస్ఆర్సీపీ పాలనలో విశ్వసనీయత అయితే, టీడీపీ పాలనలో వెన్నుపోటు అని ఎద్దేవా చేశారు. నారా లోకేష్ ప్రాసల కోసం ప్రయాస పడకుండా తన సొంత శాఖ మీద దృష్టిపెడితే మంచిదని కెకె రాజు హితవు పలికారు. - డేటా సెంటర్తో మనకేం లాభమో చెప్పాలి కదా నిన్న విశాఖలో గూగుల్, అదానీ, ఎయిర్ టెల్ సంయుక్తంగా ప్రారంభించిన 1 గిగా వాట్ డేటా సెంటర్ కి చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించింది. సాధారణంగా ఏదైనా పరిశ్రమ ప్రారంభోత్సవం జరుపుకొంటుంటే దాని వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు, యువతకు వచ్చే ఉద్యోగాల గురించి ప్రధానంగా చెప్పడం జరుగుతుంటుంది. ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాలతోపాటు కంపెనీ ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిగే ప్రయోజనాలను వివరిస్తూ పారిశ్రామికవేత్తలు రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తారు. కానీ నిన్న జరిగిన డేటా సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అవేమీ కనిపించలేదు. ఇంత వయసొచ్చిన చంద్రబాబుకి ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. పొలిటికల్ ప్రసంగాలు చేయాల్సిన చోట సంక్షేమ పథకాలు అమలు చేశానని అబద్ధాలు చెప్పడం, కంపెనీల ఏర్పాటు సందర్భంగా రాష్ట్రాన్ని ప్రమోట్ చేయాల్సిన పరిస్థితుల్లో రాజకీయ ప్రసంగాలు చేస్తూ రాష్ట్రం పరువు తీస్తున్నాడు. తండ్రిని కొడుకు, కొడుకుని తండ్రి జాకీలు పెట్టి లేపుకోవడంతోనే సరిపోతోంది. రాష్ట్రం గురించి వీరిద్దరికీ ఏమీ పట్టడం లేదు. - వైయస్ఆర్సీపీ హయాంలోనే డేటా సెంటర్కి బీజం గత వైయస్ఆర్సీపీ హయాంలోనే అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకి అంకురార్పణ జరిగింది. నిన్న విశాఖ జిల్లా తర్లువాడులో శంకుస్థాపన జరుపుకొన్న డేటా సెంటర్ ఏర్పాటుకు ఆనాడే జీజం పడింది. గత మా ప్రభుత్వ హయాంలోనే డేటా సెంటర్ ఏర్పాటు కోసం 2020 నవంబర్లో 130 ఎకరాల స్థలం ఇవ్వడంతోపాటు 2021 మార్చి 9న 3900 కిమీల సబ్సీ కేబుల్ ఏర్పాటుకు అనుమతి కోరుతూ సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అదానీ డేటా సెంటర్కి అన్ని ప్రోత్సాహకాలు కల్పించాం. డేటా సెంటర్ ఏర్పాటు కోసం 2023లో భూమి పూజ చేయడం జరిగింది. వైయస్ జగన్ గారు కంపెనీలు తీసుకొస్తుంటే ఓర్వలేక దాన్ని ఏమార్చి బురదజల్లడానికి టీడీపీ అధికార పత్రిక ఆంధ్రజ్యోతిలో అదానీ అడిగాడని దోచిపెట్టారంటూ రాసింది. ఆనాడు 300 మెగావాట్ల అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు వైయస్ జగన్ చేసుకున్న ఒప్పందానికి కొనసాగింపులో భాగంగానే అదానీ, ఎయిర్టెల్, గూగుల్ సంస్థలు సంయుక్తంగా 1 గిగా వాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. - విశాఖ జీఐఎస్ సదస్సుతో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు పెర్ఫార్మెన్స్లో వీక్ క్రెడిట్ చోరీలో పీక్ అన్నట్టు డేటా సెంటర్ తన ఘనతే అన్నట్టు ప్రచారం చేసుకున్నాడు. గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగిందని, పెట్టుబడిదారులు పారిపోయారని ప్రచారం చేశారు. