తాడేపల్లి: అధికారం జన్మతావచ్చిన హక్కుగా నిమ్మగడ్డ భావిస్తున్నాడని, రాచరికం రాజులా తీర్పులు ఇస్తూ వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరం, ఆక్షేపణీయం అని వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నిమ్మగడ్డ వ్యతిరేకించని డిపార్టుమెంట్ ఏదైనా మిగిలి ఉందా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగం లేకుండా ఎన్నికలు ఎలా జరుపుతారు..? తెలుగుదేశం పార్టీ గూండాలను పెడతారా..? టీడీపీ లాయర్లనా..? చంద్రబాబు ఏజెంట్లను పెట్టి నడుపుతారా..? అని నిలదీశారు. ఎన్నికల కమిషన్ నీ సొంత రాజ్యాంగమా..? అని సజ్జల రామకృష్ణారెడ్డి ఎస్ఈసీని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమ్మగడ్డ రమేష్కుమార్ తనపై విమర్శలు చేయాలనుకుంటే టీడీపీ ఆఫీస్లో ప్రెస్మీట్ పెట్టాలన్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఉంటే పొలిటికల్గా మాట్లాడకూడదనే అంశం ఎక్కడి నుంచి వచ్చింది. ఎస్ఈసీగా ఉండి.. పొలిటికల్ పార్టీలో ఎవరు ఉండాలి.. ఎక్కడ కూర్చొని మాట్లాడాలని చెప్పే అధికారం నిమ్మగడ్డకు లేదన్నారు. తాను పదేళ్లుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నానని, పార్టీ ప్రధాన కార్యదర్శిగా, వైయస్ జగన్ పొలిటికల్ సెక్రటరీగా ఉన్నానని, ప్రభుత్వ సలహాదారుకంటే ముందు పార్టీ ప్రధాన కార్యదర్శిని అని గుర్తుచేశారు.
ఇంకా ఏం మాట్లాడారంటే..
ఏ ఎన్నికల కమిషన్ అయినా రెఫరీ లాంటి వ్యవస్థ. సార్వత్రిక ఎన్నికలు, స్థానిక ఎన్నికలకు అలాంటి అధికారాలతోనే ఒక వ్యవస్థ క్రియేట్ అయ్యింది. ఎన్నికల కమిషనర్ స్థానంలో ఉన్న వ్యక్తి తొందరపడి నిర్ణయాలు తీసుకోరు.. వ్యక్తిగత అభిప్రాయాలు ఏర్పాటు చేసుకోరు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రతినిధిగా ఉన్న గోపాలకృష్ణ ద్వివేదిపై బెదిరింపులకు పాల్పడ్డారు. అయినా ద్వివేది ప్రశాంతంగా బాబు మాటలు విన్నారు. ఆ ఘటనకు చంద్రబాబుపై అట్మెట్ మర్డర్ కేసు పెట్టాలి. అలా కాకుండా ద్వివేది హుందాగా వ్యవహరించారు. ఎన్నికల అంశంపై ఏకాగ్రత పెట్టే విజ్ఞత ఎన్నికల కమిషన్ స్థాయిలో ఉండే వ్యక్తికి ఉంటుందని అందరూ భావిస్తారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ అనే వ్యక్తి ఐఏఎస్ ఎలా అయ్యాడో, అంతకాలం సర్వీసులో ఎలా ఉన్నాడో తెలియదు కానీ, 2019 మార్చి 15న బట్టలు విప్పిన వ్యక్తి అక్కడి నుంచి విషృంకలంగా రోజు రోజుకు మితిమీరి ప్రవర్తిస్తున్నారు. ఎన్నికల కమిషనర్గా అనడం లేదు. నిమ్మగడ్డ రమేష్కుమార్గా మాత్రమే అంటున్నాను.
ఎన్నికల కమిషన్పై వైయస్ఆర్ సీపీ ఎప్పుడు నోరుజారి ఎప్పుడూ మాట్లాడలేదు. తెలుగు డ్రామా పార్టీ లేనిపోనివి కల్పించి దుష్ప్రచారం చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్కుమార్ గీత కాదు.. హద్దులు కూడా దాటేశారు. సర్వీస్లో ఉన్న ఐఏఎస్ అధికారులపై దూషణలకు దిగి సంస్కారహీనుడిగా కూడా నిమ్మగడ్డ రుజువు చేసుకున్నారు.
