తాడేపల్లి: వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పోటీ చేసినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, మాకెలాంటి ఇబ్బంది లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన మూడు ఆప్షన్లపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాజకీయాల్లో సీరియస్గా ఉన్నవాళ్లు ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తారని.. కానీ విశ్లేషకుడిగా పవన్ కళ్యాణ్ ఆప్షన్లు మాత్రమే చెప్పారని అన్నారు. జనసేన తన పార్టీ అని పవన్ కళ్యాణ్ మర్చిపోయినట్లు ఉన్నారని సజ్జల చురకలు అంటించారు. బీజేపీ వస్తుందో లేదో కానీ టీడీపీతో వెళ్ళటం ఖాయమని పవన్ కళ్యాణ్ మాటలను బట్టి అర్థం అవుతోందన్నారు. చంద్రబాబు గేమ్ ప్లాన్ ప్రకారమే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారని సజ్జల విమర్శలు చేశారు. తమ కార్యకర్తలను కాపాడుకునేందుకే ఈ పొత్తుల వ్యాఖ్యలు చేశారన్నారు. టీడీపీ నేతలే ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతానంటోంది లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సజ్జల గుర్తుచేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యల్లో డొల్లతనం బయట పడిందని.. పథకాల్లో కేంద్రం వాటా ఎంత, రాష్ట్రం ఇస్తోంది ఎంత అన్నది చూడాలని సజ్జల హితవు పలికారు. తాము మాత్రమే చేస్తున్నాం.. రాష్ట్రం ఏం చేయటం లేదు అనటం తప్పు అని సజ్జల వ్యాఖ్యానించారు. పదో తరగతి ఫలితాలపై ప్రతిపక్షాల విమర్శలు సరికాదని సజ్జల అభిప్రాయపడ్డారు. నారాయణ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఫలితాల్లో తేడా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సీరియస్గా పరీక్షలు ఎలా నిర్వహించాలో అలాగే నిర్వహించడం కూడా ఎక్కువ మంది పాస్ కాకపోవడానికి కారణమన్నారు. కోవిడ్ కూడా కొంత ప్రభావం చూపించిందన్నారు. టీడీపీ దేన్ని తప్పుబడుతుందో అర్థం కావడం లేదని.. పరీక్షలు ఉండాలా వద్దా లేకపోతే పదో తరగతి కూడా అందరినీ పాస్ చేసి పంపించేయాలా అని ప్రశ్నించారు. నారాయణ, చైతన్య వంటి విద్యాసంస్థలు టీడీపీ హయాంలో ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తూ వచ్చాయని.. అందుకే 90కి పైగా ఉత్తీర్ణత సాధారణంగా కనిపించిందన్నారు. కాపీ కొట్టడానికి అవకాశం ఉండే బిట్ పేపర్ తీసేయటం కూడా పాస్ పర్సంటేజ్ తగ్గడానికి ఒక కారణం అని చెప్పవచ్చని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.