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కి అదానీ,అంబానీ, భజరంకా, జిందాల్ వంటి పారిశ్రామిక దిగ్గజాలు స్వయంగా విచ్చేసి రూ. 13 లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నమాట వాస్తవమా కాదా? పూడిమడక దగ్గర ఉన్న ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, రాంబిల్లిలో వారం క్రితం చంద్రబాబు శంకుస్థాపన చేసిన రెన్యూ ఎనర్జీ ప్రాజెక్టు, నిన్న తర్లువాడలో శంకుస్థాపన చేసి అదానీ డేటా సెంటర్.. ఇవన్నీ వైయస్ జగన్ గారి కృషితో రాష్ట్రంలో ఏర్పాటైనవే. వైయస్ఆర్సీపీ హయాంలోనే వాటి ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి. విశాఖలో ఏర్పాటైన ఇన్ఫోసిస్ కూడా వైయస్ జగన్ గారి ఘనతే. విశాఖ సిరిపురం జంక్షన్లో వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో అద్భుతమైన డెక్ బిల్డింగ్ కూడా వైయస్ జగన్ గారి కృషితోనే ఏర్పాటైంది. ఆ బిల్డింగ్లో రైల్వేజోన్ తాత్కాలిక కార్యాలయం గత కొన్ని నెలలుగా కొనసాగుతుంటే నిన్న చంద్రబాబు దానికి రిబ్బన్ కటింగ్ చేయడం సిగ్గుచేటు. మూల పేట పోర్టు, భోగాపురం ఎయిర్పోర్ట్ లు కూడా వైయస్ జగన్ గారి కష్టంతో ఏర్పాటైతే అది కూడా తన ఘనతేనని చంద్రబాబు చెప్పుకుంటున్నాడు. - కెకె లైన్ లేకుండా విశాఖ రైల్వే జోన్ పెట్టుబడులు ఆకర్షించింది నిజమే అయితే 2014-19 మధ్య గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క కంపెనీ అయనా ఎందుకు ఏర్పాటు కాలేదో చెప్పాలి. టీడీపీ హయాంలో, వైయస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై తెలుగుదేశం నాయకులతో బహిరంగంగా చర్చించడానికి సిద్ధం. వారు సిద్ధంగా ఉంటే చెప్పాలి. విశాఖతోపాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎవరి హయాంలో పెట్టుబడులు వచ్చాయి, ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చర్చించడానికి ఎక్కడికైనా వస్తా. సొంత డబ్బా కొట్టుకోవడం మానుకుని ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంపైన దృష్టిపెట్టాలి. ఆర్థికంగా రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూరే కెకె లైన్ లేకుండా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసినా దాని గురించి విజనరీనని చెప్పుకునే చంద్రబాబు ఆలోచించడం లేదు. - లోకేష్ మన రాష్ట్రం పరువు తీశాడు వేదికపై ఉన్నవారంతా టీడీపీ కార్యకర్తలన్నట్టు పారిశ్రామికవేత్తల సమక్షంలో ఎన్నికల గురించి, మెజారిటీ గురించి నారా లోకేష్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. లోకేష్ ఎక్కడెలా మాట్లాడాలో తెలుసుకోవాలి. ప్రాస కోసం ఇష్టమొచ్చినట్టు జి అంటే గూగుల్, వైయస్ఆర్సీపీ కి జీ అంటే గొడ్డలి అంటున్నాడు. అసలు విశాఖలో జి అక్షరం ఎక్కడుందో ఆయనకే తెలియాలి. మేం కూడా చెబుతున్నాం.. విశాఖలో వి అంటే వైయస్ఆర్సీపీ విషయంలో విశ్వసనీయత, టీడీపీ పాలనలో వెన్నుపోటు. లోకేష్ తన సొంత విద్యాశాఖలో జరుగుతున్న అక్రమాల గురించి విద్యార్థులకు అందాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల గురించి ఆలోచిస్తే మంచిది.