2019 మార్చి 15వ తేదీన ఎన్నికల వాయిదా సమయంలో కోవిడ్ను మాత్రమే కారణంగా చూపారు. ఎన్నికలు వాయిదా వేసినన్ని రోజులు మోడల్ కోడ్ ఉంటుందని చెప్పడంలోనే అభివృద్ధికి అడ్డుపడుతున్నాడని అర్థం అవుతుంది. మార్చి 18న సెంట్రల్ హోంమంత్రికి రాసిన లేఖ నుంచి మొదలైంది. దేశ చరిత్రలో అలాంటి లేఖలు ఎవరూ రాసి ఉండరు.
చంద్రబాబు తరఫున ఏజెంట్గా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని ఆ లేఖతో అర్థం అయిపోయింది. అధికారంలో ఉన్న పార్టీ నాయకులను గూండాలని మాట్లాడాడు. ఫ్యాక్షనిస్టు అని, అతనికి, అతని కుటుంబానికి ప్రాణాలకు ప్రమాదం ఉందన్నారు. ఎన్నికల్లో హింస విపరీతంగా జరిగిందన్నారు. గతం కంటే ఏకగ్రీవాలు ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు. ఏకగ్రీవాలు అత్యధికంగా ఉంటే హింసలు ఎలా పెరుగుతాయి.?
సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లు, 86 శాతం సీట్లు వైయస్ఆర్ సీపీ గెలుచుకుంది. రాష్ట్రం మొత్తం వైయస్ జగన్ను ఆశీర్వదించింది. వైయస్ఆర్ సీపీకి పట్టం కట్టింది. ఏడాదిరన్నర పాటు వినూత్న పథకాలు ప్రవేశపెట్టిన తరువాత ప్రజల మద్దతు ఉండటంలో, ఏకగ్రీవాలు కావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
2018లో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు 2021 వరకు ఎందుకు జరగలేదంటే.. ఎవరు దానికి బాధ్యులు, ఎవరు ప్రధాన నేరస్తులు.. నిమ్మగడ్డ రమేష్కుమార్, చంద్రబాబు కాదా..? చంద్రబాబు అజెండాను మోస్తూ.. ఎన్నికల కమిషన్ అధికారాలకు భంగం కలిగిందనే భాష్యం చెప్పడం అంటే.. అధికారాల గురించి మాట్లాడే అర్హత నిమ్మగడ్డకు లేదు. నిమ్మగడ్డ రమేష్ రాజకీయ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు.
సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ను కూడా ఎన్నికల నుంచి డిస్మిస్ చేయాలంటున్నాడు. సొంత ఏజెంట్ల మాటలు విని నిర్ణయాలు తీసుకునే హక్కు ఎన్నికల కమిషనర్కు లేదని తెలియదా..? అలా అయితే మీ ఇంట్లో వాళ్ల పెట్టుకొని నడిపించొచ్చు.. లేదంటే టీడీపీ ఆఫీస్లో దుకాణం పెట్టుకొని అక్కడి నుంచే నడుపొచ్చు కదా..? పలానా వాళ్లు చెప్పారని అధికారులను తొలగించడాన్ని రాజ్యాంగం ఒప్పుకోదని తెలియదా..?
ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డకు అజమాయిషీ కొద్దికాలమే. మళ్లీ వైయస్ఆర్ సీపీ ప్రభుత్వమే కదా.. నిమ్మగడ్డ పాసింగ్ క్లౌడ్లా వచ్చి వెళ్తారు. మహా అయితే మీకో అల్పసంతోషిగా మీకు సంతోషం మిగలొచ్చు. సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం నడుస్తుంది. ఎందుకు చంద్రబాబు మాటలు నమ్ముకొని పనిచేస్తున్నారు. బాబు పంపుకొట్టి పైకెక్కించాడని పరువుపోగొట్టుకోవద్దు. నిమ్మగడ్డ రమేష్ లాఫింగ్ స్టాచ్యూలా అతనికి అతనే తయారయ్యాడు.
ఎన్నికలు ఎక్కడ నిలిచిపోయాయో అక్కడి నుంచే మొదలుపెడతామని హామీ ఇచ్చిన నిమ్మగడ్డ రమేష్.. పంచాయతీ ఎన్నికలను ఎందుకు మొదటగా నిర్వహిస్తున్నారు. నిమ్మగడ్డ దుర్బుద్ధి, దురాలోచన ఇక్కడ బయటపడుతుంది. కక్షలు, కార్పణ్యాలు రెచ్చగొట్టి శవాల మీద పేలాలు ఏరుకున్నట్లు, మురికిగుంటలో చేపలు పట్టినట్లు నాలుగు ఓట్లు టీడీపీ వస్తాయేమో.. దాని ప్రభావం లోకల్ బాడీ ఎలక్షన్స్లో చూపకపోతుందా.. అనే చంద్రబాబు దురాశను అమలు చేయడం లేదా అని నిమ్మగడ్డను ప్రశ్నిస్తున్నాం.
టీడీపీ వాళ్లు నోటికి వచ్చినట్లుగా తిడుతుంటే మేము ఖాళీగా కూర్చోవాలా..? సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు కావడం కంటే ముందు వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ అధ్యక్షుడికి పొలిటికల్ సెక్రటరీ. గత పదేళ్ల నుంచి పార్టీలో సీనియర్ పొజీషనల్లో ఉన్న వ్యక్తిని.
ప్రభుత్వ సలహాదారుగా ఉంటే పొలిటికల్గా మాట్లాడకూడదనే అంశం ఎక్కడి నుంచి వచ్చింది. ఎస్ఈసీగా ఉండి.. పొలిటికల్ పార్టీలో ఎవరు ఉండాలి.. ఎక్కడ కూర్చొని మాట్లాడాలని చెప్పే అధికారం నిమ్మగడ్డకు లేదు. చంద్రబాబులా తమ్ముడిలా... ఆయన సొంత ప్రయోజనాలు కాపాడే వ్యక్తిగా మెడలో ఎముకలు వేసుకొని నిమ్మగడ్డ ప్రవర్తిస్తున్నారు. కాబట్టే ప్రశ్నిస్తున్నాం.
నిస్పక్షపాతంగా ఎన్నికలు జరిపే మంచి అవకాశాన్ని నిమ్మగడ్డ మిస్ అయ్యారు. చరిత్ర హీనుడిగా మిగిలిపోయారు. నిమ్మగడ్డ శైలి వల్ల మా గౌరవం పెరిగింది. చంద్రబాబు రుణం తీర్చుకోవడానికో తెలియదు కానీ, నిమ్మగడ్డ టార్గెట్ అంతా వైయస్ఆర్ సీపీ, గవర్నమెంట్ పైనే. క్రియేట్ చేసి మరీ మాపై తప్పుడు కేసులు పెడతారని గట్టిగా నమ్ముతున్నాం. టీడీపీకి ఇంకా నూకలు ఉన్నాయని చూపించేందుకు నిమ్మగడ్డ ప్రయత్నం.
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోకే దిక్కులేదు. 600 పై చిలుకు వాగ్దానాలు ఇచ్చి అడ్డదారుల్లో చంద్రబాబు గెలిచాడు. 2019 ఎన్నికలు వచ్చే సరికి మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి తీసేశావే.. మేనిఫెస్టో అంటే నీకు గౌరవం ఉందా చంద్రబాబూ..?
పార్టీ రహిత ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడం ఏంటీ..? కొంతైనా ఆలోచన లేదా..? జనం నవ్వుకుంటారని తెలియదా..? ప్రభుత్వం ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని అంటుంటే.. నువ్వు నామినేషన్ ఎలాగోలా వేయండి అని మాట్లాడుతున్నాడు. 40 ఏళ్ల ఇండస్ట్రీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం తప్పు.
పంచాయతీ ఇంటి స్థలాలు కేటాయించి.. ఇళ్లు కట్టించగలదా..? ఒక పంచాయతీ ఆస్తిపన్ను పెంచడం, తగ్గించడం చేయగలదా..? కాలనీలు రోడ్లు శుభ్రం చేయడానికి గల్లిస్థాయి నాయకుడు సరిపోతారు. దానికి అంతర్జాతీయ మేధావి.. పంచాయతీ స్థాయిలోకి వెళ్లి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారంటే.. ఏమనాలి ఇతన్ని. 200 శాతం మోసగాడు అని మరోసారి రుజువు చేసుకున్నాడు.
సందు దొరికితే జనాలను ఎలా మోసం చేయాలని ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు. 2014లో ఇచ్చిన రుణమాఫీ హామీకే దిక్కులేదు. పంచాయతీ ఎన్నికల్లో వాగ్దానాలిచ్చి నెరవేరుస్తావా..? 40 ఏళ్ల పార్టీ పంచాయతీ ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదల చేయడం మోసం.. దానిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. జైలు శిక్షలు వేయాలి. చంద్రబాబుకు శాశ్వతంగా బుద్ధిచెప్పేందుకు కోర్టుల ద్వారా ప్రోసిడ్ అయ్యే అవసరం ఉంది.